భయ పెట్టేది మీరే కలిసి బ్రతకండి అని చెప్పేది మీరే , ఎట్లా అర్థం చేసుకోవాలి?
కోవిద్ మహమ్మారి అన్నారు, భయపెట్టారు, రోడ్డు మీద మాస్క్ పెట్టుకోకపోతేనో, కాసేపు షాప్ తెరిచి ఉంచారనో, బండి నడిపారనో, బయటకి వచ్చారనే నెపంతో కొట్టారు , కేసులు పెట్టారు , కొట్టి చంపారు. వైరస్ వచ్చిన వాళ్ళని దేశ ద్రోహి,టెర్రరిస్ట్, కరడు గట్టిన నేరస్తులలాగా బలవంతంగా లాక్కుపోయిన సందర్భాలు కూడా మన ముందున్నాయి.
హఠాత్తుగా మహమ్మారిని అదుపు చేయలేక చేతులెత్తేసి, అదే మహమ్మారితో సహచర్యం చేయాలి అన్నారు. ఇంట్లోనే ఉండి మీ జబ్బుని నయం చేసుకోండి అంటున్నారు. అసలు ఇల్లే లేని వాళ్లకి, ఇల్లు ఉన్నా మనిషికి ఒక రూమ్ లేని వాళ్ళ సంగతి ఏమిటి?, కొని కోట్ల కుటుంబాలు ఒక్కటే రూమ్ లో వాళ్ళున్నారు, ఒక్కళ్ళకి వస్తే అందరికి వచ్చినట్టే. అద్దెకి ఉండే వాళ్ళు కామన్ బాత్ రూమ్ లలో ఉంటున్న వాళ్ళ గురించి ఎం చేయాలో చెప్పరు. ఇక ఆసుపత్రుల సంగతి సరే సరి.
లాక్ డవున్ లో ఖాళీగా ఉండి నష్టాలు చవి చూసిన ఆసుపత్రున్నీ లెక్కలేనన్ని డబ్బు వసూలు చేస్తూ శవాలతో వ్యాపారం చేస్తున్నారు. కరోనా అంటే ఇప్పుడు లక్షల వ్యవహారం. లక్షలు కట్టికూడా మనిషి బతుకుతాడో లేడో అన్న భయంతో నిత్యం చావడం. సాటి మనిషికే కాదు మనకందరికీ కరోనా వస్తుంది అని తెలిసి కూడా పక్క వాళ్ళని, ఇంట్లో వాళ్ళని నేరస్తులల్లాగా చూస్తూ, అద్దె కు ఉన్న వాళ్ళని ఖాళీ చేయిస్తూ, మనలో ఉన్న ఒక అనాగరిక ఆచారాల్ని బయటపెట్టుకుంటున్నారు చాలామంది.
వేల కోట్లు , వందల కోట్లు కూల గొట్టడానికి , కట్టడాలకు ఖర్చు పెట్టె ప్రభుత్వాలు కొన్ని వందల కోట్లతో జిల్లాల వారీగా ఈ వైరస్ ని కట్టడి చేయడానికి ఖర్చు పెట్టలేక పోతున్నాయి . కనీసం మొక్కలు నాటడానికి పెట్టె డబ్బు కూడా పెట్టట్లేదు. మన నిర్లక్ష్యం వైరస్ వ్యాప్తి కి తోడ్పడడమే తప్పితే ఇంకొకటి లేదు .
జనాలు పెళ్ళిళ్ళకి , ఇల్లు కట్టుకోవడానికి దాచి పెట్టిన డబ్బు పెట్టి జబ్బు నయం చేసుకోవడమో , శవాలని తెచ్చుకోవడమో చేస్తున్నారు. ఢిల్లీ, ముంబాయి ధారవిలో చూసి అయినా మనం ముందుకు పడకపోతే లేని పోనీ భయాలతోని వచ్చి రాని వైద్యాలతోని, వైద్యం తోని విలువైన ప్రాణాలు పోగొట్టుకోక తప్పదు .
ప్రభుత్వాలు వినకపోతే, అర్థం అయేటట్టు చెప్పి, పనులు చేపించే భాద్యత ప్రతిపక్షాలు, ప్రజా ఉద్యమాలు, సివిల్ సొసైటీ చూసుకోవాలి. అవన్నీ కూడా ప్రత్యామ్న్యాయ పనులు చేస్తున్నాయి కాని వత్తిడి తేలేక పోతున్నాయి. చివరాఖరికి శ్మశానాలలో దహనాలు చేయడానికి అనుమతి ఇప్పించండి చాలు అనేదాకా వచ్చాము. సిగ్గు చేటు.
ప్రజలకి విజ్ఞప్తి !
దయచేసి ఎవరిని అవమాన పరచడం, అనుమానించడం చేయకండి. ఇవ్వాళ వాళ్ళు , రేపు మీరే కావొచ్చు . ఇది మన సామూహిక భాద్యత, విఫలం అయితే కూడా సామూహికంగానే తీసుకోవాలి . ఇది ఎవరూ తెచ్చి పెట్టిన సమస్య కాదు, ఎవరూ రావాలని కోరుకోరు. అందరూ మరీ నిర్లక్ష్యంగా ఏమి లేరు . సామూహిక వ్యాప్తి లోకి వచ్చాము కాబట్టి ఎట్లా వైరస్ వ్యాప్తి చెందుంతుందో ఎవరికీ తెలియదు. ఇల్లు కూడా సేఫ్ అని చెప్పలేము. అయితే ఈ పరిస్థితి ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం మాత్రమే. నర్సులు దొరకట్లేదు అంటున్నారు మరి ప్రయివేట్ వాళ్లకి ఎట్లా దొరుకుతున్నారు? ఎట్లా నడిపిస్తున్నారు ? జిల్లాకొక్క ఆసుపత్రి ఎట్లా సరిపోతుంది ? మీకు తెలియకుండానే లక్షలకి లక్షలు బిల్లులు వేస్తున్నారా ప్రైవేట్ వాళ్ళు?
ఏం చేయగలం ?
బస్తీలు, గ్రామాలు అయితే పంచాయితీ ఆఫీసులు, కమ్యూనిటీ హాల్స్ లో ఐసోలేషన్ సెంటర్ లు , క్వారంటైన్ సదుపాయాలూ ఏర్పాటు చేసుకుందాం . ఇంకా మనకి ఫంక్షన్ హాల్స్ , హొటెల్స్ , ఫార్మ్ హౌస్ లు, విల్లాలు ఖాళీగా ఉన్న బడులు, కాలేజీలు ఇవ్వమని ప్రజా ప్రతినిధులని అడిగి లేదా మనమే తలా కొంత డబ్బు వేసుకొని అన్ని ఏర్పాటు చేసుకుందాం. యువత ముందుకు వస్తే బాగుంటుంది. వైరస్ బారిన పడిన వారిని ఎవరన్నా ఇబ్బంది పెడితే ప్రజల రక్షణ కోసం పోలీసుల సహాయం తీసుకోవచ్చు .
అట్లాగే పెట్ట గలిగిన వాళ్ళు చిన్న చిన్న స్థలాలలో ఆక్సిమీటర్లు, మందులు, బీపీ మానిటర్లు , కొన్ని ఆక్సిజన్ సిలండర్లు పెట్టుకోవచ్చు .
ఇంకా గృహ వైద్యం కూడా అందరికి పడట్లేదు అని తెలుస్తుంది. కాషాయాలు, ఆవిరిలు , వేడి నీళ్లు ఎవరికీ శరీరానికి తగ్గట్టు వాళ్ళు చూడండి, తేడా వస్తె వదిలేయండి. ఆహారం మాత్రం ఉన్నంతలో ఆరోగ్యం ఇచ్చేవి చూసుకొని తినడం ముఖ్యం. పచ్చళ్ళు, కారంపొడులు ఎక్కువ కాకుండా చూసుకుందాం.
మనకి హెల్ప్ లైన్ లు, సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, మన శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు. సమస్య ఉంటె బయటకి చెప్పండి. మీలో మీరే ఉంచుకుని భాధపడొద్దు.
సుజాత సూరేపల్లి