- 100 అడుగుల దందా
- కాగితం మీద పులిగా మారిన 111 జీవో
- నిర్మాణాలే వద్దంటే బహుళ అంతస్తులు
- 500 గజాల్లో ఆకాశంలోకి లేచిన టవర్లు
- వందల కొద్దీ నిర్మిస్తున్నా అడిగే నాధుడు లేడు
- ఓయో రూమ్లు, కో-లివింగ్ స్పేస్లు
- లక్షల్లో అద్దె రావడంతో అక్రమాలకు తెగింపు
హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాల పరిరక్షణ కోసం రూపొందించిన 111 జీవో చట్టుబండలై పోయింది. జలాశయాల చుట్టూ ఉన్న 84 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. ఈ గ్రామాల్లో గ్రామకంఠం దాటి అసలు నిర్మాణాలే చేపట్టకూడదు. అయితే, చాలా గ్రామాల్లో పొలాలు ప్లాట్లు అయిపోయాయి. బహుళ అంతస్తుల భవనాలు లేచిపోయాయి. ముఖ్యంగా జీవో పరిధిలోకి వచ్చే వట్టినాగులపల్లి, ఖానాపూర్ గ్రామాలు గండిపేట చెరువు పక్కనే ఉంటాయి. ఈ రెండూ ఐటీ కారిడార్ కోర్ ఏరియాకు ఆనుకుని ఉండటంతో ఇక్కడ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పైగా ఈ రెండు గ్రామాలు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన నార్సింగ్ మున్సిపాలిటీలో భాగం అయ్యాయి. అక్రమంగా చిన్న భవనం నిర్మించినా లక్షల్లో అద్దె వస్తోంది. అందుకే, నిబంధనలు ఒప్పుకోకున్నా భారీ ఎత్తున నిర్మాణాలు జరిగిపోతున్నాయి.
చట్టాన్ని ఒప్పించే వాళ్లున్నారు
శివారు గ్రామాల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ సిబ్బంది అక్రమ నిర్మాణాలకు అడ్డం రాకుండా ఒప్పించే బాధ్యతలను తీసుకుంటున్నారు. కాసులిస్తే పాత తేదీలతో చనిపోయిన మాజీ సర్పంచుల పేరిట భవన నిర్మాణానికి పంచాయతీ అనుమతులు వచ్చేస్తాయి. నిజానికి పంచాయతీలో జీ+2 భవనానికి మాత్రమే అనుమతి ఇచ్చే అధికారం ఉంది. అదే అనుమతి తీసుకొని కనీసం నాలుగు నుంచి గరిష్ఠంగా ఏడు అంతస్తుల వరకు భవనాలను నిర్మిస్తున్నారు. వాళ్లకు ప్రభుత్వ అనుమతులతో పని ఉండదు. బ్యాంకు లోన్లు తీసుకోరు. భవనం కట్టేవాడు ఏ కార్పొరేట్ కంపెనీకో, ఓయో రూమ్లకో, కో-లివింగ్ పేరుతో వెలిసిన బ్యాచ్లర్ హాస్టళ్లకో లక్షలకు అద్దెకు ఇస్తాడు. ఐటీ కంపెనీలకు అతి దగ్గరగా ఉండటం, 111 జీవో కారణంగా ఇటీవలి వరకు నిర్మాణాలు లేకపోవడంతో ఇక్కడ సొంత డబ్బుతో భవనాలు కట్టుకొనే వారికి మంచి అవకాశంగా మారింది.
ఎవరి వాటా వారిది
నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా అంత పెద్ద పెద్ద భవన సముదాయాల్ని ఎలా కట్టేస్తారన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. ఎవరి స్థాయిలో వారికి ముట్టజెబుతుండటంతో మౌనంగా ఉండిపోతున్నారు. వార్డు మెంబరు మొదలు ప్రభుత్వ విభాగాధిపతుల వరకు ఎవరి వాటా వారికి ముందే ఖరారైపోతుంది. తాము చేయబోయే అక్రమ నిర్మాణం గురించి నిజాయితీగా చెప్పి డీల్ సెట్ చేసుకుంటారు. చెప్పిన అడ్వాన్స్ ఇచ్చి, మిగతాది ఎలా చెల్లిస్తారో మధ్యవర్తి ద్వారా ఒప్పందం కుదుర్చుకుంటే నిర్మాణం పనులను మొదలు పెట్టొచ్చు. ఏ శాఖకు చెందిన అధికారి వచ్చినా మధ్యవర్తులు మేనేజ్ చేస్తారు.
ఎంత లాభమంటే?
ఒకప్పుడు 500 గజాల స్థలంలో ఐదు అంతస్తులు నిర్మిస్తే అందరూ వింతగా చూసేవారు. అంతకు మించి నిర్మించేందుకు బిల్డర్లు కూడా సాహసించేవారు కాదు. ఇప్పుడు సెల్లార్ కలుపుకొని ఏకంగా 7-8 అంతస్తులను నిర్మిస్తున్నారు. ఒక ఫ్లోర్కు అదనంగా రూ.3-5 లక్షలు ముట్టజెబితే అడ్డుకునే వారు ఉండరు. ఫ్లోర్కు నాలుగు ఫ్లాట్లు నిర్మిస్తే అంతస్తుకు కోటి రూపాయలకు పైగానే లాభం వస్తుందని ఈ వ్యవహారాలు తెలిసిన వారు ఒకరు చెప్పారు. చట్టబద్ధత లేని ఫ్లోర్లలో ఫ్లాట్లను రూ.10 లక్షలు తక్కువకు అమ్ముతున్నారు. లాభదాయకమనే భావనతోనే ప్రజలు కొంటున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు. ఇంట్లోకి దిగితే అధికారులు ఏమీ చేయరన్న భరోసా బిల్డర్ల బరితెగింపునకు కారణంగా మారింది.
గ్రీన్జోన్ ఏదీ?
111 జీవో పరిధిలోని భూములను గ్రీన్జోన్గా ఉంచాలి. హెచ్ఎండీఏతో సహా ఎవరికి ఎలాంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చే అధికారం లేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం సర్పంచులు ఇచ్చినట్లుగా అనుమతులతో కొత్త భవనాలు లేస్తుంటాయి. జిల్లా అధికారులు ఫలానా భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ రిజిస్ట్రార్ ఆఫీసులకు లేఖలు రాస్తున్నా యథేచ్ఛగా జరుగుతున్నాయి.
Courtesy Andhrajyothi…