– ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్లో నేరాంగీకారం
– బయటి నుంచి వ్యక్తులను తెచ్చామని వెల్లడి
న్యూఢిల్లీ : జేఎన్యూలో విద్యార్థులు, అధ్యాపకులపై జరిగిన హింసాకాండపై ‘ఇండియా టుడే’ అనే మీడియా సంస్థ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనికి సంబంధించిన సంచలన వివరాలు శుక్రవారం తన వెబ్సైట్లో వెల్లడించింది. దాడి చేసిన వారు ఏబీవీపీకి చెందిన వారేనని ఈ స్టింగ్ ఆపరేషన్లో తేటతెల్లమైంది. అయితే దాడికి కారకులైన వారిని ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకూ స్పష్టంగా కనిపెట్టలేకపోవడం గమనార్హం. జేఎన్యూ ఘటనకు సంబంధించి ఈ ఆపరేషన్కు ఇండియా టుడే ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను ఏర్పాటు చేసుకుంది. అత్యంత రహస్య విచారణ అనంతరం దాడికి పాల్పడిన వివరాలను వెల్లడించింది. ఇందుకుగానూ సిట్ సభ్యులు పలువురితో చేసిన సంభాషణలను రికార్డు చేశారు. ఈ దాడికి ఇటు వర్సిటీ లోపల, అటు బయట కూడా సమూహాన్ని సేకరించినట్టు అక్షత్ అవాస్థి ఒప్పుకున్నాడు. ఈ వ్యక్తి జేఎన్యూలో ఫ్రెంచ్ డిగ్రీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అక్షత్ ఏబీవీపీకి చెందిన వ్యక్తే అని తేలిందని ఇండియా టుడే ఈ సందర్భంగా తన కథనంలో పేర్కొంది. ఇత ను క్యాంపస్ పరిధిలోని కావేరి హాస్టల్కు చెందిన విద్యార్థి అని జేఎన్యూ ఆన్లైన రికార్డుల ద్వారా తెలుస్తోంది.
చేతిలో కర్ర, ముఖానికి హెల్మెట్తో ఉన్న తన వీడియోను స్టింగ్ ఆపరేషన్ వారికి చూపించాడు.. తాను హాస్టల్ కారిడార్లో పరుగెత్తుతూ తనకు అడ్డొచ్చిన వారిని కొట్టాననీ, చితకబాదానని చెప్పాడు.
‘ నీ చేతిలో ఉంది ఏంటి’ అని ఇండియా టుడే అండర్ కవర్ రిపోర్టర్ అడగ్గా.. అది కర్ర.. దాన్ని హాస్టల్లోని పెరియాన్ విగ్రహం వద్ద ఉన్న జెండాను పీకి తెచ్చుకున్నాను.. అని సమాధానం ఇచ్చారు.
‘నువ్వు ఎవరినైనా కొట్టావా.?’ అన్న మరో ప్రశ్నకు స్పందస్తూ.. ‘నేను గూండాలు ఎక్కువగా ఉండే కాన్పూర్ నుంచి వచ్చాను. వారిని నేను అనుకరించాను’ అని అన్నారు.
దాడికి సంబంధించిన దుండగుల గుర్తింపుపై చర్చలు జరుగుతున్న సమయంలో స్టింగ్ ఆపరేషన్కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక స్వయం ప్రకటిత వ్యక్తి దాడికి తనకు ఉన్న సంబంధాన్ని, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని వెల్లడించాడు. అంత సమూహాన్ని ఎలా సేకరించి ఈ దాడిని చేశారు అన్న ప్రశ్నకు అవాస్థి స్పందిస్తూ.. తాను వేరే క్యాంపస్ నుంచి ఏబీవీపీ కార్యకర్తలను తీసుకువచ్చానని చెప్పారు. వీడియోలో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తూ.. అదిగో అతను ఏబీవీపీ కార్యనిర్వాహక కార్యదర్శి. సబర్మతి హాస్టల్లో విద్యార్థులు, అధ్యాపకులు సమావేశమవుతున్న విషయాన్ని నేను అతనికి ఫోన్ చేసి చెప్పాను. వారు వచ్చి తమ దగ్గరే షెల్టర్ తీసుకున్నారు.’అని చెప్పారు. దాడి జరిగినప్పుడు విద్యార్థులు, అధ్యాపకులందరూ పరుగులు తీశారని, ఏబీవీపీ ఈవిధంగా ప్రతీకారం తీర్చుకుంటుందని వారు ఊహించి ఉండరని అన్నారు. దీంతో పాటుగా సబర్మతి హాస్టల్ వద్దనున్న వాహనాలను మూక ఎలా ధ్వంసం చేసిందన్న విషయాన్ని వివరించాడు.
రిపోర్టర్ ఆ వ్యక్తితో మాట్లాడుతూ ‘జేఎన్యూకు చెందిన 20 మంది ఏబీవీపీ కార్యకర్తలు, బయట నుంచి మరో 20 మంది తీసుకువచ్చారనే కదా మీరు చెబుతున్నారు’ అని అడిగారు. దీనికి అక్షత్ అవాస్థి మాట్లాడుతూ ‘చెప్పాను కదా.. వారిని అందరినీ నేనే మొబిలైజ్ చేశాను. ఈ దాడి ఎందుకు చేయాలో, ఎక్కడ చేయాలో వారికి వివరించాను. ఎక్కడ దాక్కోవాలి.. ఎలా దాడి చేయాలి అన్న విషయాలను ప్రణాళికాపరంగా అన్నీ వారికి వివరించాను. నాకు ఏబీవీపీలో ఏ పదవి లేకపోయినా నేను చెప్పిందంతా వారు విన్నారు’ అని చెప్పాడు. విద్యార్థులపై దాడి చేసేందుకు ఒక పోలీసు అధికారి తమను ప్రోత్సహించాడని అవాస్థి అన్నాడు.
రోహిత్ షా అనే మరో విద్యార్థిపై కూడా ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. అద్దాలు పగులకొట్టే సమయంలో రక్షణగా ఉండేందుకు తానే అవాస్థికి హెల్మెట్ ఇచ్చానని, ఈ ఘటన పట్ల చాలా గర్విస్తున్నాని అన్నాడు.
Courtesy Nava telangana