యూపీలోకి అనుమతించని అధికారులు
లక్నో : వలసకార్మికులు వారి సొంతూళ్లకు వెళ్లొచ్చనీ, అందుకు రాష్ట్ర ప్రభుత్వాలే తగిన ఏర్పాట్లుచేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినా స్థానిక బీజేపీ ప్రభుత్వాలు మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నాయి. గుజరాత్లోని సూరత్లో పనిచేసే వలసకూలీలు.. దాదాపు 50 బస్సుల్లో యూపీకి బయల్దేరగా, వారిని రాష్ట్ర సరిహద్దుల వద్దే పోలీసులు అడ్డుకున్నారు. బస్సులు యూపీలోకి వెళ్లడానికి అనుమతి లేదని నిలిపేయడంతో దాదాపు ఐదువందల మంది కార్మికులు సరిహద్దుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇదే విషయమై సూరత్ కలెక్టర్ ధవల్ పటేల్ స్పందిస్తూ.. యూపీ, బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా కార్మికులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అనుమతులు ఇచ్చామనీ, అందుకోసం పాస్లు కూడా జారీ చేశామని తెలిపారు. చెక్పోస్టుల వద్ద బస్సులకు ఆఫ్లైన్ పాసులూ ఇచ్చామని అన్నారు. యూపీ సరిహద్దుల వద్ద బస్సులను పోలీసులు అడ్డుకున్న దానిపై స్పందిస్తూ.. ఇరు రాష్ట్రాల అధికారులు దీనిమీద మాట్లాడుతున్నారని తెలిపారు. కాగా, ప్రభుత్వాల సమన్వయ లోపం కారణంగా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గుజరాత్ నుంచి వచ్చిన కూలీలు