- 8 మంది దుర్మరణం.. అహ్మదాబాద్లో ఘటన
అహ్మదాబాద్ : కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అసలే శ్వాస సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులు ఈ ఘటనతో ఉక్కిరిబిక్కిరైపోయారు. చూస్తుండగానే మంటలు వ్యాపించడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లోని శ్రేయ్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. శ్వాస సమస్యతో ఇబ్బంది పడుతున్న 40 మంది రోగులు నాలుగో అంతస్తులోని ఐసీయూ లో ఆక్సిజన్, వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నా రు. తెల్లవారుజామున 3.30 సమయంలో ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ని మిషాల్లో ఐసీయూ అంతా వ్యాపించాయి.
మంటలంటుకుని కొందరు, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై మరికొందరు ఇబ్బందిపడ్డారు. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించారని స్థానిక ఏసీపీ ఎల్.బి.జలా విలేకరులకు చెప్పారు. ప్రాథమిక దర్యాప్తులో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని గుర్తించామన్నారు. సమాచారం అందుకున్న వెంటనే, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఒకరిద్దరు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించామని.. మిగతా రోగులను అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారని వివరించారు. ఈ ఘటనపై గుజరాత్ సీఎం విజయ్రూపాని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. హోం, పట్టణాభివృద్ధి శాఖల అదనపు చీఫ్ సెక్రటరీలు సంగీతా సింగ్, ముఖేశ్ పురీ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించారు. మూడు రోజుల్లో నివేదిక అందించాలని కమిటీకి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఈ ఘటనపై ట్విటర్ ద్వారా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పీఎం సహాయనిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు.
Courtesy Andhrajyothi