- భారత్ జీడీపీ వృద్ధి అంచనాలో కోత విధించిన ప్రపంచ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎన్ని ‘ఉద్దీపన’ చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గించేస్తున్నాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు (డబ్ల్యుబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాని ఏకంగా ఒకటిన్నర శాతం కుదించింది. ఈ సంవత్సరం ఏప్రిల్లో భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 7.5 శాతం ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు, ఇపుడు దాన్ని 6 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) నమోదైన 6.8 శాతంతో పోల్చి నా ఇది 0.8 శాతం తక్కువ. వృద్ధి రేటు మరింత నీరసించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. అదే జరిగితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు తప్పవని స్పష్టం చేసింది.
డిమాండ్ లేదు
డిమాండ్ పడకేయడమే భారత జీడీపీ వృద్ధి రేటు నీరసించడానికి ప్రధాన కారణమని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ వినియోగం 7.3 శాతం నుంచి 3.1 శాతానికి, తయారీ రంగ వృద్ధి రేటు పది శాతం నుంచి ఒక శాతానికి పడిపోవడాన్ని గుర్తు చేసింది. గ్రామీణ ఆదాయ వృద్ధి రేటూ అంతంత మాత్రంగానే ఉంద ని తెలిపింది. దీంతో డిమాండ్ తగ్గి, వస్తు-సేవల వినియోగమూ తగ్గిపోయిందని తెలిపిం ది. ప్రస్తుతం ఫైనాన్సియల్ మార్కెట్లో నెలకొన్న సంక్షోఽభాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాసియా దేశాల్లో తీవ్రమైన ఆర్థిక మందగమనం పొంచి ఉందనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
వచ్చే ఏడాది నుంచి ఓకే
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వృద్ధి రేటు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా. ముఖ్యంగా కార్పొరేట్ టా క్స్ తగ్గింపుతో పెట్టుబడులు ఊపందుకుంటాయని తెలిపింది. కొన్ని సవాళ్లు ఉన్నా భా రత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 6.9 శాతం, 2021-22లో 7.2 శాతం వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది.
బంగ్లా, నేపాల్ మిన్న
భారత్తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం బంగ్లాదేశ్, నేపాల్ దేశాల జీడీపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. బంగ్లాదేశ్ అయితే ఈ సంవత్సరం దక్షిణాసియాలోనే అత్యధికంగా 8.1 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని బ్యాంకు దక్షిణాసియా విభాగం ప్రధాన ఆర్థికవేత్త హాన్స్ టిమ్మర్ చెప్పారు. నేపాల్లోనూ ఈ సంవత్సరం 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుదన్నారు.
ఇప్పటికీ వృద్ధి రేటు ఎక్కువే
ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధి రేటు ఆరు శాతానికి క్షీణించినా, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఈ వృద్ధి రేటు ఎక్కువేనని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా విభాగం ప్రధాన ఆర్థికవేత్త హాన్స్ టిమ్మర్ చెప్పారు. ‘భారత్ను ఇప్పటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే చూడాలి. ఇక్కడ మరింత అభివృద్ధికి అవకాశం ఉంది’ అన్నారు. 2009నాటి ఆర్థిక సంక్షోభ సమయంతో పోలిస్తే, ప్రస్తుతం భారత జీడీపీ వృద్ధి రేటు తగ్గుదల తక్కువగా నే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశీయ డిమాండ్ వేగంగా ప డిపోవడమే ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అన్నారు.
Courtesy Andhra Jyothy