– ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాల్లో స్థానికులకే అగ్రతాంబూలం
– ఆ మేరకు చట్టాలు చేస్తున్న రాష్ట్రాలు
– నష్టపోతున్న వలస కార్మికులు
– సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్న నిపుణులు
ముంబయి : స్థానికులను సంతృప్తిపరచడానికి, రాష్ట్రవాసులకే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు ఇవ్వాలంటూ పలు రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరు వలసకార్మికులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసేది వలసకార్మికులే అని కీర్తిస్తున్నా.. మరోవైపు పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతున్నాయి. ప్రభుత్వరంగంలోనే గాక ప్రయివేటు ఉద్యోగాల్లో అగ్రతాంబూలం స్థానికులకే ఇవ్వాలనీ, అలాగైతేనే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తామని స్థానిక ప్రభుత్వాలు కొత్త పాలసీలు తీసుకొస్తున్నాయి. ఇది నైపుణ్యం ఉన్న వలసకార్మికులకు తీరని అన్యాయమే గాక.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాజ్యాంగ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.
లాక్డౌన్ కారణంగా నగరాలు, పట్టణాల్లో పనుల్లేక దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వలసకార్మికులు.. సొంత గ్రామాలకు తరలివెళ్లారు. ఇప్పుడిప్పుడే దేశంలో పరిశ్రమలు తెరుచుకుంటుండగా.. సొంతూళ్లకు వెళ్లిన వారిని ఎలాగైనా రప్పించడానికి పరిశ్రమల యజమానులు వారికోసం కార్లు, బస్సులు, రైలు టికెట్లు బుక్ చేస్తున్నారు. కానీ గతేడాది నుంచి పలు ప్రభుత్వాలు మాత్రం ప్రభుత్వ, ప్రయివేటురంగాల్లో 80 శాతానికి పైగా ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టాలు తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్లు ముందుండగా.. గోవా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు పాలసీలు రూపొందించే పనిలో నిమగమయ్యాయి.
చట్టాలు రూపొందిస్తున్న రాష్ట్రాలు
ఈనెల 21న హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా మాట్లాడుతూ.. ప్రయివేటురంగంలో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించేవిధంగా అసెంబ్లీలో బిల్లును త్వరలోనే ప్రవేశపెడతామని ప్రకటిం చారు. వలసకార్మికులు అధికంగా ఉండే మహారాష్ట్రలోనూ ప్రయివేటురంగంలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా మహావికాస్ అఘాడీ (ఎంవీఎ) ప్రభుత్వం యోచిస్తున్నది. దాదాపు 15 ఏండ్లుగా మహారాష్ట్రలోనే స్థిరనివాసం ఏర్పరుచుకున్నవారే దీనికి అర్హులు. ఇక ప్రయివేటు ఉద్యోగాల్లో కన్నడిగులకే ప్రాధాన్యతనివ్వాలనీ.. క్లర్కు, దానికి సమాన ఉద్యోగాల్లో స్థానికులనే నియమించుకునే విధంగా కర్నాటక పారిశ్రామిక ఉపాధి రూల్స్-1961 చట్టానికి గతేడాది డిసెంబర్లో అక్కడి బీజేపీ సర్కారు మార్పులు చేసింది. ప్రయివేటు ఉద్యోగంలో చేరబోయేవారు కన్నడ రాసి, మాట్లాడి, చదివేవిధంగా ఉండాలని నిబంధన విధించింది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని గతేడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా చట్టమే చేసింది. మధ్యప్రదేశ్లోనూ 70 శాతం ఉద్యోగాలు ‘మధ్యప్రదేశ్ బిడ్డలకే’ (చిల్డ్రన్ ఆఫ్ మధ్యప్రదేశ్) ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ స్థానికులకేనని ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
పై రాష్ట్రాల బాటలోనే గుజరాత్లోనూ 85 శాతం ఉద్యోగాలు అక్కడివారికే ఇవ్వాలని 1995లోనే నిర్ణయం తీసుకున్నారు. ఛత్తీస్గఢ్కు వలసవచ్చే కార్మికులను సంస్థల ముందు సెక్యూరిటీ గార్డులుగా మాత్రమే నిర్ణయిం చుకోవాలనీ, ఇక్కడివారికే ‘అధిక ప్రాధాన్యత’ కల్పించాలని కాంగ్రెస్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. గోవాలో 15 ఏండ్లకు మించి లేనివారికి ఉద్యోగాలు ఇవ్వకూడదనీ, ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను కట్ చేస్తామని అక్కడి ప్రభుత్వం హుకుం జారీ చేసింది. మరో బీజేపీ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో 80 శాతం మంది కంటే ఎక్కువ మంది స్థానికులను నియమించుకుంటున్న పరిశ్రమలకు అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నది.
అయితే స్థానిక ప్రభుత్వాల చర్యలు వలసకార్మికులకే గాక ప్రయివేటు పరిశ్రమలకూ అడ్డంకిగా మారుతున్నాయి. సాధారణంగా ప్రయివేటు పరిశ్రమలు మంచి నైపుణ్యం కలిగిఉండి, తక్కువ వేతనాలకు పనిచేసే కార్మికుల కోసం చూస్తాయి. ఇది స్థానికంగా దొరకడం వారికి చాలా కష్టం. ఉదాహరణకు హర్యానానే తీసుకుంటే అదొక ఆటోమొబైల్ హబ్. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలస కార్మికులే ఆయా సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇక ఆటోమొబైల్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న తమిళనాడులోనూ పనిచేసేవారిలో ఆంధ్రప్రదేశ్, కర్నాటకకు చెందినవారే అధికంగా ఉన్నారని తెలుస్తున్నది. వస్త్ర పరిశ్రమకు వేదికగా ఉన్న సూరత్, బీవండి, అహ్మదాబాద్ వంటి చోట ఒడిషా, బెంగాల్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికులే అధికంగా పనిచేస్తున్నారని అందరికీ తెలిసిన వాస్తవమే. ఇదిగాక దేశవ్యాప్తంగా నిర్మాణరంగంలో పనిచేసేవారిలో మాత్రం అధికభాగం వలసకార్మికులే.
చెల్లదు : నిపుణులు
స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలకు చట్టబద్ధత లేదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. దీనిపై ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ స్పందిస్తూ.. ఇది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాదనీ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇదే విషయమై లోక్సభ మాజీ సెక్రెటరీ పిడిటి ఆచారి మాట్లాడుతూ… రాజ్యంగంలోని 16వ ఆర్టికల్ ప్రకారం స్థానికత ఆధారంగా రిజర్వేషన్ దక్కుతుందనీ, అందుకనుగుణంగా రాష్ట్రాలు చట్టాలు చేసే వీలున్నా.. న్యాయపరంగా మాత్రం చెల్లదని తెలిపారు. అంతేగాక ఇది ప్రస్తుతం వినిపిస్తున్న జాతీయవాద విధానానికి వ్యతిరేకమని ఆయన చెప్పుకొచ్చారు.
Courtesy: NT