– వైద్యుడిని నియమించి సేవలు మెరుగుపర్చాలి
– మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం వద్ద గిరిజనుల ధర్నా
ముంచంగిపుట్టు (విశాఖపట్నం)
ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఆసుపత్రిని ప్రయివేటు సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ సరిహద్దు ప్రాంతంలోని 10 గ్రామాల గిరిజనులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఉదయం డుడుమ జలాశయం రవాణా మార్గానికి సంబంధించిన గేట్లు మూసివేసి ఆందోళన చేశారు. మధ్యాహ్నం ఎస్ఇ కార్యాలయానికి చేరుకొని ధర్నా చేశారు. ఆ సమయంలో ఎస్ఇ అందుబాటులో లేరు. సిబ్బంది ఆందోళనకారులకు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో సిబ్బంది తమ కార్యాలయానికి తాళాలు వేశారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం వద్దకు చేరుకుని విద్యుత్ కేంద్రం ముఖద్వారం ప్రధాన గేట్లు మూసివేసి గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఆందోళనకారులు విద్యుత్ ఉత్పత్తిని సైతం నిలుపుదల చేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. గంటకు 90 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఆసుపత్రి ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తున్నట్లు కచ్చితమైన హామీనిచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదంటూ రాత్రి కూడా అక్కడే ఆందోళన కొనసాగించారు.
మాచ్ఖండ్ పరిసర 30 గ్రామాల గిరిజనులకు వైద్య సేవలు నిమిత్తం జలవిద్యుత్ ప్రాజెక్టు ఆధ్వర్యాన ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో ఎన్నో ఏళ్లు నుంచి వైద్యుడిని నియమించలేదు. దీని వల్ల ఇక్కడకొచ్చిన రోగుల్లో ఇటీవల కాలంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వైద్యులను నియమించి సౌకర్యాలు, వైద్య సేవలను మెరుగుపర్చాలని అనేక సార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు. ఇది ఇలా ఉండగా, ఇటీవల ఈ ఆసుపత్రిని ప్రయివేటు సంస్థకు అప్పగించారు. వారు వైద్యుడిని నియమించినా సౌకర్యాలు మెరుగుపర్చలేదు. రక్తపరీక్షలు మినహా మిగిలిన అన్నింటికి జైపూర్కు రిఫర్ చేస్తున్నారు. భవిష్యత్లో ఆ సంస్థ డబ్బులు వసూలు చేస్తుందన్న భయం కూడా గిరిజనుల్లో ఉంది. దీంతో గిరిజనులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిని ప్రాజెక్టు ఆధ్వర్యాన నిర్వహించాలని, వైద్యుడిని నియమించి వైద్య సేవలు మెరుగుపర్చాలని, మృతి చెందిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, గర్భిణులకు ప్రత్యేక గైనకాలజిస్ట్ను ఏర్పాటు చేయాలని, అన్ని రకాల స్కానింగ్లు సదుపాయాలు కల్పించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లపై పది రోజులు క్రితం విన్నవించినా ప్రాజెక్టు ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై గిరిజనులు ఆగ్రహించి ఆందోళన చేపట్టారు.
Courtesy prajasakti…