– 40 దళిత కుటుంబాల గ్రామ బహిష్కరణ
– రేషన్ సరుకులు బంద్.. ఉపాధి లేదు
– పోలీసులను ఆశ్రయించినా స్పందన కరువు
– ఒడిశాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం
భువనేశ్వర్: కాలం మారుతూ.. సమాజం కొత్తపుంతలు తొక్కుతున్నా ‘కుల’గజ్జి మాత్రం తగ్గడం లేదు. దేశంలోని ఏదో ఒకచోట నిత్యం దళితులు, వెనుకబడిన కులాల వారిపై దారుణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఒడిశాలో ‘కుల వివక్ష’ పడగవిప్పింది. అగ్రకులానికి చెందిన వారి భూమిలో ఒక పువ్వు కోసినందుకు 40 దళిత కుంటుంబాలను ఊరి నుంచి వెలేసిన ఘటన ధేంకనాల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. ధేంకనాల్ జిల్లా కాంతియో కేట్ని గ్రామంలో ఓ దళిత బాలిక.. అగ్రకుల కుటుంబం ఇంటి పెరట్లో ఒక పువ్వు కోయడంతో ఘర్షణ మొదలైంది. దీనికిగాను వెంటనే క్షమాపణలు కోరామనీ, తమపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ప్రాధేయపడ్డామని ఆ బాలిక తండ్రి నిరంజన్నాయక్ అన్నాడు.
కానీ ఆ ఘటన తర్వాత పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం తమను బహిష్కరించారని అన్నారు. 800 కుటుంబాలున్న ఆ ఊరిలో ఎవరూ (40 దళిత కుటుంబాలు) తమతో మాట్లాడకూడదనీ, ఎలాంటి వేడుకలకూ తమను ఆహ్వానించవద్దని హుకుం జారీచేశారని వివరించాడు. మరో దళిత మహిళ జ్యోతి నాయక్ మాట్లాడుతూ.. రేషన్ సరుకులు తమకు ఇవ్వడం బంద్ చేశారనీ, నిత్యావసర సరుకుల కోసం 5 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తున్నదని తెలిపారు.
ఉపాధి లేక తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాధితులంతా పోలీసులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ఈ ఘటనపై గ్రామ కార్యదర్శి స్పందిస్తూ.. దళిత కుటుంబాలతో ఇతరులు మాట్లాడవద్దని ఆధిపత్య వర్గాలు ఆదేశాలు జారీచేసిన మాటే వాస్తవమేనని అన్నారు.
గ్రామ సర్పంచ్ ప్రాణబంధు సైతం.. అగ్రకులాలు బాధితులతో మాట్లాడటం మానేశాయంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం కలెక్టర్కు చేరడంతో.. డిప్యూటీ కలెక్టర్ బిష్ణు ప్రసాద్ ఆచార్య మాట్లాడుతూ.. ”వారు స్థానిక పోలీసులను సంప్రదించినా పరిష్కారం లభించకపోవడంతో నా దగ్గరకు వచ్చారు. వారిని సబ్ డివిజనల్ పోలీసు అధికారిని కలవాల్సిందిగా సూచించాను. నేను కూడా శాంతి చర్చల్లో పాల్గొని సమస్య పరిష్కరిస్తాన’ని తెలిపారు.
Courtesy: NT