- ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతితో రగులుతున్న కరీంనగర్
- చర్చలు మొదలుపెట్టాకే అంతిమయాత్ర కదులుతుంది
- జేఏసీ ప్రతిన.. నేడు చలో కరీంనగర్, ఉమ్మడి జిల్లా బంద్
- మృతదేహంతో రోజంతా బాబు ఇంటి ఎదుటే
- కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికుల ఆందోళన
- రోజంతా అక్కడే ఎంపీ బండి సంజయ్కుమార్
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులు కరీంనగర్కు
‘‘ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సర్కారు తీరు వల్ల ఇప్పటికే 17 మంది చనిపోయారు. మరొకరు చనిపోవద్దు. మా ఆయన మరణమే చివరిది కావాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకూ మృతదేహాన్ని తియ్యం. అంత్యక్రియలు నిర్వహించం.’’
-డ్రైవర్ బాబు భార్య జయ.
కరీంనగర్: ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో కరీంనగర్ రగులుతోంది. ప్రభుత్వం చర్చలు జరిపితేనే గుండెపోటుతో మరణించిన డ్రైవర్ నంగునూరి బాబు అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పక్షాలు తేల్చి చెప్పడంతో ఉద్రిక్తత రాజ్యమేలుతోంది. బాబు ఇంటి ఎదుటే ఆయన మృతదేహాన్ని ఉంచి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో అక్కడికి చేరారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనలో భాగస్వాములయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు ప్రారంభించాలని, బాబు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆయన ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లను అంగీకరించి చర్చలు ప్రారంభిస్తేనే అంత్యక్రియలకు కదులుతామని ప్రకటించారు. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో సాగుతున్న ఆందోళనలో సుమారు 1500 మందికిపైగా పాల్గొనడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సత్యనారాయణ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, 10 మంది సీఐలు, 10 మంది ఎస్సైలు, 100 మందికిపైగా కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహిస్తున్నారు. బాబు మృతికి సంతాపంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు, అఖిలపక్ష నేతలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపారులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని కోరారు.
గురువారం తెల్లవారుజామున హైడ్రామా
హైదరాబాద్ నుంచి బాబు మృతదేహాన్ని గురువారం తెల్లవారుజామున కరీంనగర్కు తీసుకు వస్తుండగా బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నిజానికి, తొలుత ఆయన మృతదేహాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు తీసుకెళదామని కార్మికులు భావించారు. దానిని గుర్తించిన పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ను బలవంతంగా కిందకు దింపేసి వాహనం దారి మళ్లించారు. నేరుగా బాబు ఇంటికి తరలించారు. ఇంటికి తీసుకెళితే ర్యాలీ వంటివేవీ లేకుండా వెంటనే అంత్యక్రియలు నిర్వహిస్తారని అంచనా వేశారు. కానీ, కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. బాబు అంత్యక్రియలపై గురువారం అర్ధరాత్రి వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. చర్చలు ప్రారంభిస్తేనే అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులతోపాటు ఎంపీ బండి సంజయ్, మంద కృష్ణ మాదిగ, జేఏసీ నాయకులు అక్కడే బైఠాయించడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని స్థితి నెలకొంది. రాత్రి సమయంలో విద్యుత్తు సరఫరాను నిలిపివేసే అవకాశముందని భావించి.. బాబు ఇంటి వద్ద భారీ జనరేటర్ను, లైట్లను ఏర్పాటు చేశారు.
డిపో మేనేజర్ ‘డిస్మిస్’ వ్యాఖ్యలు
సరూర్ నగర్ స్టేడియంలో బాబు చనిపోయిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కరీంనగర్-2 డిపో మేనేజర్ మల్లేశం దృష్టికి తీసుకెళ్లారు. సాధారణంగా సర్వీసులో ఉన్నప్పుడు చనిపోతే అంత్యక్రియలకు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం ఆనవాయితీ. అప్పుడు అంత్యక్రియలకు సంబంధించిన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే, బాబు కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, బాబు ‘డిస్మిస్డ్ కార్మికుడు’ అని, ఆయన అంత్యక్రియలకు తాము ఖర్చులు చెల్లించేది లేదని డిపో మేనేజర్ మల్లేశం అన్నారు. ఆందోళన తీవ్రం అవుతుండడంతో అంత్యక్రియలకు డబ్బులు ఇచ్చేందుకు మధ్యాహ్నం ఆయనే స్వయంగా బాబు ఇంటికి వచ్చారు. కానీ, ‘డిస్మిస్డ్ కార్మికుడి’కి ఎలా సాయం చేస్తారంటూ మధ్యలోనే ఆందోళనకారులు ఆయనను తిప్పి పంపించారు. అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ ఆర్డీవో రాగా.. ఆందోళనకారులు గో బ్యాక్ నినాదాలు చేశారు. బాబు మృతి సందర్భంగా గురువారం కరీంనగర్ జిల్లా బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ నేతలతోపాటు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను పెద్ద ఎత్తున అదుపులోకి తీసుకున్నారు.
సమస్య పరిష్కరించే వరకు మృతదేహాన్ని తీయం- ఆర్టీసీ డ్రైవర్ బాబు భార్య జయ
‘‘ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఇప్పటికే 17 మంది చనిపోయారు. మరొకరు చనిపోవద్దు. మా ఆయన మరణమే చివరిది కావాలి. కార్మికుల సమస్య పరిష్కరించే వరకూ మృతదేహాన్ని తీయం. అంత్యక్రియలు నిర్వహించం’’ అని బాబు భార్య జయ స్పష్టం చేశారు. తమ ఇంటి చుట్టూ పోలీసులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ఆమెతోపాటు బాబు కుమార్తెలు దివ్య, సంధ్య, కుమారుడు సాయికిరణ్ మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. కరీంనగర్ నుంచి 60 మంది కార్మికులు హైదరాబాద్ వెళితేనే మృతదేహాన్ని అప్పగించారని, అంబులెన్సుకు ముందు రెండు, వెనుక రెండు పోలీసు వాహనాలతో తీసుకొచ్చారని తప్పుబట్టారు. ‘‘మా నాన్న ఏమైనా రౌడీషీటరా లేక దొంగనా.. ఇంత మంది పోలీసులతో తీసుకొచ్చి మా ఇంటి చుట్టూ ఎందుకు పోలీసులను పెట్టారు. సానియా మీర్జా, పీవీ సింధు, సైనా నెహ్వాల్ తెలంగాణ కోసం ఏమి చేశారని వారికి కోట్లు ఇచ్చారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నవారికి, తెలంగాణ కోసం పోరాడిన వారిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?’’అని నిలదీశారు. నిన్న మధ్యాహ్నం లంచ్ టైంలో నాన్నకు ఫోన్ చేశానని, ఎక్కడ ఉన్నావని అడిగితే జూబ్లీ బస్స్టేషన్ వద్ద ఉన్నానని చెప్పారని, అదే చివరి ఫోన్ కాల్ అయిందని బాబు చిన్న కుమార్తె సంధ్య విలపిస్తూ చెప్పారు. తమకు న్యాయం చేసే వరకు శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లేది లేదని స్పష్టం చేశారు.
50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: థామస్ రెడ్డి
బాబు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించి ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ థామస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమడుతోందని మండిపడ్డారు. 17 మంది కార్మికులు చనిపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపకుండా ఏమయ్యారని నిలదీశారు. కార్మికులపై జాలి కూడా లేదని మండిపడ్డారు.
ప్రజా కోర్టులో కేసీఆర్కు శిక్ష తప్పదు: మంద కృష్ణ
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మొండి వైఖరితో వ్యవహరిస్తూ కార్మికుల జీవితాలను బలి తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. బాబు నివాసానికి చేరుకొని మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్మికుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగానే పరిగణిస్తామన్నారు. భేషజాలకు పోకుండా ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రోజంతా సంజయ్ అక్కడే
ఎంపీ బండి సంజయ్కుమార్ ఉదయం 8 గంటలకు బాబు ఇంటికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన అక్కడే ఉండి ఆందోళనలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంగా అరెస్టు చేసిన ఆర్టీసీ జేఏసీ నేతలను, నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చర్చలు మొదలు పెట్టిన తర్వాతే అంతిమ యాత్ర కదులుతుందని స్పష్టం చేశారు.
Courtesy Andhra Jyothy..