- హరిత హోటల్, ఏసీ కాటేజీల్లో భక్తులకు గదులు నిల్
- గులాబీ నేతలు, మంత్రులు, అధికారుల మకాం
భూపాలపల్లి: మేడారం జాతరలో బస చేసేందుకు భక్తుల కోసమే ఈసారి లగ్జరీ గదులొచ్చాయి! అయితే ఈ ‘సౌకర్యం’ సామాన్య భక్తులకు అందకుండా పోతోంది. భక్తుల పేర్లతో అధికార పార్టీ నేతలు, అధికారులే వీటిల్లో బస చేస్తున్నారు. మేడారం, తాడ్వాయిల్లో సుమారు రూ.24 కోట్లతో నిర్మించిన గదులను గులాబీ నేతలు, అధికారులు కబ్జా చేసేశారు. మేడారం హరితలో ఒక్క గది కూడా భక్తులకు కేటాయించకపోవడం విమర్శలకు తావిస్తోంది. భక్తులకు కనీసం ఫ్లోర్, మరుగుదొడ్లు కూడా సక్రమంగా లేని షెడ్లను ఇచ్చి.. వసతులు అదరహో అంటూ డప్పేసుకుంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేడారంలో రూ.14 కోట్లతో హరిత హోటల్ను నిర్మించారు. ఇందులో 16 గదులు(డీలక్స్), 4 సూట్లు ఉన్నాయి. రోజుకు అద్దె రూ.700-1200 వరకు ఉంటుంది. తాడ్వాయిలో భక్తుల కోసమే రూ.10 కోట్లతో 30 ఏసీ కాటేజీలను నిర్మించారు. ఇక్కడా భక్తులకు ఒక్క గదీ కేటాయించలేదు. మునుపు గద్దెల సమీపంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో ఉన్న గదుల్లో కలెక్టర్కు ఒకటి, ఎస్పీకి ఒకటి కేటాయించేవారు. మిగతా 4 గదుల్లోనూ రెండింటిని మంత్రులు ఉన్నంతసేపు వాడుకునేవారు. అధికారులేమో మేడారం చుట్టు పక్క ప్రాంతాల్లో, ప్రత్యేకంగా క్యాంపు గుడారాలను ఏర్పాటు చేసుకొని విధులు నిర్వహించేవారు. హరిత హోటల్ అందుబాటులోకి రావడంతో అందరి దృష్టి వీటిపై పడింది. దీంతో భక్తులకు అందాల్సిన గదులు గులాబీ నేతలు, మంత్రులు, అధికారుల పరమయ్యాయి. విచిత్రమేమిటంటే ముఖ్యమంత్రి కార్యాలయం కోసమని హరితలో ఎస్-4 గదిని కేటాయించారు. అది అప్పుడప్పుడు తలుపులు తెరుచుకొనే ఉండటం భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. హరిత హోటల్ నుంచి కూడా సీఎం ఆఫీసు పని చేస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మేడారం హరిత కాటేజీలో 20 గదులుండగా వీటిలో డీ-10, డీ-5, డీ-6 గదులను ములుగు కలెక్టర్ పేరున రిజర్వ్ చేశారు. ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో మరో గదిని కేటాయించారు. మంత్రి ఎర్రబెల్లికి ఎస్-1, మరో ఇద్దరు మంత్రులు సత్యవతి రాథోడ్కు ఎస్-2, ఇంద్రకరణ్రెడ్డికి ఎస్-3 గదులను కేటాయించారు. వీరికి ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలోనూ గదులు కేటాయించారు. దీంతో భక్తులకు కేటాయింపు లేకుండా పోయింది. ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్కు డీ-9 గది కేటాయించారు. పోలీసులకు రెండు, టూరిజంకు రెండు గదులు, ట్రైబల్ వెల్ఫేర్కు ఒక గది కేటాయించారు. తాడ్వాయి హరిత కాటేజీలో 30 ఏసీ గదులను పోలీసులకు, అధికారులకు కేటాయించారు. దీంతో ఇక్కడ బస చేసే అదృష్టం భక్తులకు లేకుండా పోయింది.
Courtesy Andhrajyothi