- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు
- ‘కొత్త రెవెన్యూ చట్టం’ నేపథ్యంలో సర్కారు నిర్ణయం
- యథావిధిగా వీలునామాలు, వివాహాల నమోదు
- సాగు భూముల రిజిస్ట్రేషన్ల అధికారం తహసీల్దార్లకు
- ఇళ్ల స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్ అధికారం సబ్ రిజిస్ట్రార్లకే
- త్వరలో ‘ధరణి’ ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు
- అసెంబ్లీ సమావేశాల్లోపే కొత్త చట్టం వచ్చే అవకాశం
హైదరాబాద్ : తెలంగాణలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. రెవెన్యూ శాఖలో సంస్కరణలు తీసుకురావాలన్న దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారాలన్నీ తహసీల్దార్లకే దఖలు పరచనుంది. దీనికోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని రకాల రిజిస్ట్రేషన్లనూ నిలుపుదల చేసింది. ఈ మేరకు సోమవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జీవో నం.102 జారీ చేశారు. మంగళవారం నుంచి రాష్ట్రంలో ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు జరగవు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుంది. అయితే.. తెలంగాణ రిజిస్ట్రేషన్ యాక్ట్-1908 ప్రకారం రిజిస్ట్రార్ అండ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీలునామాలు, వివాహాల నమోదు, ఫ్రాంక్లిన్ (స్టాంప్ పేపర్)ల సర్వీసులకు సంబంధించి యథావిధిగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవలికాలంలో పలు జిల్లాల్లో రెవెన్యూ శాఖలో వెలుగు చూసిన అవినీతి, అక్రమాల నేపథ్యంలో ఈ శాఖను ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల నిలిపివేత అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి, అమల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. అంతా సవ్యంగా జరిగితే వారం రోజుల్లోపు కొత్త చట్టం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం వచ్చినట్లయితే.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లే చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూముల జోలికి వెళ్లకుండా, వివాదాల్లేని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లు చేయనున్నారు. దీనికోసం త్వరలో ధరణి (సమగ్ర భూ రికార్డుల యాజమాన్య విధానం) వెబ్సైట్ను అందుబాటులోకి తేనున్నారు. ఇక సబ్ రిజిస్ట్రార్లకు ప్రస్తుతం ఉన్న కార్డ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్నే వినియోగించుకునే విధానాన్నే అమలు చేస్తారు. ప్రస్తుతం 21 మండలాల్లో తహసీల్దార్లు భూముల రిజిస్ట్రేషన్ చేస్తుండగా.. రానున్న రోజుల్లో 500లకు పైగా మండలాల్లో రిజిస్ట్రేషన్లు చేయనున్నారు.
ఒకేచోట రిజిస్ట్రేషన్, మ్యుటేషన్
ఇప్పటిదాకా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతుండగా.. మ్యుటేషన్ తహసీల్దార్ కార్యాలయాల్లో జరిగేది. ఇక ముందు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ తహసీల్దార్ వద్దే జరుగనుంది. అయితే ఒకరు రిజిస్ట్రేషన్, మరొకరు మ్యుటేషన్ చేయడం వంటి విధానం వల్ల క్రాస్ చెక్తో ప్రభుత్వ భూముల లావాదేవీలకు బ్రేక్ పడేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే అనుమతి లేని, ఆమోదం లేని లే అవుట్లలో ఇళ్ల స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం బ్రేక్ వేయడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం సగానికి సగం పడిపోయింది. తాజాగా రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయడంతో భారీగా ఆదాయం తగ్గనుంది. వాస్తవానికి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో గ్రేటర్ హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ వాటా 65 శాతానికి పైగా ఉంటుంది. మొత్తం ఆదాయంలో 80ు రిజిస్ట్రేషన్ల ద్వారా, 20ు రెవెన్యూశాఖ ద్వారా సమకూరుతుంది.
Courtesy Andhrajyothi