విజయవాడ: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రమేష్ ఆసుపత్రి కొవిడ్కేర్ సెంటర్గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హోటల్లో 40మంది వరకు ఉన్నట్టు సమాచారం. వీరిలో 30మంది కొవిడ్ బాధితులు కాగా 10మంది ఆసుపత్రి సిబ్బంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరినట్లు సమాచారం.
దట్టంగా అలుముకున్న పొగవల్ల బాధితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ కిటికీల్లోంచి కేకలు వేశారు. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నారు. స్వర్ణప్యాలెస్ వద్ద సహాయచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఒకటో అంతస్తు నుంచి దూకిన నలుగురు..
అగ్నిప్రమాదంతో పొగలు దట్టంగా వ్యాపించాయి.. దీంతో భవనంలో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తుల్లో మంటలు అలముకున్నాయి. ఇతర అంతస్తులకు పొగలు వ్యాపించాయి. ఒకటో అంతస్తు నుంచి నలుగురు వ్యక్తులు కిందకి దూకేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కిటికీ అద్దాలను పగలగొట్టి నిచ్చెన సాయంతో పలువురిని కిందికి తీసుకువచ్చారు.
షార్ట్సర్క్యూట్తోనే..
తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుందని.. షార్ట్సర్క్యూట్తోనే మంటలు చెలరేగినట్లు సీపీ శ్రీనివాసులు తెలిపారు. బాధితులను భవనంలోని మెట్ల మార్గం ద్వారా తీసుకురావడం కుదరలేదని చెప్పారు. దీంతో నిచ్చెనల ద్వారా బాధితులను కిందికి దించి ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.
Courtesy Eenadu