– రాష్ట్రంలో మొదటి, రెండో విడుతలో 9,87,956 మంది రైతులకు పెండింగ్
– మూడో విడుతలో 33.51 లక్షల మంది లబ్ధిదారుల ఎదురుచూపు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) పథకం రాష్ట్రంలో నత్తనడకన సాగుతున్నది. లోక్సభ ఎన్నికల సమయంలో రెండు విడుతలు డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం జాప్యం చేస్తున్నది. మొదటి రెండు కిస్తీల బకాయిలు కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఆగస్టు ఒకటి నుంచి మొదలు కావాల్సిన మూడో విడుత చెల్లింపులు ఇంకా మొదలుకాలేదు. రెండు హెక్టార్ల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున నగదు బదిలీ చేస్తామని గత లోక్సభ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రూ.6 వేలు ఒకేసారి కాకుండా రూ.2 వేల చొప్పున మూడు విడుతలుగా రైతుల బ్యాంకు ఖాతా ల్లో జమచేస్తామని ప్రకటించారు. 2018 డిసెంబర్ ఒకటో తేదీని కటాఫ్గా తీసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 2019 మార్చి 31వరకు మొదటి విడుత పంపిణీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 33,51,443 మంది రైతులు ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉండగా, మొదటి విడుతలో 32,58,312 మంది రైతులకు రూ.2 వేల చొప్పున జమచేశారు. రెండో విడుత కాలపరిమితి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు ముగిసింది.
ఈ నాలుగు నెలల వ్యవధిలో 24,56,618 మంది రైతులకు రూ.2 వేల చొప్పున చెల్లించారు. మొదటి విడుత 93,131 మందికి, రెండో విడుత 8,94,825 మంది రైతులకు చెల్లించలేదు. రెండు విడుతల్లో కలిపి సుమారు 9,87,956 మంది లబ్ధిదారులకు పీఎం-కిసాన్ నిధులు అందలేదు. ఎన్నికల సమయంలో రెండు విడుతలు హడావుడిగా జమచేశారని, ఇప్పుడు మూడో విడుత వచ్చేసరికి జాప్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గడిచిన ఆగస్టు 1వ తేదీ నుంచి మూడో విడుత చెల్లింపులు మొదలు కావాల్సి ఉన్నది. ఈ మూడో విడుత చెల్లింపు కాలపరిమితి నవంబర్ నెలాఖరువరకు ఉన్నది. వచ్చే డిసెంబర్ 1వ తేదీనుంచి 2019-20 సంవత్సరానికి సంబంధించిన పీఎం-కిసాన్’ క్యాలెండర్ ప్రారంభం కానున్నది. మూడో విడుత గడువు ప్రారంభమై సుమారు 45 రోజులు గడిచిపోయినా రాష్ట్రంలో ఒక్క రైతుకు కూడా ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడం గమనార్హం. ప్రస్తుతం రెండు హెక్టార్ల మినహాయింపును మూడో విడుతకు అమలు చేయాల్సి ఉన్నది.
(Courtesy Namasthe Telangana)