ఏప్రిల్ 15లోగా అదుపులోకి రాదు.. విజృంభిస్తే పరిస్థితి తీవ్రమే
న్యూఢిల్లీ : దేశాన్ని కమ్మేసిన కరోనా వైర్సను అరికట్టేందుకు 21 రోజుల లాక్ డౌన్ సరిపోదని, ఏప్రిల్ 15 త ర్వాత మరిన్ని రోజులు లాక్డౌన్ ను పొడిగించే అవకాశాలు లేకపోలేదని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే అప్పటికి కరోనా వైరస్ అరికట్టే విషయంలో మనం ఎంతవరకు సఫలమవుతామో స్పష్టంగా తెలుస్తుందని ఆయన ఆంధ్రజ్యోతితో అన్నారు. ‘‘ఒక దేశాధినేతగా ప్రధానమంత్రి ఏ చర్యలు తీసుకోవాలో అవే తీసుకుంటున్నారు. అమెరికా, ఇటలీల్లో మాదిరిగా భారీ ఎత్తున మరణాలు సంభవించకుండా చూడడమే ఆయన ఉద్దేశం. ప్రధాని ఈ చర్యలు ప్రకటించడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి..
ఒకటి: వైరస్ పెద్ద ఎత్తున ప్రబలితే లక్షల మందికి చికిత్స చేసే మౌలిక వైద్య సదుపాయాలు మన దేశంలో అందుబాటులో లేవు.
రెండు: భౌగోళికంగా, జనాభాపరంగా పెద్దదైన భారత్లో పరిస్థితులు అదుపు తప్పితే నియంత్రించడం సాధ్యం కాదు… చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి మాతో జరిపిన సమావేశంలోనే నిర్ణయించారు.
ఇక మూడోది: మన దేశంలో వెద్యుల సంఖ్య కూడా తక్కువే.. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు చికిత్స నందించ డానికి సరిపడా వైద్యులు లేరు’’ అని ఆ అధికారి వివరించారు. మన దేశం సరైన సమయంలోనే రంగంలోకి దిగిందని, ఫిబ్రవరిలోనే ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను యుద్ద ప్రాతిపదికన రప్పించిందని ఆయన తెలిపారు. ‘‘నిజానికి నెలరోజుల ముందే లాక్ డౌన్ ప్రకటిస్తే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేది.. కరోనా వైరస్ తీవ్రత ప్రజలు గ్రహించిన తర్వాత, మన భారతీయులను విదేశాలనుంచి రప్పించిన తర్వాత, విదేశీయుల రాకపోకలు పూర్తిగా అరికట్టిన తర్వాతే ప్రధాని చర్యలు ప్రకటించారు’’ అని ఆయన చెప్పారు.
ఈ 21 రోజుల్లో కరోనా ఎంత ప్రబలిందో, ఏ మేరకు అరికట్టగలమో మాత్రమే తెలుస్తుందని, కానీ ఏదైనా వైరస్ వ్యాప్తి చెందేందుకు అవసరమయ్యే సైకిల్ మాత్రం పూర్తి కాదని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. వి. శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం మస్కట్ లో కిడ్నీ మార్పిడి కేంద్రాన్ని నెలకొల్పే విషయంలో ఆ దేశ ప్రభుత్వానికి సహాయపడేందుకు వెళ్లిన శ్రీనివాస్ ఆ దేశంలో కూడా పరిమిత స్థాయిలో లాక్డౌన్ ఉన్నదని చెప్పారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి కాకుండా ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం అవసరమైన దానికంటే ఎక్కువ చర్యలే తీసుకుంటున్నారని, భవిష్యత్తు లో ఏ సమస్యలు రాకుండా ఈ చర్యలు సహాయపడతాయని తెలిపార్జు.
Courtesy Andhrajyothi