– మానవత్వాన్ని చాటుతున్న న్యాయవాది
– షాహిన్బాగ్లో నిరననకారులకు భోజనం అందజేత
న్యూఢిల్లీ : దక్షిణ ఢిల్లీలోని షాహిన్ బాగ్ ప్రాంతం..పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా అక్కడ నిరసనోద్యమాలు కొనసాగుతూ దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. నిరసనల కారణంగా అక్కడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం నుంచి బిర్యానీ వరకు ప్రతీది వార్తల్లో నిలిచింది. దీంతో పాటు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా షాహిన్బాగ్ ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఈ నిరసనలు తెలుపుతూ రెండు నెలలు గడిచినా..మోడీ సర్కార్లో మార్పు రాలేదు.
అయినప్పటికీ..ఉద్యమకారులు పట్టుసడలకుండా నిరసనలు చేపడుతూనే ఉన్నారు. మరి ఇన్నాళ్లు గా కొనసాగుతున్న ఈ నిరసనకారులకు ఆహారం ఎలా అందిందనేది అందరికీ ఎదురౌతున్న ప్రశ్న. వీరికి ఆహారాన్ని అందిస్తూ ఓ న్యాయవాది తన మానవతను చాటుకున్నాడు. అడ్వకేట్ డీఎస్ బింద్రా షాహిన్భాగ్లో నిరసనలు చేపడుతున్న వారికి ఆహారం అందేలా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. కాగా, ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయంతో అందరూ షాక్ గురౌతున్నారు. ఎందుకంటే ఆ నిరసనకారులకు భోజనం అందించేందుకు డబ్బుల కోసం తనకు చెందిన ఒక ఫ్లాట్ను అమ్మేయాలని నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచారు. ఆయనతో టుడే ఇండియా ముచ్చటించింది. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
డబ్బుల కోసం ఫ్లాట్ అమ్మకం
షాహిన్బాగ్లోని నిరసనకారులకు భోజనం అందించేదుకు డబ్బుల కోసం మూడు ఫ్లాట్లలోని ఒకదానిని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నా.. గురుద్వారాలో విరాళంగా ఇద్దామనుకున్న సొమ్మును దీనికి వినియోగించాలని తన పిల్లలు సలహా ఇచ్చినట్టు చెప్పారు. తాను భోజనం పెట్టడంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారని అన్నారు. అయితే తన వద్ద దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఆయన కేవలం షాహిన్బాగ్లోనే కాక, ముస్తఫాబాద్, ఖురేజీలో కూడా నిరసనల చేపడుతున్న వారికి ఆహారాన్ని అందించారు. ఆ రెండు ప్రాంతాల్లో ఐదు రోజుల భోజనానికి అయిన ఖర్చును తాను భరించానని చెప్పారు. ఎఐఎంఐఎం పార్టీకి మద్దతునిస్తున్నట్టు వార్తలు రావడంపై తాను ఏ పార్టీకి మద్దతునివ్వడం లేదని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు తాను షాహిన్బాగ్లో ఉన్నానని తెలిపారు.
Courtesy: NT