- 2019లో 499 మంది బలవన్మరణం
- రోజువారీ కూలీలు 2858 మంది..
- ఆత్మహత్యల్లో జాతీయ సగటు 10.4
- తెలంగాణలో 20.6
- ఎన్సీఆర్బీ నివేదికలో వెల్లడి
హైదరాబాద్: రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. 2019లో 499 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ గణాంకాలు జాతీయ నేర రికార్డుల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా-2019’ నివేదికను ఎన్సీఆర్బీ మంగళవారం విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశవ్యాప్తంగా 10,281 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యధికంగా మహారాష్ట్ర 3,927 మరణాలతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కర్ణాటక (1,992), ఆంధ్రప్రదేశ్ (1,029), మధ్యప్రదేశ్ (541)లు ఉన్నాయి. ఆత్మహత్యల్లో జాతీయ సగటు 10.4 ఉండగా.. తెలంగాణలో అది 20.6 ఉండడం గమనార్హం.
7,675 మంది ఆత్మహత్య
రాష్ట్రంలో 2019లో మొత్తం 7675 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అందులో 5612 మంది పురుషులు కాగా, 2062 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు. 7,675 మందిలో రోజువారీ కూలీలే 2,858 మంది ఉన్నారు. 4,353 మంది ఆదాయం రూ.లక్షలోపే ఉంది. ఆత్మహత్య చేసుకున్నవారిలో 2,829 మంది నిరాక్షరాస్యులే ఉన్నారు. ప్రమాదవశాత్తు 11,720 మంది మృతి చెందారు. ఈ మరణాల్లో 3076 మంది 18 నుంచి 30 ఏళ్లవారే. 30-45 ఏళ్లవారు 4055 మంది ఉన్నారు.
22,196 ప్రమాదాలు
ఒక్క ఏడాదిలో 22,196 ప్రమాదాలు సంభవించాయి. అందులో 21570 మంది రోడ్డు, 626 రైల్వే ప్రమాదాలు జరిగాయి. మొత్తం ప్రమాదాల్లో 21,999 మంది గాయపడగా.. 7595 మంది మరణించారు. ఆకస్మిక మరణాలు 630 ఉన్నాయు. జంతువుల దాడి వల్ల 12 మంది, విషం తాగి 312 మంది, పాముకాటు వల్ల 261 మంది, కారణం తెలియకుండా 108 మంది మరణించినట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
Courtesy Andhrajyothi