కరోనా బాధితులకు కొండంత అండగా
పక్క వీధిలో కరోనా కేసు నమోదైందంటే చాలు.. అటుగా అడుగులు వేయడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. సమాజహితం కోరి ఇంటికే పరిమితమైన ఆ కుటుంబం బాగోగులు పట్టించుకునే వాళ్లు దాదాపు కరువవుతున్నారు. ఈ తరుణంలో వారికి అండగా మేమున్నామని అంటున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. ఒక్క కాల్ చేస్తే చాలు.. వేళకు భోజనం పంపించి వారిఆకలి తీరుస్తున్నాయి. త్వరగా కోలుకుంటారని ధైర్యం చెబుతున్నాయి.
హోమ్ క్వారంటైన్లో ఉంటున్న కరోనా బాధితుల ఆకలి తీరుస్తోంది కరీంనగర్కు చెందిన ‘మేమున్నాం మీకోసం’ అనే స్వచ్ఛంద సంస్థ. పట్టణంలోని వినాయక భోజనాలయం సహకారంతో కొవిడ్ రోగులకు పోషకాహారాన్ని అందిస్తోంది. ఫోన్ చేస్తే చాలు.. వారి అవసరాలు తెలుసుకొని సాయం అందిస్తున్నారు సంస్థ ప్రతినిధులు. ప్రతి రోజూ 30 కుటుంబాలకు మూడుపూటలా ఉచితంగా భోజనాన్ని అందిస్తున్నారు. భోజనంలో ఆకుకూరలు, గుడ్లు ఉండేలా చూస్తున్నారు. పండ్లు అందిస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనూ ఎందరి ఆకలినో తీర్చిన ఈ సంస్థ.. ఇప్పుడు కరోనా రోగులకు అండగా ఉంటోంది. ‘ఉచితంగా భోజనం స్వీకరించడం ఇష్టం లేని కొందరు.. డబ్బులు అందిస్తున్నారు. ఆ మొత్తాన్నీ తమలాంటి వారి ఆకలి తీర్చడానికి ఉపయోగించాలని కోరుతున్నారు. కరీంనగర్ పట్టణంలోని కరోనా బాధితులు సాయం కావాలనుకుంటే 90004 54141 నంబర్లో సంప్రదించాల’ని చెబుతున్నారు సంస్థ అధ్యక్షుడు నగునూరి రాజేందర్.
పంద్రాగస్టు నుంచి హైదరాబాద్లో..
ఆగస్టు 15 నుంచి హైదరాబాద్లో సైతం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు సామాజిక కార్యకర్త ప్రసన్నకుమార్. హోం క్వారంటైన్లో ఆహారం వండుకునే పరిస్థితి లేక, ఎవరి సాయం అందక సతమతమవుతున్న కరోనా పీడితులు ఎందరో! సోషల్ మీడియాలో వారి కథనాలు చూసి.. ఆపన్న హస్తం అందిస్తున్నారాయన. ఏ సహకారం అందని వారికి తాము భోజనం అందిస్తామని చెబుతున్నారు. ప్రతి రోజూ 900 కుటుంబాలకు భోజనం సరఫరా చేసేలా ప్రణాళిక రూపొందించామని అంటున్నారు. ‘హోం క్వారంటైన్లో ఉంటున్న కరోనా రోగులు 95059 06289 నంబర్ను సంప్రదిస్తే భోజనం ఇంటికే పంపిస్తామ’ని భరోసానిస్తున్నారు ప్రసన్నకుమార్.
Courtesy Namasthe telangana