– భారత్లో హంతకులకు శిక్షలు పడని వైనం
– జర్నలిజానికి ప్రమాదకర దేశాల్లో ఆరోస్థానం
– 2014 నుంచి హత్యకు గురైన జర్నలిస్టులు 22 మంది
– ఇందులో ఒక్క కేసూ పరిష్కారం కాలేదు
– యునెస్కో ద్వైవార్షిక నివేదిక
న్యూఢిల్లీ : మోడీ పాలనలో భారత్లో జర్నలిజానికి రక్షణ కరువైంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ప్రతీక్షణం పని చేసే కలంయోధుడికి దేశంలో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అవినీతిని, నిజాలను బయటకు తెచ్చే జర్నలిస్టులెందరో హత్యలకు గురవుతున్నారు. కానీ, హత్యచేసిన నిందితులకు మాత్రం శిక్షలు పడటం లేదు. ఇదే విషయాన్ని యునెస్కో ఎత్తిచూపింది. దేశంలో జర్నలిస్టుల భద్రత, వారిపై జరిగే దారుణాలు, హత్యలకు సంబంధించిన విషయాలను లేవనెత్తుతూ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ఒక నివేదికను రూపొందించింది. భారత్లో జర్నలిస్టులను హత్యగావించిన నిందితులకు శిక్షలు పడటంలేదనివివరించింది.
యునెస్కో డైరెక్టర్ జనరల్స్ ద్వైవార్షిక నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2006 నుంచి ఇప్పటి వరకు దేశంలో 39 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయితే, 2014లో కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల హత్యలు అధికంగా ఉన్నాయి. 2014 నుంచి 22 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయితే, ఇందులో ఏ ఒక్క కేసు కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. కనీసం న్యాయవిచారణలకు సంబంధించిన సమాచారం కూడా జర్నలిస్టులను హత్య చేసిన నిందితులకు అందకపోవడం ఇక్కడి పరిస్థితి తీరుకు అద్దం పడుతున్నది. కాగా, ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులపై జరిగేదారుణాలకు సంబంధించి 13శాతం కేసులు పరిష్కారమయ్యాయి. ఇది గతేడాది 12శాతంగా ఉండగా.. 2018లో 11శాతంగా నమోదైంది.
భారత్లో పరిస్థితి దుర్భరం
అయితే జర్నలిస్టుల భద్రతపై భారత్ పనితీరు దుర్భరంగా ఉన్నదని నివేదిక పేర్కొన్నది. ”జర్నలిజం ప్రమాదకర వృత్తిగా ఉండిపోయింది. జర్నలిస్టులు ఎదుర్కొన్న ప్రమాదాలు అనేకం, విస్తృతమైనవి” వెల్లడించింది. నేరస్థులకు శిక్ష పడకపోవడం మానవహక్కుల ఉల్లంఘనేనీ, ఈ విషయంలో భారత్కు అంతర్జాతీయంగా బాధ్యత ఉన్నదని వివరించింది.
కాగా, 2006లో ఇద్దరు జర్నలిస్టులు ప్రహ్లాద్ గోవ్లా, అరుణ్ నారాయణ్ డెకటే హత్యలకు సంబంధించిన దర్యాప్తు మాత్రమే కొనసాగుతున్నదని నివేదిక పేర్కొన్నది. 2006 నుంచి 2019 మధ్య దేశంలో జరిగిన 37 మంది జర్నలిస్టుల హత్యకు సంబంధించిన ఎలాంటి సమాచారమూ యునెస్కోకు అందకపోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 2018లో జర్నలిస్టుల హత్యలు అధికంగా జరిగిన 24 దేశాల్లో భారత్ ఉన్నది.
ఆరు హత్యలతో భారత్ ఆరోస్థానంలో ఉన్నది. దీంతో జర్నలిజానికి అత్యంత ప్రమాదకర దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్, మెక్సికో, సిరియా, సొమాలియా, యెమెన్ ల తర్వాత భారత్ ఆరోస్థానానికి చేరింది.
కాగా, భారత్లో గతేడాది జర్నలిస్టుల హత్యలు జరగలేదని నివేదిక పేర్కొన్నది. కానీ, ఆ ఏడాదిలోనూ భారత్లో ఆంధ్రజ్యోతికి చెందిన కతా సత్యనారాయణ హత్యకు గురైన విషయం కమిటీ టు ప్రొజెక్ట్ జర్నలిస్ట్ (సీపీజే ) నివేదికలో ఉన్న విషయం విదితమే. కాగా, భారత్లో 2015లో ఆరుగురు, 2016, 2017లో ఐదుగురు చొప్పున, 2018లో ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారని యునెస్కో పేర్కొన్నది.
2019లో ప్రపంచవ్యాప్తంగా జర్నలిజానికి, జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో 40శాతం హత్యలతో లాటిన్ అమెరిక, కటిబ్బిన్ ప్రాంతాలు ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాత 26శాతం హత్యలతో ఆసియా, పసిఫిక్ ప్రాంతాలు, 18శాతంతో అరబ్ దేశాలు ఉన్నాయి. ఇక ఆసియాలో భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లు జర్నలిస్టులకు ప్రమాదకర దేశాల జాబితాలో ఉన్నాయి. 2018-19 మధ్య ప్రపంచవ్యాప్తంగా 156 మంది జర్నలిస్టులు హత్యకు గురైతే అందులో 79 మంది తాము విధుల్లో ఉండగానే హత్యగావించబడటం గమనార్హం.
Courtesy Nava Telangana