– పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
– ఆర్డినెన్సులు ఉపసంహరించుకోవాలని డిమాండ్
– ఎంఎస్పీని ఎత్తివేసే కుట్ర
– పలు రాజకీయ పార్టీల మద్దతు
చండీగఢ్ : మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణలను నిరసిస్తూ పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో రైతులు కదంతొక్కారు. సోమవారం మూడు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున హాజరైన రైతులు.. జిల్లా కేంద్రాలకు ట్రాక్టర్లతో వచ్చి భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇది కొద్దిరోజుల క్రితం యూరప్ దేశాల్లో అక్కడి పాలకులు రైతుల పట్ల అనుసరిస్తున్న తీరుకు నిరసనగా వేలసంఖ్యలో ట్రాక్టర్లు, భారీ ట్రక్కులతో పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనలను గుర్తుకుతెచ్చింది. బీజేపీ పాలిత హర్యానా నుంచే సుమారు 15 వేల మంది అన్నదాతలు ధర్నాలో పాల్గొనగా.. పంజాబ్, రాజస్థాన్లోనూ కర్షకులు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐక్యతను చాటారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొస్తున్న వ్యవసాయ మార్కెటింగ్ చట్టాల్లో సరస్కరణలు, నిత్యావసర వస్తువుల చట్టాన్ని సవరించడం వంటి వాటి ద్వారా తమకు ఒరిగేదేమీ లేదనీ, కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే మోడీ సర్కారు పాకులాడుతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హర్యానా, పంజాబ్లోని దాదాపు అన్ని జిల్లాల నుంచి హాజరైన రైతులు.. జిల్లా కేంద్రాలలో ట్రాక్టర్లను రోడ్డుపైన నిలిపిఉంచి నిరసన తెలిపారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా.. మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించి నిరసన వ్యక్తం చేశారు.
రైతులంతా ప్రధానంగా మోడీసర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాల సంస్కరణ, నిత్యావసరాల వస్తువుల చట్టాన్ని సవరించడం, కాంట్రాక్టు వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వంటి ఆర్డినెన్సులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటే అడ్డూ అదుపూ లేకుండా కేంద్ర సర్కారు పెంచుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించాలని నినదించారు. ‘ఈ ఆర్డినెన్సులు రైతులకు పూర్తి వ్యతిరేకం. వాటి ద్వారా బడా కార్పొరేట్ కంపెనీలకు తప్ప సాధారణ రైతులకు ఒనగూరేదేమీ లేదు.
కేంద్ర సర్కారు తీసుకొస్తున్న సంస్కరణలతో ఇకనుంచి రైతులు బడా కంపెనీల దయా దాక్షిణ్యాల మీద బతకాల్సి వస్తుంది’ అని రైతు సంఘం నేత గుర్నామ్సింగ్ తెలిపారు. ఒక్క హర్యానా నుంచే 15 వేల మందికి పైగా రైతులు పాల్గొనడం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద వారి ఆగ్రహాన్ని సూచిస్తున్నదని గుర్నామ్ సింగ్ తెలిపారు. వ్యవసాయ ఆర్డినెన్సులతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యవస్థను కూడా రద్దు చేయాలని మోడీ సర్కారు కుట్రలు పన్నుతున్నదని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు.
ఎంఎస్పీని రైతుల ప్రాథమిక హక్కుగా చేయాలని రైతులు నినదించారు. ఈ నిరసనలకు రైతుసంఘాలతో పాటు రాజకీయ పార్టీలూ మద్దతు ప్రకటించాయి. హర్యానా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ నేతృత్వంలోని సంకీర్ణప్రభుత్వం.. దీనిని వ్యతిరేకిస్తూ రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రైతుల నిరసనలకు మద్దతు ప్రకటించారు.
Courtesy: NT