- కవలలు పుట్టిన గంటకే కన్నతండ్రి ఘాతుకం
- శిశువులకు తప్పిన ప్రమాదం.. నిందితుడి అరెస్టు
కోస్గి/గండీడ్ : కవలలు పుట్టారని ఆ తండ్రి ఆనందపడలేదు.. పుట్టింది ఆడపిల్లలు కావడంతో వారిని పోషించలేనని భావించి ఆ నెత్తుటి గుడ్లను పురిట్లోనే చంపేయాలనుకున్నాడు. పుట్టిన గంటలోనే ఆ శిశుల నోట్లో పురుగులమందు పోశాడు. నారాయణపేట జిల్లా కోస్గిలో దారుణం వెలుగుచూసింది. మహబుబ్నగర్ జిల్లా గండీడ్ మండలం దేశాయిపల్లికి చెందిన దంపతులు కేశవులు, కృష్ణవేణికి నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. వారికి మూడేళ్ల కూతురు లక్ష్మి ఉంది. కృష్ణవేణి రెండోసారి గర్భం దాల్చింది.
ఈనెల 1న పురిటినొప్పులు రావడంతో కోస్గిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో చేరగా.. ఆడ కవలలు జన్మించారు. అప్పటికే ఓ ఆడపిల్ల ఉండటం, ఈ కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో వారిని పోషించడం కష్టమని భావించిన కేశవులు.. వారి నోట్లో పురుగుల మందు పోశాడు. ఈ దృశ్యాలు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. శిశువుల నోట్లో నుంచి నురగలు రావడాన్ని గమనించిన వైద్యులు.. విషప్రయోగం జరిగినట్లు గుర్తించి మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం, కృష్ణవేణి తల్లి భారతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.