రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ : రాష్ట్రంలోని వలస కార్మికుల స్థితిగతులపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడున్నర లక్షల మంది వరకూ వలస కార్మికుల్లో 2 లక్షల మందికి షెల్టర్లల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని ఏజీ బీఎస్ ప్రసాద్ తెలిపిన నేపథ్యంలో హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. లక్ష మంది గురించి వివరించడంతో పాటు రెండు లక్షల మందికిపైగా వలస కార్మికులు ఎక్కడున్నారో, వారెలా ఉన్నారో ప్రభుత్వం పూర్తి వివరాలు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది.
లాక్డౌన్ వల్ల వాళ్లు ఎక్కడికీ వెళ్లలేరని, వారి జీవనపరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం సర్కార్ను ఆదేశించింది. వలస కార్మికుల కష్టాలు వర్ణనాతీయంగా ఉన్నాయని, ఉపాధి లేదనీ, సొంతూరు వెళ్లలేకపోతున్నారని పిటిషనర్ న్యాయవాది ప్రభాకర్ చెప్పారు. వలస కార్మికులను ఆదుకునే సర్కార్కు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కామారెడ్డిలో ఇద్దరు వలస కార్మికులు చనిపోయారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. విచారణను మే 6కి వాయిదా పడింది. కరోనా వైద్యం చేసేవాళ్లకు పీపీఈ కిట్లు, మాస్క్లు, శానిటైజర్స్ అందజేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్లు, గ్లౌజులు వంటివి అన్నీ తగినన్ని ఉన్నాయని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ చెప్పారు. అవన్నీ కావాల్సినన్ని లేవని పిటిషనర్లు ప్రతివాదన చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ బీఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిల డివిజన్ బెంచ్ కల్పించుకుని, అవన్నీ ఎన్ని ఉన్నాయో, ఎన్ని కావాలో ఆయా హాస్పటల్స్ సూపరిటెండెంట్ల నుంచి రిపోర్టులు తెప్పించుకుని పూర్తి వివరాలు ప్రభుత్వం అందజేయాలని ఆదేశించింది. కేరళ, ఏపీల్లో ర్యాపిడ్ యాక్షన్ కిట్లను వినియోగిస్తే పావు గంటలోనే టెస్ట్ ఫలితాలు ఉంటాయని పిటిషనర్ లాయర్లు చెప్పారు. ఈ కిట్లను తెలంగాణ లో ఎందుకు వాడటం లేదని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో 9 ల్యాబ్స్లో ఒక రోజుకు 4 వేల పరీక్షలు జరుగుతున్నందున అవి అవసరం లేదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ డైరెక్టర్ శంకర్ జవాబు చెప్పారు. విచారణ వచ్చే నెల 6కు వాయిదా పడింది.
గ్రామం తరలింపుపై నివేధిక ఇవ్వండి
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా సిద్దిపేట జిల్లా చినకొండూరు మండలం కొచ్చగుట్ట గ్రామాన్ని అధికారులు ఎలా ఖాళీ చేయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా గ్రామాన్ని ఎందుకు ఖాళీ చేయించారో తెలియజేయాలని ఆ జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట జిల్లా చినకొండూరు మండలం కొచ్చగుట్ట గ్రామంలోని ఇండ్లను అర్ధరాత్రి వేళ ఖాళీ చేయించడంపై బాధితురాలు ఇ.మంగవ్వ ఇతరులు వేసిన వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. పునరావాస, పునర్నిర్మాణ పథకాన్ని అమలు చేసే వరకూ అనంతగిరి రిజ ర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయరాదన్న హైకోర్టు ఆర్డర్ను అధికారులు ఖాతరు చేయలేదని పిటిషనర్ లాయర్ వాదించారు. మెమో కాపీ అందలేదని ఏజీ చెప్పారు. దీంతోహైకోర్టు..బాధితులకు కలెక్టర్ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. ఇండ్లను ఖాళీ చేయడం, కూల్చివేయడంపై 24లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
నిత్యావసరాల ధరలు పెరగలేదు : రాష్ట్ర ప్రభుత్వం
–హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం
కరోనా లాక్డౌన్ వల్ల కూరగాయలు,నిత్యావసర వస్తువులు, మాంసం వంటి వాటి ధరలు పెరగలేదనీ, గత ఏడాది ధరలతో పోలిస్తే 6 శాతం రేట్లు తగ్గాయని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగాయని పిటిషనర్ల లాయర్లు చెప్పారు. దీంతో వాస్తవ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుని 29 నాటికి రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రెటరీని హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే నెల 6కి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Courtesy: NT