– ఒడిషాలోని తలబిర అడవిలో 40 వేల చెట్ల తొలగింపు
– యథేచ్ఛగా అటవీ చట్టాల ఉల్లంఘనభువనేశ్వర్ : ప్రధాని మోడీ ఆప్తమిత్రుడు, వ్యాపారవేత్త గౌతం అదానికి సంబంధించిన ఓ గని కోసం ఒడిషాలో ఏకంగా 40 వేల చెట్లను నేలమట్టం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. సంబల్పుర జిల్లాలో ఉన్న తలబిర-2, 3 ప్రాజెక్టుల కోసం భూగర్భంలో ఉన్న బొగ్గును తవ్వుకోవడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఈ ఏడాది మార్చిలో అనుమతులు మంజూరు చేసింది. దానికోసం ఇక్కడ 1,038 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవిని తరలించడానికి ఆమోదం తెలిపింది.
ప్రతిపాదిత తలబిర-2,3 ప్రాజెక్టు నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ)కి అప్పగించగా, అది బొగ్గు గనులను వెలికి తీయడానికి అదాని సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద చెట్లను నరికేశారు. అయితే అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం గ్రామసభ నిర్వహించి గ్రామస్తుల సమ్మతం ద్వారా చెట్లను తొలగించాల్సి ఉండగా, అధికారులు ఆ నిబంధనలను ఉల్లంఘించారు. అడవిని ఆనుకుని ఉన్న పత్రపలి గ్రామసభ అనుమతి తీసుకోకుండానే అడవిని తొలగించారు. తలబిరకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు ఈ అడవిని 40 ఏండ్లుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే పోలీసుల బందోబస్తుతో తమనువేరే చోటకు పంపించి అధికారులు పని పూర్తి చేశారని గ్రామస్తులు ఆరోపి స్తున్నారు. గతంలో సైతం అడవిని నరకడానికి నాటి ప్రభుత్వాలు ప్రయ త్నిస్తే తాము దానిని అడ్డుకున్నామనీ, కానీ పోలీసులను తీసుకొచ్చి తమను బెదిరిసు ్తన్నారని వారు వాపోతున్నారు. మరోవైపు పర్యావరణవాదులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాతావరణ మార్పులతో భారత్లో వాయుకాలుష్యం పెరిగి పోతుంటే ఇక్కడి ప్రభుత్వాల నాయకులు మాత్రం చెట్లను కొట్టివేస్తున్నారు. ప్రతి పాదిత మైనింగ్ ప్రాంతం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్నది. ఇక్కడ మైనింగ్ కొన్నేళ్లుగా సాగుతున్నది. చెట్లను కొట్టివేయడం వెనుక కార్పొరేట్ల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు నరికివేస్తున్నవే గాకుండా మరిన్నింటినీ తొలగించడానికి అధికారులు యత్నిస్తున్నారు’ అని పర్యావరణవేత్త ప్రఫుల్లా సమంత తెలిపారు.
Courtesy Nava telangana…