* లేపాక్షి నాలెడ్జి హబ్కు 8,844 ఎకరాలు సేకరణ
* 2009 నుంచి దశలవారీగా హబ్కు అప్పగింత
* ఇందూ ప్రాజెక్టుకు 4,397 అప్పగింత
* రూ.790 కోట్లకు తనఖా
* ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ జప్తు
– అనంతపురం :
లేపాక్షి నాలెడ్జీ హాబ్ పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి కారు చౌకగా 8,844 ఎకరాలను సేకరించింది. ఇక్కడికి పెద్ద ఎత్తున పరిశ్రమలొస్తాయని…1.50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని నమ్మబలికి ఎకరానికి రూ.1.75 లక్షలను చెల్లించారు. మరికొంత మందికి నేటికీ పరిహార మివ్వలేదు. 2008లో ఎపిఐఐసి ద్వారా భూములను తీసుకున్నారు. ఎపిఐఐసి సబ్సిడైజరు సంస్థ అయిన ఇందూ ప్రాజెక్టు 4,397 ఎకరాలను తనఖా పెట్టింది. పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరు జప్తు చేసింది. ఈ భూములు నేటికి నిరుపయోగంగా ఉన్నాయి. భూములు పోయే..పరిశ్రమలు రాలేదని పలువురు రైతులు వాపోతున్నారు.
రూ.790 కోట్లకు తనఖా
కర్నాటకలోని దేవనహళ్లి ఎయిర్పోర్టుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది చిలమత్తూరు మండలంలోని కొడికొండ. ఈ గ్రామ సమీపంలోనే లేపాక్షి నాలెడ్జీ హబ్ పేరుతో 2008లో ఎపిఐఐసి ద్వారా రైతుల నుంచి భూములను సేకరించారు. 2009 ఏప్రిల్ నుంచి అక్టోబరు నెలలో లేపాక్షి నాలెడ్జీ హబ్కు దశల వారీగా భూములను అప్పగించారు. ఎపిఐఐసి ఎన్ఒసిని కూడా అదే నెలలో జారీ చేసింది. 2010లో రుణం పొందేందుకు అవసరమైన అనుమతులు కూడా ఎపిఐఐసి ఇచ్చింది. అది లభించిన తరువాత దాని సబ్సిడైజరు సంస్థ అయిన ఇందూ ప్రాజెక్ట్సు లిమిటెడ్ 4,397 ఎకరాల భూమిని వివిధ ఆర్థిక సంస్థల వద్ద తాకట్టు పెట్టి రూ.790 కోట్లు రుణం పొందింది. అయితే ఈ నిధులను ఈ ప్రాజెక్టుకు కాకుం డా ఇందూ ప్రాజెక్ట్సు లిమిటెడ్కు మళ్లించిం ది. ఆ తరువాత ఆరోపణలు రావడంతో భూములన్నింటినీ ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరు జప్తు చేసింది. అప్పటి నుంచి ఈ భూముల వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయింది.
నేటికీ అందని పరిహారం
భూములు కోల్పోయిన వారిలో ఇంకా 95 మంది రైతులకు పరిహారం అందలేదు. అయితే అధికారులు మాత్రం వారి రికార్డ్సు సరిగాలేవని చెబుతున్నారు. రైతు లేమో తమ పేరు మీద నుంచి లేపాక్షి నాలెడ్జీ హబ్కు మార్చినందు వల్ల పాత పాసుపుస్తకాలు మినహా తక్కిన ఏ రికార్డులు తమ వద్దలేవని చెబుతున్నారు. ఈ రకంగా భూ ములు కోల్పోయిన రైతులు దశాబ్దకాలంగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. కనీసం పరిశ్రమలు పెట్టి అందులో మాకు ఉపాధి కల్పిస్తే బాగుండేదని ఆ ప్రాంత రైతులు వాపోతున్నారు. బెంగళూరుకు ఈ ప్రాంతం అతి సమీపం కావడంతో ఇప్పుడు ఈ భూములు ఎకరం కోటి రూపాయలకుపైగానే పలుకుతున్నాయి. దీంతో భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చిన పరిహారం ఖర్చైపోయాయి. ఉపాధి జాడ మాత్రం కానరాలేదు.
పరిహారమివ్వలేదు
– నారాయణ రైతు, ఆరుమాకులపల్లి గ్రామం చిలమత్తూరు గ్రామం
నాలెడ్జీ హబ్ కోసం పదేళ్ల క్రితం నా భూమిని తీసుకున్నారు. వాటికి సంబంధించిన పాసు పుస్త కాలు కూడా ఉన్నాయి. వివాదం పేరుతో అధికారులు ఇప్పటికీ పరి హారమివ్వలేదు. పరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను.ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. భూములన్నీ బీడుగానే ఉన్నాయి. చేయడానికి పనులు కూడా లేకుండా పోయాయి.
కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి
– ఎం.ఇంతియాజ్ , అనంతపురం జిల్లా సిపిఎం దక్షిణ ప్రాంత కార్యదర్శి
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒక పరిశ్రమకు భూములిచ్చిన తరువాత ఎనిమిదేళ్లు అయినా పరిశ్రమలు పెట్టకపోతే తిరిగి ఆ రైతులకే భూములు అప్పగించాలి. అదే రకంగా వాటిని బాగు చేసుకోవ డానికి నిధులు కూడా ఇవ్వాలి. లేపాక్షి నాలెడ్జీ హబ్ కోసం భూములు సేకరించి పదేళ్లు పూర్తయింది. కావున రైతులకు తక్షణం భూములను తిరిగివ్వాలి.
Courtesy Prajasakti..