- మండిన తరుగు వ్యధ
- ధాన్యం కొనుగోలులో తరుగు దోపిడీ
- కేంద్రాలు, రైస్ మిల్లర్ల కుమ్మక్కు
- సిరిసిల్లలో ధాన్యానికి నిప్పెట్టి నిరసన
- జగిత్యాలలో రోడ్డుపై బైఠాయించి ధర్నా
- 40 మంది స్టేషన్కు.. ఐదుగురిపై కేసు
- వనపర్తిలో గొడ్డలి, కర్రలతో దాడి
- ధాన్యం కొనుగోలులో తరుగు దోపిడీ.. కేంద్రాలు, రైస్ మిలర్ల కుమ్మక్కు
- తేమ, తరుగు పేరుతో కేంద్రాల్లో మాయ
- ధాన్యం రైస్ మిల్లుకు చేరాక మళ్లీ కోత
- ఎంత తరుగు తీస్తే అంత కమీషన్
- వాటాలేసుకుంటున్న అధికారులు
- తరుగు తీస్తే కఠిన చర్యలు: మారెడ్డి
హైదరాబాద్ : ధాన్యంలో తేమ, తరుగు పేరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యతలేమి నెపంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఒకసారి, రైస్ మిల్లుల వద్ద మరోసారి తరుగు తీస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఽకొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు 2-4 కిలోలు.. మిల్లుల వద్ద 5-6 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. దీంతో క్వింటాకు 10 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో పెత్తనం చెలాయిస్తున్న మిల్లర్లు.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను శాసిస్తూ ఈ దోపిడీ పర్వాన్ని నడిపిస్తున్నారు. వాస్తవానికి ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వంతోనే సంబంధం ఉంటుంది. మిల్లర్లకు ఎలాంటి జోక్యం ఉండదు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యాన్ని పరిశీలించి, తేమ, తాలు శాతం చూసి కాంటా చేయాలి. 17 శాతం వరకు తేమ మినహాయింపుతో కనీస మద్దతు ధర చెల్లించాలి.
ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.1835, సాధారణ రకానికి రూ.1815 ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ని క్వింటాళ్లు అయ్యాయి? ఎంత ధర పడింది? ఎంత మొత్తం వస్తుంది? అనే వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఓ చీటీ మీద రాసి రైతులకు ఇవ్వాలి. కేంద్రంలో ఽఒకసారి ధాన్యం కాంటా అయిందంటే రైతుల బాధ్యత ఏమీ ఉండదు. ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లో పడతాయి.
వ్యవస్థంతా రైస్ మిలర్ల చేతుల్లోకి
ధాన్యం కొనుగోలు వ్యవస్థంతా రైస్ మిల్లర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. పౌర సరఫరాల శాఖ అధికారులు, పీఏసీఎస్ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు… రైస్ మిల్లర్లతో మిలాఖత్ అయ్యారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన తర్వాత ధాన్యం లారీలతో పాటు రైతులను కూడా రైస్ మిల్లర్ల వద్దకు పంపిస్తున్నారు. అక్కడ మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. తేమ, తాలు ఉందని, మట్టి పెల్లలు ఉన్నాయంటూ క్వింటాకు 5- 6 కిలోల చొప్పున కోత పెడుతున్నారు. అప్పటికే కొనుగోలు కేంద్రాల్లో తీసిన 2- 4 కిలోలతో కోతతో కలిపితే… 10 కిలోల దాకా కోత పడుతోంది. ఇతరత్రా ఖర్చులు, కోతలు చూసుకుంటే రైతులకు క్వింటా ధాన్యానికి సగటున 90 కిలోలకే పైసలు వచ్చే పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల వద్ద కాకుండా మిల్లుకు ధాన్యం వెళ్లి, అక్కడ మళ్లీ తరుగు తీశాకే రైతుకు ధాన్యం అమ్మిన తాలూకు చీటీ ఇస్తున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్, ములుగు, మహబూబాబాద్, జనగామ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో ధాన్యాన్ని 41.2 కిలోలు తూకం వేసి 40కిలోల బస్తాగా లెక్క రాస్తున్నారు. దీనిని రైతులు ఆమోదిస్తున్నారు.
కమిషనర్ దృష్టికి వ్యవహారం
తరుగు దోపిడీ సమస్యపై పౌర సరఫరా శాఖ కమిషనరేట్, అగ్రి కమిషనరేట్లలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లకు రైతులు ఫిర్యాదు చేశారు. పలువురు రైతు సంఘాల నాయకులు కూడా కమిషనర్ దృష్టికి ఈ వ్యవహారం తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కమిషనరేట్ నుంచి ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు క్షేత్రస్థాయికి వెళ్లలేదు. దీంతో మిల్లర్ల దోపిడీ యధేచ్ఛగా జరుగుతోంది. రైతులు తెచ్చిన ధాన్యంలో ఎన్ని కిలోలు కోత పెడితే అంత మొత్తాన్ని కమీషన్ రూపంలో కొనుగోలు ప్రక్రియలో భాగస్వామ్యం ఉన్న పీఏసీఎస్, ఐకేపీ సెంటర్ల నిర్వాహకులు, పౌర సరఫరాల సిబ్బంది, అధికారులు, డీసీవోలు పర్సంటేజీల లెక్కన పంచుకుంటున్నారు.
Courtesy Andhrajyothi