అధికారులకు మంత్రి ఈటల ఆదేశాలు
చికిత్స అందిస్తున్న అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు
వాటికి నోటీసులు జారీ చేశామన్న అధికారులు
విచారణకు కమిటీ.. తప్పులు తేలితే చర్యలు: ఈటల
హైదరాబాద్, ఆగస్టు 10: కొవిడ్ చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరు మారకుంటే వాటి ఐసీయూ లతో పాటు సగం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఆ విధంగా స్వాధీనం చేసుకునే పడకలు, ఐసీయూల్లో కరోనా రోగులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో చికిత్స అందించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రులపై ఇప్పటివరకు 1,039 ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ అంశంపై మంత్రి సోమవారం బీఆర్కే భవన్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని ప్రైవేటు ఆస్పత్రులకు సూచించారు. భారీగా బిల్లులు వేయడం, బిల్లులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం, రూ.3-4 లక్షలు అడ్వాన్స్ చెల్లిస్తే తప్ప అడ్మిట్ చేసుకోకపోవడం, పడకల కృత్రిమ కొరత సృష్టించడం, కనీసం నిర్ధారణ పరీక్షలు చేయకుండానే తిప్పి పంపడం వంటివి చేస్తున్నాయంటూ ప్రైవేటు ఆస్పత్రులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయని అధికారులు ఈసందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే బీమా ఉన్న రోగులను చేర్చుకోకపోవడం, క్రెడిట్ కార్డులను అంగీకరించకపోవడం, డబ్బులు చెల్లిస్తేనే డెడ్బాడీని అప్పగిస్తామనడంపైనా ఫిర్యాదులు అందినట్లు అధికారులు వివరించారు.
ఇతర జబ్బులతో చికిత్స చేయించుకోవడానికి ఆస్పత్రికి వస్తే కరోనా ప్యాకేజీ పేరిట డబ్బుల వసూలు, బ్లడ్ టెస్టుల్లోనూ డి-దైమర్, ఎల్డీహెచ్, సీఆర్పీ, ఫెరిటిన్, ఐఎల్6 లాంటి పరీక్షలు అవసరం లేకున్నా చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని ఆస్పత్రుల్లో రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ – పాలిమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్టీ-పీసీఆర్) టెస్టులకు అనుమతులున్నా… అవి చేయకుండా సీటీ స్కాన్, ఎక్స్రే, రక్త పరీక్షల పేరిట అనుమానిత లక్షణాలు కలిగిన వారిని ఇబ్బందికి గురిచేస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్లోని దాదాపు అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు రావడంతో ప్రతి ఆస్పత్రికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరినట్లు మంత్రికి అధికారులు తెలిపారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణల పరిశీలనకు వెంటనే ఒక కమిటీని ఏర్పాటుచేయాలని, విచారణలో తప్పులు తేలిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు ఆస్పత్రులపై తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వ బృందానికి మంత్రి ఈటల వివరించగా వారు కూడా సమర్ధించారని, అవసరమైతే ఎపిడమిక్ డిసీజ్ యాక్టు కింద చర్యలు తీసుకోవాలని వారు సూచించినట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
Courtesy Andhrajyothi