న్యూడిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ను తీసుకొచ్చింది. ‘ఆరోగ్య సేతు’ పేరుతో తయారు చేసిన ఈ కరోనా ట్రాకింగ్ యాప్ కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎన్ఐసీ ఈజీవోవీ ఈ యాప్ను అభివృద్ధి చేసింది.
ఐఓఎస్, ఆండ్రాయిడ్తోనూ పనిచేసే ఈ యాప్ వినియోగదారులను కరోనా బారిన పడకుండా అప్రమత్తం చేస్తుంది. కోవిడ్-19 బారిన పడిన వారు సమీపంలో ఉంటే వినియోగదారులను హెచ్చరికలతో అలర్ట్ చేస్తుంది. బ్లూటూత్, లొకేషన్ ఆధారంగా సోషల్ గ్రాఫ్ను ఉత్పత్తి చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది. అంతేకాదు దేశంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల గురించి, ప్రభుత్వ ప్రకటనలను దీని ద్వారా తెలుసుకోవచ్చు.
ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి?
ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్లో, ఐఫోన్ల కోసం యాప్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేయాలి. తర్వాత యాప్ను ఓపెన్ చేసి మీకు కావాల్సిన భాషను ఎంచుకోండి. రిజిస్టర్ నౌ అనే బటన్ నొక్కి బ్లూటూత్, లొకేషన్ అనుమతించండి. తర్వాత మీ ఫోన్ నంబరు నమోదు చేసి సబ్మిట్ కొట్టండి.
మీ ఫోన్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేశాక అడిగే వ్యక్తిగత వివరాలు ఇవ్వండి. పేరు, వయసు, జెండర్, వృత్తి, గత 30 రోజుల్లో మీ ప్రయాణ చరిత్ర అందులో నమోదు చేయాలి. ట్రాకింగ్ పనిచేయాలంటే ఫోన్లో జీపీఎస్, బ్లూటూత్ ఎప్పుడూ ఆన్లో ఉంచాలి. ఆరోగ్య సేతు యాప్ 11 భాషల్లో అందుబాటులో ఉంది. అయితే పౌరులపై నిఘా పెట్టడానికే ప్రభుత్వం ఈ యాప్ను తీసుకొచ్చిందని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ప్రెస్ ఇన్మరేషన్ బ్యూరో(పీఐబీ) తోసిపుచ్చింది.