-బాలగోపాల్
(ప్రజాతంత్ర వారపత్రిక 24-12-2000) విసిగిస్తూ వుంటే ‘వాళ్ళ ఇష్టమే కానీ లెమ్మని’ ఒప్పేసుకుంటారని మన హిందూత్వవాద సోదరుల ఆశ. అయోధ్య విషయంలో ఇప్పటికే దేశంలో చాలా మంది ఈ ‘మూడ్ ‘ లోకి వచ్చారు ముస్లింలతో సహా. విచిత్రమేమిటంటే ఒకదాని తర్వాత మరొక స్థలాన్ని గురించి ఏదో ఒక వివాదం లేవదీస్తుంటే వాళ్ళపట్ల మెతక వైఖరి ప్రదర్సించడం మంచిది కాదన్న అభిప్రయానికి రావడానికి బదులు మొదటి డిమాండ్ ఒప్పేసుకుంటే మిగిలినవి లేవదీసేవారు కాదని విజ్ఞులు సహితం అనుకుంటున్నారు.
పురావస్తు శాఖ ఆధీనంలో వున్న ముస్లిం సాంప్రదాయానికి చెందిన పర్యాటక స్థలాలలో ముస్లింలను నమాజు చేసుకోనిస్తారు కదా! హైందవ సాంప్రదాయానికి చెందిన పర్యాటక స్థలాలలో హిందువులను పూజలు ఎందుకు చేసుకోనివ్వరు? అని ఈ మధ్య సంఘ్ పరివార్ నాయకులొక కొత్త ప్రశ్న లేవదీశారు.
ప్రశ్న అడిగే పద్దతి ఎట్లాగుంటుందంటే అది నిజమేనని వినేవాళ్ళు అనుకోవాలి. ఆ తరువాత అందులోని అభియోగం న్యాయమైనదే అనుకోవాలి. కానీ తాజ్ మహల్ లో నమాజు చేయనిచ్చినట్లే అనేక ‘హైందవ’ పర్యాటక కేంద్రాలలో హిందూ పూజలు చేసుకోనిస్తారు. కొన్నిచోట్ల (ఉదాహరణకు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపురంలో ) పురావస్తు పర్యాటక కేంద్రంలో గుడీ వుంది దర్గా కూడా వుంది. జరుపుకోనివ్వనిది వివాదం ఉన్నచోట్ల మాత్రమే. అది కూడా కేవలం శాంతి సామరస్యాల కోసమే తప్ప ‘కుహనా లౌకికవాదం’ ఫలితంగా కాదు. ఇవి నిజానికి అందరికీ కొంచెం ఆలోచిస్తే గుర్తుకొచ్చే విషయాలే. రామప్ప నుండి హంపి దాకా హిందూ పూజలు జరిగే పర్యాటక స్థలాలు అందరూ చూసే వుంటారు. కాని నిర్భీతిగా దబాఇస్తుంటే మన మెరిగిన విషయాలే మరిచిపోతాము.
అయోధ్య విషయంలో ‘విసిగించి ఒప్పించే ‘ మార్గాన్ని హిందూత్వ వాదులు చాల నేర్పుగా అమలు చేస్తున్నారు. వచ్చే జనవరి నుండి మళ్ళీ ‘కరసేవ మొదలు పెడతాం’ అని అకస్మాత్తుగా ఒకడు ప్రకటిస్తాడు. ‘విగ్రహాలూ రాళ్ళూ చేరవేస్తున్నాం’ అని ఇంకొకడు ప్రకటిస్తాడు. ‘ఉత్తరప్రదేశ్ లో రెడ్ అలర్ట్ ‘ అని ‘జనం గుండెలలో ఉద్రిక్తత’ అని పత్రికలు రాస్తాయి. ‘ఈ ఒక్కటి ఒప్పేసుకుంటే పోలేదా’ అనుకునేటట్టు చేస్తారు.
అంతలో డిల్లీ కుతుబ్ మినార్ గురించి కొత్త వివాదం వేరొక సంఘ్ పరివార్ సంస్థ లేవదీస్తుంది. అక్కడ పూజలో, యజ్ఞమో చేస్తామని బయలుదేరుతారు. పోలీసులు నిషేదాజ్ఞలు ప్రకటించారని కుతుబ్ మినార్ పరిసరాలలో కర్ఫ్యూ వాతావరణం నెలకొందని పత్రికలు రాస్తాయి.
‘రామాలయం కట్టుకోనిస్చ్చేస్తే ఇట్లా ఎక్కడ పడితే అక్కడ వివాదాలు లేవదీయటం మానేస్తారేమో కదా’ అని సగటు ప్రజలు అనుకునేటట్టు చేస్తారు.
వాళ్లేదీ మానుకోరు. వాళ్లకు కావలసింది నిజానికి గుళ్ళు కాదు, కూల్చివేసిన పవిత్ర స్థలాల పునరాక్రమణా కాదు. వాళ్లకు కావలసింది హిందూ సమాజంలో అసహనం పెరగడం. వాళ్లకు కావలసింది హిందూ సమాజంలో విద్వేష సంస్కృతి పెరగడం.
అసహనం, ద్వేషం నిండిన మనుషులు ప్రజాస్వామ్యానికి శత్రువులుగా మారతారు. నియంతలను ఆరాధిస్తారు, ఆహ్వానిస్తారు. జర్మనీలోనూ ఇటలీ లోనూ ఫాసిజం రాజ్యం చేసిన అన్ని దేశాలలోనూ ఫాసిస్టు రాజకీయాలు ప్రజలలో ఎదో ఒక మైనారిటీ జాతిపట్ల, మతస్తుల పట్ల ద్వేషాన్నీ అసహన్నీ రెచ్చగొట్టడం ద్వారానే ఉనికిలోకి వచ్చాయి, వ్యాపించాయి. మైనారిటీ జాతులపట్ల, మతస్తుల పట్ల ఇతర ప్రజలలో వ్యతిరేకత రేకిత్తించడానికి వారు చరిత్ర నుండి ఎంపిక చేసుకున్న ఘటనలలో ఎంతో కొంత సత్యముంటే వుండవచ్చును కూడా. యూదులలో చాలా మంది వ్యాపారస్తులు – అందులోను వడ్డీ వ్యాపారస్తులు – కావడం వారికి వ్యతిరేకంగా ద్వేషం రేకేత్తించడానికి కావలసిన సామాజిక వాతావరణం నాజీలకు దొరకడం పెద్ద కష్టం కాలేదు. ఆ సంఘటనలకు సంబదించిన తప్పొప్పుల వివేచనలో జనం కూరుకుపోయిన కొద్దీ ఫాసిష్టుల విద్వేషా అజెండా కళ్లకు కనిపించకుండా పోయే ప్రమాదం వుంది.
పాకిస్తాన్ కాశ్మీర్ లోకి మిలిటెంట్ మతవాదులను పంపించడం లేదా? పంపిస్తున్నది. ఈ దేశాన్ని ఏలిన ముస్లిం నవాబులు, సుల్తానులలో హైందవ మత చిహ్నాలపట్ల అసహనం ప్రదర్శించిన వారు లేరా? వున్నారు. గుళ్ళను కూల్చి, విగ్రహాల ముక్కులు, చెవులు తెగనరికి తమ విశ్వాసాల గాఢతను ప్రదర్శించుకున్న వారు లేరా? వున్నారు.
అందువల్ల పాకిస్తాన్ ను క్రికెట్ మ్యాచ్ ల కోసం మన దేశానికి ఆహ్వానించ వద్దని, విద్వంసమైన హైందవ మత చిహ్నాలను బలప్రయోగంతో పునరుద్ధరిద్దామని హిందూత్వ వాదులు అన్నప్పుడు స్పందన లభిస్తుంది. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేసిన స్థలంలో రామాయలాన్ని కట్టడం ‘జాతి ఆకాంక్ష ‘ అని వాజ్ పేయి అన్నా, ముస్లింలకు ఓటుహక్కు వున్నంతకాలం వారిని మంచి చేసుకోవడం కోసం కుహనా లౌకికవాద రాజకీయాలు సజీవంగా వుంటాయి కాబట్టి వారికి ఓటు హక్కు తీసివేయాలని బాల్ థాకరే అన్నా కూడా స్పందించే వాళ్ళు వుంటారు.
వీటికి తర్కబద్ధంగా జవాబు చెప్పగలము. చెప్పడం అవసరం కూడా. కానీ చెప్పేటప్పుడు తర్కాన్నీ తర్కశూన్యాన్నీ దాటిపోయే లక్ష్యమొకటి ఈ నిర్ణయాలు, ప్రకటనల వెనుక ఉందని గుర్తించడం అవసరం. పాకిస్తాన్ తో మన వాళ్ళు క్రికెట్ ఆడినా, ఆడకున్నా కాశ్మీర్ సమస్య పరిష్కారం ఒక్క అంగుళం కూడా ముందుకు పోదని భారతీయ జనతా పార్టీకి మాత్రం తెలేయదా? అయినా ఆ నిర్ణయం తీసుకున్నారంటే కారణం ద్వేషాన్ని, అసహనాన్ని వారు జాతి లక్షణం చేయడలచుకోవడం తప్ప వేరే ఏమీ కాదు. జైన బౌద్ధ పవిత్ర స్థలాలను ఆక్రమించుకుని శివాలయాలు, వైష్ణవ ఆలయాలు కట్టిన హైందవ రాజులు, చక్రవర్తులు చాలా మంది వున్నారు. కాబట్టి అయోధ్య రామాలయ తర్కం హిందువులను కూడా ఇబ్బంది పెట్టగలదని వీరికి తెలియదా? నిజానికి ఈ తర్కం ఒక్క ఆది వాసులను తప్ప అందరినీ ఇబ్బంది పెట్టగలదు. దేశంలో ఏ పవిత్ర స్థలం తీసుకున్నా హిందూ, బౌద్ధ , జైన, ముస్లిం, క్రైస్తవ – నూటికి తొంభై కాకపొతే ఎనభై శాతం ఒక నాటి ఆదివాసి పూజా స్థలాల్లో కట్టినవే.
ఈ తర్కానికి సంఘ్ పరివార్ యోధుల దగ్గర జవాబు లేదు గాని, తర్కం ఏ గుడినీ కూల్చదని, బౌద్ధులు, జైనులు, ఆదివాసులు ఆ పనిచేసే స్థితిలో లేరని వారికి తెలుసును. నిజానికి ఆ ధైర్యం వుండబట్టే ఒక్కొక్క మసీదు గురించి ఇంత గొడవ చేస్తున్నారు. ద్వేషాన్ని విపరీతంగా ఆరాధించే వారిలో మెజారిటీ వ్యక్తిగతంగా పిరికివాళ్ళు.
అయితే ఎన్ని మసీదులు కూల్చగలరు, ఎన్ని గుళ్ళు కట్టగలరు అన్న లెక్కలతో నిమిత్తంలేని ప్రయోజనం ఒకటి ఆ గొడవ నుండి వారు పుష్కలంగా పోగు చేసుకుంటున్నారు. అది తమ ఫాసిస్టు అజెండాకు తగిన సమాజంగా- ద్వేషం, అసహనం, అనుమానం నిండిన సమాజంగా ఇండియాను మార్చడం. మనం మసీదులు , గుళ్ళు లెక్కపెట్టుకుంటూ ఈ విషయం మరచిపోతే కష్టం. రాబోయే 20 ఏళ్లలో వీళ్ళు బాబ్రీ మసీదు లాగా ఇంకొక మసీదును కూల్చలేక పోవచ్చు. కుతుబ్ మినార్ ను గుడిగా మార్చలేకపోవచ్చు. కానీ తమ ధీర్ఘకాలిక అజెండాకు తగిన సమాజాన్ని మాత్రం వాళ్ళు విజయవంతంగా తయారు చెసుకుంటున్నారు. ఏ రాజకీయమైనా తన నమూనాలో మనుషులను తయారు చేసుకోగలిగినప్పుడే నిలబడుతుంది, గెలుస్తుంది. ఆ విషయంలో సంఘ్ పరివార్ ఫాసిస్టులు కొద్ది కొద్ది గానే కావచ్చును గాని కచ్చితంగా పురోగమిస్తున్నారు. ఆ సంగతి గమనిస్తున్నామా.