– యాంటీ బాడీలు త్వరగా తగ్గితే.. వ్యాక్సిన్ పరిస్థితేమిటి?
– తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు
– ఇమ్యూనైజేషన్తోనే సాధ్యమంటున్న కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ మొదలైందా? శరీరంలోని యాంటీ బాడీలు త్వరగా తగ్గిపోతే హెర్డ్ ఇమ్యూనిటీ, వ్యాక్సిన్ల సంగతేమిటి? ఇటువంటి విషయాలపై తాజాగా ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మహరాష్ట్ర రాజధాని ముంబయి నగరంలో మూడు మురికి వాడల్లో నివసించే సగం మందికి పైగా ప్రజల్లో కరోనావైరస్కు సంబంధించిన యాంటీ బాడీలు ఉన్నట్టు ముంబయి మున్సిపాలిటీ, నీతి ఆయోగ్, టాటా ఇనిస్ట్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంయుక్త సర్వే తెలిపింది. మురికివాడలకు బయట నివసించే వారిలో కేవలం 16 శాతం మంది మాత్రమే ఇన్ఫెక్షన్ బారినపడ్డారు. జూలై మొదటి వారంలో ముంబయిలో కిక్కిరిసిన మూడు ప్రాంతాలలో 7000 మందికి ర్యాండమ్ పరీక్షలు నిర్వహించగా ఈ ఫలితాలు వచ్చాయి. ముంబయిలో చెంబూర్, మాతుంగ, దహిసర్ ప్రాంతాలలో నివసించే ప్రజల్లో 57 శాతం మంది కరోనా సోకినట్టు ఈ సర్వే తెలిపింది.
”సర్వే నిర్వహించడానికి ఎంచుకున్న మూడు ప్రాంతాలలో అధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. అందులో మురికివాడలు, కొన్ని గహ సముదాయాలు, స్వతంత్ర గహాలు కూడా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ సోకడాన్ని జనాభా సాంద్రత ప్రభావితం చేస్తుందో లేదో చూడటం కూడా ఈ సర్వే ఉద్దేశమని డాక్టర్ కొల్తూర్ చెప్పారు. ఈ సర్వే ఫలితాలను నగరం మొత్తం మీద ఉన్న ఇన్ఫెక్షన్ స్థాయిని తెలియచేసేందుకు వాడలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని కేవలం 24 వార్డులలో మూడు చోట్ల నిర్వహించారు. అయితే, మిగిలిన ప్రదేశాలలో ఈ సర్వేలో వచ్చిన ఫలితాలకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఏమి ఉండవని డాక్టర్ జునేజా అన్నారు. కొన్ని పెద్ద నగరాలలో నిర్వహించిన సర్వే ఫలితాలు జనాభాలో తక్కువ శాతంలో యాంటీ బాడీలు ఉన్నట్టు వెల్లడించాయి. లండన్ నగరంలో మే జూన్ నెలల్లో నిర్వహించిన సర్వే లో ప్రతి ఆరుగురిలో ఒక్కరికి, న్యూయార్క్ నగరంలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి యాంటీ బాడీల పరీక్షలో పాజిటివ్ అని తేలింది.
న్యూఢిల్లీలో ఈ నెలలో నిర్వహించిన ఒక ప్రభుత్వ సర్వేలో ప్రతి నలుగురిలో ఒక్కరికి కరోనా సోకినట్టు తెలిసింది. అధిక శాతం మంది ప్రజలు ఇన్ఫెక్షన్ బారిన పడి ,లక్షణాలు లేకుండానే కోలుకోవడం వలన కొన్ని ప్రాంతాలలో మరణాల రేటు కూడా తక్కువగా ఉందని ఈ సర్వే వెల్లడిస్తున్నది. ముంబయిలో కేసుల సంఖ్య తగ్గు ముఖం పడుతూ వస్తున్న నేపథ్యంలో ముంబయిలో హెర్డ్ ఇమ్మ్యూనిటీ మొదలైందా అనే ప్రశ్నను కూడా ఈ సర్వే లేవదీస్తోంది. ‘పూర్తిగా ఇప్పుడే ఏమి చెప్పలేం. కరోనాతో పోరాడేందుకు రోగ నిరోధక శక్తి ఎన్ని రోజులు ఉంటుందో అనే విషయం పట్ల ఎవరికీ స్పష్టత లేదు. ఈ సర్వేలను మరిన్ని సార్లు చేసిన మరి కొన్ని సార్లు నిర్వహించిన తర్వాతే పూర్తి అవగాహనకు రావడం సాధ్యపడుతుందని” అని డాక్టర్ కొల్తూర్ అన్నారు. ప్రస్తుతం సర్వే నిర్వహించిన ప్రాంతాలలోనే తిరిగి ఆగస్టు నెలలో సర్వే నిర్వహించి ఇన్ఫెక్షన్ స్థాయి పెరిగిందో, తగ్గిందో తెలుసుకోగలిగితే నగరంలో కరోనా వ్యాప్తిని అంచనా వేయవచ్చని చెప్పారు. శరీరంలో యాంటీ బాడీలు ఉండటం వల్ల వైరస్ బారి నుంచి రక్షణ కల్గుతుందని పూర్తిగా చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కె శ్రీనాథ్ రెడ్డి ఇటీవల వెల్లడించిన పలు అంశాలను గురించి ప్రస్తావిస్తూ.. తటస్థంగా ఉండే శక్తివంతమైన యాంటీ బాడీలే ఇన్ఫెక్షన్ నుంచి పోరాడేందుకు కావల్సిన రోగ నిరోధక స్థాయిని నిర్ణయిస్తాయి.
ఈ యాంటీబాడీల స్థాయిలు 90 రోజుల్లో తగ్గిపోవచ్చని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరిగితే హెర్డ్ ఇమ్మ్యూనిటీ, వ్యాక్సీన్ల పరిస్థితి ఏమిటనే విషయాన్ని గుర్తు చేసింది. ఈ వైరస్ తో పోరాడేందుకు మన శరీరంలో రోగ నిరోధక శక్తి ఎలా రూపాంతరం గురించి ప్రస్తావించారు. కాగా, అధిక జనాభా కలిగిన దేశంలో సాధారణ ప్రక్రియలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం కాదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కేవలం ఇమ్యూనైజేషన్ ద్వారానే హెర్డ్ ఇమ్యూనిటీ సాధించగలమని పేర్కొంది. వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ఇది సాధ్యమవుతుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈవైరస్ను ఎదుర్కోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.
Courtesy: NT