- అధికార యంత్రాంగం క్రియాశీలకంగా వ్యవహరించాలి
- ఉద్దీపన పథకాలు, రాయితీలు అమలు చేయాలి
- ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
దిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఆర్థికాభివృద్ధి రేటు 23.9 శాతం పతనం కావటం ఎంతో ఆందోళనకరమైన విషయమని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరించటం కాకుండా, క్రియాశీలకమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలని సూచించారు. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం కొత్త ఆలోచనలతో చురుకుగా కదలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ప్రభుత్వం మొదట్లో ఎంతో వేగంగా స్పందించింది, కానీ ఆ తర్వాత ఎందుకో గానీ… వెనక్కి వెళ్లింది’ అన్నారాయన. ఇంత భారీగా వృద్ధి రేటు పతనం కావటం అందరినీ భయపెట్టే అంశం, అదే సమయంలో ఇతర దేశాల్లో ఇంత నష్టం జరగలేదు, ఇటలీలో 12.4%, యూఎస్లో 9.5% మాత్రమే వృద్ధి రేటు తగ్గింది, ఈ రెండు దేశాల్లో కొవిడ్-19 తీవ్రత ఎంతో అధికమనేది తెలిసిన విషయమే- అని రాజన్ ‘లింక్డిన్’ పేజీలో రాశారు.
కొవిడ్-19 మహమ్మారి భారత్లో ఇంకా విస్తరిస్తూనే ఉందని, అందువల్ల రెస్టారెంట్లు, పర్యాటకం… వంటి తప్పనిసరి కాని సేవా రంగాలకు అధిక నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లుగా ప్రభుత్వం స్పందించటం లేదు, భవిష్యత్తులో సమస్య ఇంకా పెద్దదైన పక్షంలో ఖర్చు చేయటానికి వీలుగా జాగ్రత్త వహిస్తున్నట్లుగా ఉంది- అన్నారాయన. కానీ దీనివల్ల నష్టమే ఎక్కువని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టకపోతే ఆర్థిక వ్యవస్థకు ఇంకా నష్టం జరుగుతుంది- అని వివరించారు. దిద్దుబాటు చర్యలపై ఎంతో అధిక మొత్తాలు వెచ్చించిన ఫలితంగా బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం తక్కువగా ఉందని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. రోగికి జబ్బుచేస్తే చికిత్స చేయాలి, నెమ్మదిగా చూద్దాం… అనుకుంటే ఏమవుతుంది, మొత్తానికే నష్టం జరుగుతుంది- అని విశ్లేషించారు. ఇటీవల ఆటోమొబైల్ రంగంలో కనిపించిన స్వల్ప వృద్ధిని చూసి, ఆర్థిక వ్యవస్థ ‘వీ’ పద్దతిలో కోలుకుంటోందని చెప్పుకోవటం సరికాదని అన్నారు. కార్లకు ఒక్కసారిగా లభించిన ఆ డిమాండ్ మున్ముందు కొనసాగేది కాదని పేర్కొన్నారు.
కొవిడ్-19 కంటే ముందే ఆర్థికాభివృద్ధి మందగించటం, ప్రభుత్వ వద్ద నిధులు పరిమితంగా ఉండటం వల్ల ఉద్దీపన పథకాల మీద అధికార యంత్రాంగం పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నట్లుగా ఉంది… కానీ ఇది సరికాదు. అవకాశం ఉన్నంత మేరకు నిధులు సమీకరించి ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించాలి- అని విశ్లేషించారు. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న యువతరం ఆశలకు నెరవేర్చటానికైనా, పొరుగు దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోవటానికైనా బలమైన వృద్ధి సాధించటం అవసరమని తెలిపారు. కార్మిక సంరక్షణా చట్టాలను కొన్ని రాష్ట్రాల్లో రద్దు చేయటం వంటి తాత్కాలిక సంస్కరణలతో పెద్దగా ప్రయోజనం ఉండదని విశ్లేషించారు. స్పష్టమైన సంస్కరణల ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వస్తే, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొంటుందని, తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుంటుందని తెలిపారు. అవసరాలకు తగ్గట్లుగా అప్పులు చేయొచ్చని, ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రధాన నగరాలు/ పట్టణాల్లో ఉన్న ఖరీదైన స్థలాలను విక్రయించి నిధులు సమీకరించవచ్చని రాజన్ సూచించారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయటం ద్వారా నగదు లభ్యతను పెంపొందించాలన్నారు. చిన్న వ్యాపార సంస్థలకు పన్ను రాయితీలు ఇవ్వాలని కోరారు.
Courtesy Eenadu