వై.కె & ఉ.సా
కరోనా మహమ్మారి విలయానికి కకావికలై సమాజంలో ప్రభుత్వాలు విధించిన “లా డౌన్” కారణంగా రోజూవారి కూలీలు ఉపాధి కోల్పోయి విలవిల్లాడుతున్నారు. వారిలో వ్యవసాయ కూలీలు, కౌలుదార్లు, పట్టణాల్లో నగరాల్లో రోజువారీ పనులు చేసుకొంటూ కూలి డబ్బులతో బతుకులీడుస్తున్న పనివాళ్ళు, ఇళ్ళల్లో పనిపాటలు చేస్తూ పొట్టపోసుకొనే వాళ్ళు, అలాగే, చేతివృత్తులవాళ్ళు, చిరు వ్యాపారులు తదితరులు ఉంటారు. వారాల తరబడి పనులు లేక కూలి డబ్బులు రాకపోతే వాళ్ళ జీవితాలు ఆకలితో అలమటించి పోవలసిందేనని అందరికీ తెలిసిందే.
ఇలాంటి శ్రమజీవుల్లో 90 శాతం అణచబడ్డ కులాలకు చెందిన వారేననే విషయంలో ఎవరికీ సందేహం అవసరం లేదు. కనుకనే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి వారికి కొన్ని సదుపాయాలు కల్పిస్తూ, సహాయక చర్యలు చేపడుతూ ముందుకు వచ్చాయి.
సంక్షేమ రాజ్యంలో ఇలాంటి సహాయక చర్యలు ప్రభుత్వాలు చేపట్టడం మామూలే. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సం.లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఓటరు మహాశయుల ప్రసన్నం కోసం రాజకీయ పార్టీలు, ఇలాంటి సహాయక చర్యలు అధికారంలో వున్నప్పుడు చేపట్టవలసిందే కదా! అయితే, కరోనా ఒక అసాధారణమైన ఉపద్రవం. కనుక, ఇలాంటి అసాధారణ పరిస్థితులలో అసాధారణ పరిష్కార మార్గాలు అవసరం అని వేరే చెప్పనక్కరలేదు. దేశంలో కార్పొరేట్ సంపన్న వర్గాలు తగిన సంఖ్యలోనే ఉన్నాయి. భూముల నుండిగానీ, పరిశ్రమల నుండిగానీ రాబట్టే వస్తూత్పత్తికి మూలం శ్రమజీవుల శ్రమశక్తే. అలాంటి వస్తువులనే వ్యాపార, వాణిజ్య రంగాలు అటూ, ఇటూ చేరవేస్తూంటాయి. అక్కడ కూడా మానవ శక్తి పాత్ర ఉండనే వుంటుంది. అనగా, శ్రమజీవుల శ్రమశక్తే లాభాలకు, సంపదకు మూలం అని మరచిపోరాదు.
సామాజిక విశ్లేషకులు కొందరు నేటి విపత్కర పరిస్థితుల్లో అపర కుబేరులైన కార్పొరేట్ వర్గాలు దాతృత్వ భావంతో ముందుకు వచ్చి, తమ తమ ఆదాయాల్లో (లాభాలలో) 10శాతం ఈ కరోనా విపత్తు నిధికి విరాళాలు ఇవ్వాలని సూచించారు. అడగటంలో తప్పు లేదు. కానీ, అది అమలు జరిగేది కాదు. స్వార్ధ చింతనతో, అక్రమ పద్ధతుల్లో, మానవ శ్రమశక్తిని దోచుకొని కోట్లకు పడగలెత్తిన
కుబేరులు, మళ్ళీ వాళ్ళే మానవత్వాన్ని ప్రదర్శిస్తారు, అనుకోవడం దురాశే అవుతుంది. ఇళ్ళు కాలి పోయి కొందరు ఏడుస్తుంటే, బొగ్గులు ఏరుకొని వ్యాపారం చేసే మనస్తత్వం స్వార్ధపూరిత వ్యాపార వర్గాలది. ఇంతటి కరోనా భీభత్సంలో కూడా, నిత్యావసర వస్తువుల ధరలు అవకాశం ఉన్నంత మేరకు పెంచేసే స్వార్థం వ్యాపార లక్షణంగా నేడు ప్రత్యక్షంగానే కనబడుతోంది. అంటే దానర్థం, అపర కుబేరులు దానధర్మాలు అసలే చెయ్యరని కాదు, చేస్తారు. కరోనా దెబ్బకు ప్రతిఘటన కూడా చెయ్యకుండా, ముఖ ద్వారాలు మనుష్యులచేత మూసి వేయించుకొని, ఒక్క భక్తుణ్ణి కూడా తన సన్నిధికి రప్పించుకోలేని శక్తిహీనుడైపోయిన తిరుపతి వెంకన్న హుండీలోనైతే, కోట్ల రూపాయలు వేస్తారు. లేదా, మంచి పబ్లిసిటీ వచ్చే సందర్భాల్లో భారీగా విరాళాలు ఇస్తారు.
కానీ ప్రస్తుత సందర్భం, సంపన్నవర్గాల దయా దాక్షిణ్యాలపైన ఆధారపడవలసినది కాదు. వాస్తవంలో అపర కుబేరుల సంపద అంతా శ్రమజీవుల కష్టార్జితమే. కనుక, అది కష్టజీవులకు చెందడమే న్యాయం, అందులో వారికి ఎంత చెందినా ఆ మేరకైనా న్యాయమే. కనుక, కరోనా పేరిట అపర కుబేరుల ఆదాయంపైన 10శాతం పన్ను విధించి వసూలు చెయ్యటం న్యాయం. ఆ 10 శాతాన్ని కనీస పన్నుగా విధించి, ఆ కుబేరుల ఆదాయాన్ని బట్టి పన్ను పెంచుకొంటూ పోయే దామాషా పన్ను విధింపు (Propotional Rate of Taxation) విధానాన్ని అమలు జరపాలి. ఇది కూడా న్యాయమే. ఆర్డినెన్సు జారీ చెయ్యడం ద్వారా 10శాతం కె. టాకకు చట్టబద్ధత కల్పించాలి. ఇలాంటి పన్ను విధింపు విధానాన్ని కేరళ రాష్ట్రం వంటి కమ్యూనిస్టు ప్రభుత్వాలు ముందుగా అమలు జరిపి, మిలిగిన ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలబడాలి. అసాధారణ పరిస్థితుల్లో ఈ అసాధారణ చర్యలు తీసుకోకపోతే కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా తన ప్రత్యేకత ఏమీలేని సాధారణ పద్ధతుల్లోనే నడుస్తున్నట్లుగా ప్రజలు భావిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా కరోనా నివారణకు వెచ్చించే నిధులకు తోడుగా ఈ కరోనా పన్ను ధన సేకరణ మొత్తాన్ని జతకలపాలి.
గుంటూరు 27-03-2020
Y.K. హైకోర్టు న్యాయవాది,
రాష్ట్ర కన్వీనర్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్
సెల్ : 98498 56568
e-mail : [email protected]
ఉ.సా, ఉద్యమాల ఉపాధ్యాయుడు
సెల్ : 98493 46707
ఢిల్లీలో పేదల ఆకలి కేకలు
-అసంఘటితరంగ కార్మికుల బతుకులు దుర్బరం
– సొంతూళ్లకు కాలినడకనే వెళ్తున్న ప్రజలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో ఢిల్లీలో పేదలు, అసంఘటితరంగ కార్మికులు, దినసరి కూలీల బతుకులు దుర్బరమయ్యాయి. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లకు తినడానికి పట్టెడన్నం లేక అలమటిస్తున్నారు. ఢిల్లీ చుట్టుపక్కన ఉన్న రాష్ట్రాలే గాక దేశవ్యాప్తంగా ప్రజలు బతుకుదెరువు కోసం దేశరాజధానికి వెళ్తుంటారు. ఇందులో చాలామంది నిరాశ్రయులే. లాక్డౌన్తో బస్సులు, రైళ్లు, ప్రయివేటు వాహనాలు రోడ్డెక్కకపోవడంతో చాలామంది అక్కడే చిక్కుకున్నారు. బయట కూడా భోజనకేంద్రాలు, హౌటళ్లు, దుకాణాలు అన్నీ మూసే ఉండటంతో వీళ్లకు తిండికి తిప్పలు తప్పడం లేదు. ఢిల్లీ ప్రభుత్వం 234 నైట్ షల్టర్లు ఏర్పాటుచేసినా అవి ఎంతమాత్రమూ సరిపోవడం లేదని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే వారి బతుకులు మరింత దుర్బరమవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ప్రముఖ సామాజిక కార్యకర్త, ఢిల్లీ రోజీ రోటి అధికార్ అభియాన్ క్యాంపైయినర్ అంజలి భరద్వాజ స్పందిస్తూ… ‘ఢిల్లీలో పనులు చేసుకునే వారిలో చాలామంది నిరాశ్రయులే గాక అందరూ దినసరి కూలీలే. వారు దాచుకున్న కొంత డబ్బు కూడా ఈ పదిరోజుల్లోనే అయిపోయింది. కరోనా నేపథ్యంలో కనీసం పదిహేను రోజుల నుంచి అంతా బంద్ ఉండటంతో పరిశ్రమలు ఎక్కడివక్కడ మూతపడ్డాయి. దీంతో వారంతా ఆకలికి అలమటిస్తున్నారు. ప్రభుత్వమే వారికి వండిన ఆహారాన్ని అందించి వారి ఆకలిని తీర్చాలి. అంతేగాక ఢిల్లీలో పాఠశాలలు మూసివేయడంతో పిల్లలకు మధ్యాహ్నభోజనాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. కాగా ప్రజా, ప్రయివేటు రవాణా బంద్ అవడంతో ఢిల్లీకి ఆనుకుని, సమీపాన ఉన్న రాష్ట్రాలైన యూపీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లకు చెందిన ప్రజలు కాలినడకనే తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్మీడియాలో ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి.
నిరు పేదలకు రూ.10,000 సాయం
-ప్రతీ ఒక్కరికి రూ.5వేలు ఇవ్వాలి
– రూ.2 లక్షల కోట్ల ఉద్దీపనలు అవసరం
– కేంద్రానికి సీఐఐ సూచనలు
న్యూఢిల్లీ : కరోనా ఆర్ధిక భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండిస్టీ (సీఐఐ) సూచించింది. ఇందుకోసం ఆధార్ ఆధారంగా గ్రామీణ, పట్టణ పేదలకు ఒక్కొక్కరికి రూ.5,000 నేరుగా వారి ఖాతాకు జమ చేయాలని కోరింది. బలహీన వర్గాలు, వృద్ధులకు రూ.10,000 చొప్పున అందించాలని సూచించింది. పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోన ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల కోతతో పాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించాలని ప్రధాని మోడీని కోరింది. ఈ ఉద్దీపనలతో రూ.5వేల చొప్పున అయితే 40 కోట్ల మందికి, రూ.10 వేల చొప్పున అయితే 20 కోట్ల మందికి సాయం అందించవచ్చని సీఐఐ పేర్కొంది. వ్యక్తుల్లో ఆర్థిక భయాలను తొలగించేందుకు ఇది దోహదం చేస్తుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు.
కరోన మూలంగా రియాల్టీ, విమానయానం, పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని బెనర్జీ అన్నారు. ప్రస్తుత మందగమనం, సరఫరాల వ్యవస్థలో తలెత్తిన సమస్యలతో వ్యాపారాలకు భారీ విఘాతం కలిగిందన్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు జీడీపీలో 1 శాతం (రూ.2 లక్షల కోట్ల) మొత్తాన్ని ఆధార్ ఆధారిత ప్రత్యక్ష లబ్ది బదిలీ పథకం ద్వారా ఆర్థిక ఉద్దీపనల రూపంలో అందజేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిం చాలన్నారు. ఈ అంశంపై ఆయన శుక్రవారం ప్రధాని మోడీకి లేఖ రాశారు. దేశంలోని రూ.5 లక్షల ఆదాయం దిగువన కలిగిన 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి రూ.5 వేలు, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరు పేదలకు, 60 ఏండ్ల పైబడిన వృద్ధులకు రూ.10 వేల చొప్పున ఈ ఉద్దీపనలను అందజేయాలని సూచించారు.
ప్రజల్లో ఆర్థిక భయాలను తొలగించాలన్న లక్ష్యంతో తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నామని చంద్రజిత్ తెలిపారు. దీనివల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. రుణాలపై వడ్డీ రేట్లను మరింత తగ్గించాలని కేంద్రాన్ని సీఐఐ కోరింది. నిరర్ధక ఆస్తులుగా ప్రకటనకు 90 రోజుల నిబంధనకు బదులుగా 180 రోజులకు (సెప్టెంబర్ 30 వరకు) పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. ఇవి వెంటనే అమలైతే కరోన కారణంగా తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని నియంత్రించవచ్చని సూచించింది.
శ్రామికులకు ప్రత్యేక నిధి: ఎన్సీయూ డిమాండ
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి జాతీయ కంటిన్జెన్సి ఫండ్ (ఎన్సీఎఫ్)ను ఏర్పాటు చేయాలని సమ్మిళిత, సుస్థిర పట్టణీకరణ జాతీయ కూటమి (ఎన్సీయు) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి అనే రెండు సవాళ్లను దేశం ఎదుర్కొంటున్నదని ఎన్సియు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంక్షోభ సమయంలో నిరంతరం కష్టాలను ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు ఎటువంటి ఆసరా ప్రకటించకుండా ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం విచారకరమని పేర్కొంది. కరోనా విస్తృతిని నివారించేందుకు జనతా కర్ఫ్యూను ప్రకటించారని, ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయనున్నదో తెలియజేయలేదని ఎన్సియు డిమాండ్ చేసింది. బహుశా ఇది ప్రారంభమే అయ్యుండవచ్చునని, రానున్న రోజుల్లో ప్రభుత్వం తీవ్రమైన ఆంక్షలతో అల్టిమేటం జారీచేసే అవకాశమున్నదని విమర్శించింది. ఈ రకమైన సంక్షోభ సమయంలో శ్రామిక ప్రజల కష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం ముందుగా పనిచేయాల్సి ఉందని, మోడీ అందుకు సంబంధించిన అంశాలను ప్రస్తావించకపోవడం విచారకరమని పేర్కొంది. జనతా కర్ప్యూ, లేదా మూసివేత వల్ల పేద, అణగారిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నది సుస్పష్టమని తెలిపింది.
ప్రపంచ బ్యాంకు, రిజర్వు బ్యాంకు గణాంకాల మేరకు దేశంలోని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులు 3.8 శాతం మంది ఉంటే, ప్రయివేటు రంగంలో 2.3 శాతం మంది ఉన్నారని, మిగిలిన 94 శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారని పేర్కొంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరు ప్రభుత్వ జోక్యాన్ని డిమాండ్ చేస్తున్నా, ప్రధాని వారికి ఎటువంటి ఊరటను ప్రకటించలేదని తెలిపింది.
కరోనా వైరస్ విస్తృతిని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల ప్రభావం ఈ రంగంలోని వీధి విక్రయదారులు, నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగ కార్మికులు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో పనిచేసేవారిపై తీవ్రంగా పడనున్నదని ఎన్సియు పేర్కొంది. ఈ విషయంలో ప్రధాని మోడీ ప్రపంచంలోని ఇతర దేశాల నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని తెలిపింది. అమెరికా, న్యూజిలాండ్, జపాన్, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాలు కార్మికులు, శ్రామికుల కోసం ప్రత్యేక ప్యాకేజ్లను ప్రకటించాయని, కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకుంటున్న దేశాలకు ప్రపంచ బ్యాంకు కూడా 14 బిలియన్ డాలర్ల ప్యాకేజ్ను ప్రకటించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా ఎన్సిఎఫ్ను ఏర్పాటు చేయాలని ఎన్సియు డిమాండ్ చేసింది. పనుల నుండి విరమించుకున్న కార్మికులు, శ్రామికులకు ఈ నిధి ఎంతగానో సహాయపడుతుందని పేర్కొంది. వారికి నెల రోజుల పాటు ఉచిత రేషన్ ఇవ్వాలని కోరింది. కేరళ ప్రభుత్వం నెల రోజుల పాటు ప్రతి కార్మిక కుటుంబానికి ఉచిత రేషన్ను ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
లాక్డౌన్ అంటేనే …సరిపోదు…
పేదలకు ఆదుకునే చర్యలకు ఉపక్రమించాలి
– కేంద్రసర్కార్ తీసుకోవాల్సిన సూచనలివే : నిపుణులు
ఒకపక్క కరోనా మహమ్మారి పంజా విసురుతుంటే… దేశదేశాలు స్తంభించిపోయాయి. మన దేశంలోనూ వ్యాధి విజృంభణ ఒకవైపు… ప్రణాళికలేని లాక్డౌన్తో మరోవైపు రోజువారీ వేతన జీవుల ఇక్కట్లు మరోవైపు. రోజుకూలీలతోపాటు, అసంఘటితరంగంలో పనిచేసే లక్షలాది మంది వేతన జీవులూ నానా అగచాట్లూ పడుతున్నారు. ఉద్యోగ-నిరుద్యోగ సర్వే 2015-16 ప్రకారం దేశ శ్రామిక శక్తిలో దాదాపు 80శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్దేశించి ఈ నెల 19 న ప్రసంగించిన 24 గంటల్లోనే.. రైల్వే, బస్ స్టేషన్ల రద్దీ మొదలైంది. బతుకు జీవుడా అంటూ సొంత ఊరుకు చేరుకుంటే.. పచ్చడి మెతుకులైనా దొరకుతాయనుకున్నారు. ఆ తర్వాత.. బస్సులు రద్దు.. రైళ్లు నిలిపివేత జరిగిపోయాయి. లక్షలాది మంది ఎక్కడివారక్కడ నిలిచిపోయారు. కనీసం తిండి కూడా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితేకానీ, డొక్కాడని కార్మికుల బతుకులు దుర్భలమయ్యాయి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేరళ సర్కార్ పలు చర్యలతో ఇప్పటికే ముందుకొచ్చింది. అలాగే కేంద్ర సర్కార్ తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు పలు సలహాలను సూచిస్తున్నారు.
నగదు సహాయం
మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా నగదు బదిలీ మొదటి చర్యగా చెబుతున్నారు. అది చాలా సులభమైన, వేగవంతమైన చర్యగా చెబుతున్నారు. పట్టణ, గ్రామీణ పేదలకు ఇది అత్యంత ఆసరాగా ఉంటుందంటున్నారు.
ముందస్తు చెల్లింపులు : ఏప్రిల్లో మూడు నెలల పెన్షన్ (వృద్ధాప్యం, వితంతువులు, వికలాంగులు) ముందుగానే ఇవ్వండి.
సామాజిక భద్రత పెన్షన్లకు కేంద్ర ప్రభుత్వం అందించే సహకారం ప్రతి వ్యక్తికి నెలకు రూ .200. దీనిని వెంటనే నెలకు కనీసం రూ.1000కి పెంచాలి.
యూనివర్సల్ కవరేజ్ : సామాజిక భద్రతా పెన్షన్లను యూనివర్సలైజ్ చేయండి. 60 ఏండ్ల పైబడిన వారందరికీ పెన్షన్ అందించాలి.
బకాయిలు చెల్లించాలి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కార్మికుల కోసం, కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి పెండింగ్లో వున్న వేతన బకాయిలను వెంటనే క్లియర్ చేయాలి.
ఉపాధి హామీ కార్మికులకు నగదు బదిలీ : జాబ్ కార్డు దారులకు 10 రోజుల వేతనం ఇవ్వాలి. ఇలా రాబోయే మూడు నెలలకు వారి బ్యాంక్ ఖాతాలకు జమచేయాలి. వారికి ఇచ్చేది నెలకు సుమారు రూ.2,000. అంటే ప్రభుత్వానికి మూడు నెలలకు అయ్యే ఖర్చు రూ.1 లక్ష కోట్లు. ఈ మహమ్మారి ప్రమాదం తగ్గిన తర్వాత.. పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారికి నెలకు కనీసం 20 రోజులు పని చేయమని భరోసా ఇవ్వండి. 100 రోజులు పని కల్పించాల్సిన చట్టపరమైన బాధ్యత ప్రభుత్వానిది.
ప్రజా పంపిణీ వ్యవస్థను ఉపయోగించి..
రెట్టింపు రేషన్ : రేషన్ కార్డు దారులందరికీ మూడు నెలల రేషన్ ఇవ్వాలి. అంత్యోదయ గ హాలకు డబుల్ రేషన్లను అందించాలి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అదనపు నిల్వలను ఉపయోగించుకోవచ్చు. ‘జనరల్ కార్డ్ హౌల్డర్లకు (కొన్ని రాష్ట్రాల్లో దారిద్య్రరేఖకు ఎగువను ఉన్నవారు) కనీసం నియంత్రిత ధరలకు నిత్యావసరాలను అందించాలి. వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ప్రామాణికతను వెంటనే ఆపాలి. కేరళ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా సహా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నిలిపివేశాయి.
పిల్లలకు ‘మధ్యాహ్న భోజనం’ పంపిణీ చేయడం :
అంగన్వాడీలు, పాఠశాలలను మూసివేసిన నేపథ్యంలో ఇంటికి రేషన్ అందించటం. కేరళలో మధ్యాహ్న భోజన కిట్లు ఇంటింటికీ అందిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర నమూనాను ఉదాహరణగా తీసుకొని ఒకటి రెండు రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి.
పట్టణ ప్రాంతాల్లో….
వలస కార్మికులు : లాక్డౌన్తో పనిలేకుండా పోయింది. కొంతమందికి ఆశ్రయం కూడా లేకుండా ఇరుక్కుపోయారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి వీరు రారు. ఇలాంటి వారికి ప్రత్యేక చర్యలు అవసరం.
వలస కార్మికులను తాత్కాలికంగా ఉంచడానికి స్టేడియం, కమ్యూనిటీ హాల్స్ వంటి వాటిని ఉపయోగించాలి. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ప్రమాదాన్ని తగ్గించడానికి సబ్బు, చేతులు కడుక్కునేందుకు ఇతర సదుపాయాలు కల్పించాలి.
అందరికీ కమ్యూనిటీ వంటశాలలు : శ్రామికశక్తిలో అత్యధిక భాగం అసంఘటితరంగంలో ఉన్నందున పనిని కోల్పోవటంతో.. అటు పనిలేక…ఇటు ఇంటికి తిరిగి రాలేక.. లేదా ఉపాధి లేకుండా నగరాల్లో చిక్కుకుపోయినట్టయితే…. అలాంటి వారికి ఆహారం, ఆశ్రయం అవసరం. ఆహారం కోసం, ఫుడ్ కార్పొరేషన్ నుంచి ఉచిత ఆహార ధాన్యం, పప్పులను సరఫరా చేయవచ్చు. కమ్యూనిటీ కిచెన్లను నడపటం ద్వారా వసలకార్మికులకు ఉపయోగపడవచ్చు. (తెలంగాణలో అన్నపూర్ణ భోజన పథకం,తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లు, కర్నాటకలోని ఇందిరా క్యాంటీన్లు, ఒడిషాలోని దాల్-భాట్కేంద్రాలు వంటివి). వీటిని కార్మికులు స్వయంగా నిర్వహించవచ్చు
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి :
లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగిపోయాయి. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి.