ఉప్పుమావులూరి సాంబశివరావు : 1951–2020
ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఏ సామాజిక దురన్యాయం జరిగినా ఆగమేఘాల మీద అక్కడికి చేరుకుని, అవసరమైన చర్యలు తీసుకుని బాధితులకు ధైర్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ ఉ.సా. కలిగించేవాడు. మార్క్సిజాన్నీ, అంబేడ్కరిజాన్నీ కలిపి మన సమాజ రుగ్మతలకు కొత్త ఔషధం తయారుచేయటానికి నిరంతరం ప్రయత్నించాడు. తన బహుముఖ కృషి ద్వారా సత్యమూర్తి, పద్మారావు, బొజ్జా తారకం, కృష్ణ మాదిగల సరసన నిలవగలిగిన స్టేచర్ను ఉ.సా. సాధించాడు.
ఇటు బహుజన ఉద్యమాలూ అటు వామపక్ష, విప్లవోద్యమాలూ సమంగా ప్రేమించిన ఉద్యమకారుడు ఉ.సా. బహుశా ఈ గౌరవం మరే ఇతర లీడర్కి దక్కలేదంటే ఆశ్చర్యం లేదు. అంబేడ్కరిజాన్నీ, మార్క్సిజాన్నీ సమన్వయీకరించి సిద్ధాంత, ఆచరణల్లో ప్రయోగిస్తూ జీవితాంతం వివిధ ఉద్యమాలను నడపటమే దీనికి కారణం. అంతేకాదు, అటు యువతీయువకుల్నీ ఇటు మధ్య వయస్కుల్నీ సమాన స్థాయిలో ప్రభావితం చేయగలిగిన కరిష్మా ఉ.సా. సొంతం. నాయకుడిగా, సిద్ధాంత వేత్తగా, కవిగా, రచయితగా, వక్తగా బోధకుడిగా, గాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉ.సా. ప్రసిద్ధుడు. చిరునవ్వుతో, స్నేహంగా అందరినీ కలేసుకుంటూ భేషజాలులేని సాదాసీదా వ్యక్తిగా జీవితాన్ని గడిపాడు. విప్లవోద్యమాలనుంచి, బహుజన ఉద్యమాలవరకూ సాగిన సాగుతున్న మన సామాజిక రాజకీయ ఉద్యమాల మలుపులన్నిటిలో ఉ.సా. ఉదాత్త పాత్ర ఉంది. ఉద్యమాల నుంచి వేరుచేసి ఆయన్ని, ఆయన్నుంచి వేరుచేసి ఉద్యమాలనూ చూడలేం.
గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని ఒక పల్లెటూరులో పేద మంగలి కుటుంబంలో పుట్టిన ఈ ఉద్యమాల ఉపాధ్యాయుడు కులవృత్తిలోకి దిగితే ఎలావుండేదోగానీ విప్లవోద్యమంలోకి దిగిన కారణంగా చరిత్ర నిర్మితమయ్యింది. విద్యార్థి ఉద్యమాలనుంచి పూర్తికాల విప్లవకారుడిగా ఉ.సా. పరిణమించాడు. యు.సి.సి.ఆర్.ఐ (ఎమ్ఎల్) నాయకుల్లో ఒకడిగా ఎదిగి, తూర్పు గోదావరి జిల్లా కొండమొదలు ఏరియాలో గిరిజన భూముల విముక్తికోసం పోరాటాల్ని నిర్మించాడు. గిరిజనులతో మమేకమై దశాబ్దకాలం పాటు న్యాయమైన వారి పోరాటాలకు వీరోచిత నాయకత్వం అందించాడు. ఎనభైలలో నల్గొండ జిల్లా మోతుకూరులో కరువు సమస్య నేపథ్యంలో రైతాంగ పోరాటాల్ని నిర్మించాడు. కుల సమస్య విషయంలో విభేదాల కారణంగా పార్టీ నుంచి బహిష్కారానికి గురయ్యాడు.
1985 కారంచేడు ఉద్యమం నుంచి కొత్త దృక్పథాన్నీ, అంబేడ్కరిస్టు తాత్వికతనూ ఉ.సా. వంటబట్టించుకున్నాడు. ఇదే ఆయన పార్టీనుంచి బహిష్కరించబడటానికి కారణమయ్యింది. కారంచేడు ఘటన కులదురహంకారానికి నిదర్శనమనీ, అందులో ఉన్నది వర్గసమస్య కాదనీ తరతరాలుగా వేళ్ళూనుకున్న కుల అసమానతల తాలూకూ సంఘర్షణ అనీ విశ్లేషించినందుకే ఆయన బయటికి రావాల్సివచ్చింది. ఉ.సా.తో పాటు కంచ ఐలయ్య కూడా బయటికి వచ్చాడు. 1987నాటికే వర్గ, కుల దృక్పథంతో జరగాల్సిన ఉద్యమం గురించి స్పష్టమైన వాదనతో ఒక పుస్తకం కూడా ఉ.సా. రాశాడు. మరోపక్క పీపుల్స్ వార్ నుంచి సత్యమూర్తి (శివసాగర్) బయటికి రావడం అదే సమయంలో జరిగింది. బి.ఎస్. రాములు, బొజ్జా తారకం, ఐలయ్య లాంటివాళ్ళు వర్గ, కుల సమస్యల్ని జమిలిగా చర్చిస్తున్న ఆ వాతావరణంలో ఉ.సా, సత్యమూర్తిలు కలిసి ‘మార్క్సిస్ట్ లెనినిస్టు సెంటర్’ పెట్టారు. అందులో ఆనాడు ఇంగిలాల రామచంద్రరావు, వై.రాజశేఖర్, రవి మారుత్, రామారావు, పార్వతి, ఉపేంద్ర, నేనూ ఇంకా కొంతమందిమి ఉన్నాం. ‘ఎదురీత’ పత్రిక మొదలయ్యింది. దానికి ఎడిటర్ ఉ.సా.నే ఆయన ఆధ్వర్యంలో ‘ఎదురీత’ పత్రిక గొప్ప సైద్ధాంతిక పోలరైజేషన్కు దోహదం చేసింది. తెలుగు మేధోవాతావరణాన్ని ఒక మలుపు తిప్పిన చారిత్రక పాత్రను అది నిర్వర్తించింది. ఉ.సా. ఎడిటోరియల్స్ ద్వారా, వ్యాసాల ద్వారా, చర్చల ద్వారా పత్రికను ఆ స్థాయికి తెచ్చాడు.
సత్యమూర్తి నుంచి చీలిపోయిన తరవాత ‘ఏకలవ్య’ పత్రిక కొన్నాళ్ళు నిర్వహించాడు. కలిసొచ్చిన అనేకమందితో కలిసి రాజకీయ సామాజిక ఐక్యకార్యాచరణకు సంబంధించిన అనేక ప్రయోగాలు చేశాడు. ఈ క్రమంలోనే మంద కృష్ణమాదిగ, ఆర్.కృష్ణయ్యలతో కలిసి పనిచేశాడు. మారోజు వీరన్నకు సైద్ధాంతిక, నైతిక మద్దతునిచ్చాడు. డఫోడం నిర్మాణానికి తోడ్పడ్డాడు. వివిధ పొలిటికల్ డాక్యుమెంట్లు రూపొందటంలో కీలకపాత్ర నిర్వర్తించాడు. 1998లో కుల సంఘాల రాష్ట్ర మహాసభలు నిర్వర్తించడానికి ఉ.సా. చాలా కష్టపడ్డాడు. కీలకమైన పాత్ర నిర్వర్తించాడు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను దృష్టిలో ఉంచుకుని ‘మా జనాభా దామాషా ప్రకారం మాకు రాజ్యాధికార వాటా’ అనే పిలుపునిచ్చాడు. రాజీలేని పోరాటం చేశాడు.
కులనిర్మూలనోద్యమంలో భాగంగా 2015లో ‘బహుజన ప్రతిఘటన వేదిక’ను నిర్మించి పలు ఆందోళనల్నీ, పోరాటాల్నీ చేయించాడు. సుజాత సూరేపల్లి, ఉషా యస్ డానీ, జిలుకర శ్రీనివాస్ లాంటివాళ్ళు ఈ వేదికలో వున్నారు. రెండు రాష్ట్రాలలోని అనేక జిల్లాలలో వరుస కార్యక్రమాలను ఈ వేదిక తరుపున జరిపి చైతన్య పూరిత వాతావరణాన్ని నింపడంలో బహుజన ప్రతిఘటన వేదిక చురుకుగా పనిచేసింది. వేముల రోహిత్ మరణం, మంధనీ, గరగపర్రు, అభంగపట్నం, మిర్యాలగూడా, భూపాలపల్లిలలో జరిగిన కులాధిపత్య మారణకాండల మీద పెద్ద ఎత్తున పీడిత కులస్తులనీ, ప్రగతివాద కార్యకర్తలనీ సమీకరించి ఉ.సా. యుద్ధం చేశాడు. మిర్యాలగూడ పోరాటంలో ఉ.సా.ది చాలా కీలకమైన పాత్ర. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఏ సామాజిక దురన్యాయం జరిగినా ఆగమేఘాలమీద అక్కడికి చేరుకోవడం అవసరమైన చర్యలు తీసుకోవడం, బాధితులకు ధైర్యాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ కలిగించడం చేస్తుంటాడు ఊసా. గత రెండేళ్లుగా ‘దేశీదిశ’ యుట్యూబ్ ఛానెల్ని నిర్వహిస్తూ తన ఇంటిని స్టూడియోగా మార్చాడు. బహుజన ఉద్యమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు దీనిద్వారా వెల్లడిచేయడం వల్ల ఉద్యమాలకు తగిన మోరల్ బూస్ట్ లభించింది. ఎంతోమంది బహుజన మేధావుల ప్రసంగాలనీ, ఇంటరాక్షన్లనీ ప్రసారం చేయడం ద్వారా బహుజనులకు ఎన్నో విషయాలమీద స్పష్టతనివ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టుల్లో న్యాయ పోరాటం చేసి గణనీయమైన విజయాల్నీ సాధించాడు. ఇక ఇటీవల కాలంలో పెరుగుతున్న హిందూ ఫాసిజాన్ని ఎదుర్కొనేందుకు హిందూ ఫాసిస్టు వ్యతిరేక కూటమిని స్థాపించాడు.
ఇలా ఉ.సా. జీవితాంతం సమాజం పట్ల స్పందిస్తూ పోరాడుతూనే వున్నాడు. నలుగురినీ పోగేసి మందికోసం నడుం కడుతూనే వున్నాడు. ఏయే సమూహాలతో కలిసి ఏమేరకు మంచి చేయగలిగే అవకాశం ఉంటే ఆమేరకు చేస్తూపోయాడు. తాను మారుతూ, మారుతున్న సామాజిక రాజకీయ వాతావరణంలో తాను నిర్వర్తించగలిగిన పాత్రను నిర్వర్తించాడు. ఎన్నో వైఫల్యాల్ని ఎదుర్కొంటూనే అంతిమ విజయం వైపు ఆరాటంగా ఆదుర్దాగా అడుగువేశాడు. మార్క్సిజాన్నీ, అంబేడ్కరిజాన్నీ కలిపి మన సమాజ రుగ్మతలకు కొత్త ఔషధం తయారుచేయటానికి నిరంతరం ప్రయత్నించాడు. సంభాషణ ద్వారా, సంస్కారవంతమైన చర్చద్వారా విభేదాల్ని పరిష్కరించుకునే ప్రజా స్వామ్య సంస్కృతిని ఉ.సా. నుంచి మనం నేర్చుకోవచ్చు. తనమీద వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లగక్కినవాళ్ళని కూడా విశ్లేషణాత్మక వాదనతో ఎంగేజ్ చేయడం ఈయన పద్ధతి. గత పాతికేళ్ళనుంచి అనేక సందర్భాల్లో ఉ.సా.తో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. ఆయన్నుంచి దూరమైన ప్రతిసారీ నన్ను తనే కాంటాక్ట్ చేసి కలుపుకుపోయేవాడు. ‘మనం ఒకరికొకరు దూరంగా వుండాల్సినంత విభేదాలు మనకు లేవు గదా. కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ సాధారణ సమస్యలపై కలిసి పనిచేయడం తప్పేముంది’ అనేవాడు. సామాజిక సమస్యల పట్ల ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటూ, నవతరంతో సన్నిహిత సంబంధాల్లో ఉండేవాడు. ఇందులో భాగంగానే సుజాతా సూరేపల్లి లాంటి రాజకీయ నాయకుల్ని తయారు చేశాడు. తన బహుముఖ కృషిద్వారా సత్యమూర్తి, పద్మారావు, బొజ్జా తారకం, కృష్ణ మాదిగల సరసన నిలవగలిగిన స్టేచర్ను ఉ.సా. సాధించాడు. బహుజన ఐకాన్స్లో ఒకడిగా ఆయన పరిణమించాడు.
జి.లక్ష్మీనరసయ్య
కవి, విమర్శకుడు