– ఉత్తరప్రదేశ్ పోలీసుల నిర్వాకం
లక్నో : కఠినమైన జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్ఎస్ఏ) గోవధకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనా ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రయోగిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఆగస్టు 19 వరకూ 139 మందిని ఎస్ఎస్ఏ కింద అరెస్టు చేయగా, వీరిలో 76 మంది గో వధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి (హోమ్) అవనిష్ కుమార్ అవస్తి ఈ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 31 నాటికి కేవలం బరైల్లీ పోలీస్ జోన్లోనే గోవధ ఆరోపణలతో 44 మందిపై ఎన్సీఏ ప్రయోగించారు.
అదనపు కార్యదర్శి వివరాల ప్రకారం ఈ ఏడాదిలో మహిళలు-చిన్నారులపై నేరాలకు పాల్పడిన ఆరుగురిపైనా ఎన్ఎస్ఏ కింద అరెస్టు చేశారు. ఘోరమైన నేరాలు చేసిన 37 మందిపైనా, ఇతర నేరాల కింద 20 మందిపైనా ఈ చట్టాన్ని ప్రయోగించారు. అలాగే, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సీఏఏ వ్యతిరేక నిరసనలతో సంబంధం ఉన్న 13 మందిని ఎన్ఎస్ఏ కింద అరెస్టు చేశారు. ‘ప్రజల్లో భద్రత, నేరస్తుల్లో భయం నెలకొల్పేందుకు ఎన్ఎస్ఏ ప్రయోగించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఆదేశించారు’ అని అవనిష్ కుమార్ అవస్తి తెలిపారు.
జాతీయ భద్రతా చట్టం ద్వారా, జాతీయ భద్రత, శాంతిభద్రతలకు ముప్పు అని అధికారులు భావిస్తే ఒక వ్యక్తిపై ఎలాంటి ఆరోపణలు లేకుండా 12 నెలలు పాటు నిర్భంధించవచ్చు.
కాగా, మరోవైపు ఎన్ఎస్ఏతో పాటు ఉత్తరప్రదేశ్ గోవధ నిషేధం చట్టం కింద కూడా భారీగా అరెస్టులు జరుగుతున్నాయి. ఈ చట్టం కింద 4 వేలకు పైగా మందిని అరెస్టు చేశారు. వీటిలో 32 కేసులను ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మూసివేశారు. మరోవైపు గోవధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపైనే ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ చట్టం కింద 2,384 కేసులు, గూండా చట్టం కింద 1,742 కేసులు నమోదు చేశారు. దాదాపు ప్రతీ పోలీస్ జోన్లో ఇదే పరిస్థితి. గోవధ ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తులపై తీవ్రమైన చట్టాలు ప్రయోగిస్తున్నారు. ఈ అధిక సంఖ్యలో అరెస్టులు గురించి జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ అవినాష్ చంద్రను ప్రశ్నించగా, ‘నిఘా వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా గోవధకు పాల్పడుతున్న వ్యక్తులపై డ్రైవ్ నిర్వహిస్తాం’ అని సమాధానం ఇచ్చారు.
Courtesy Nava Telanagana