ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : ఉగ్రవాదులతో 18 గంటల పాటు సాగిన ఎన్కౌంటర్లో కల్నల్, మేజర్, ఎస్ఐతో సహా ఐదుగురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. జమ్మూకాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకూ జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవగా, ఒక సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. చన్గిముల్ గ్రామంలోని ఒక ఇంటిలో కొందరు పౌరులను ఉగ్రవాదులు బంధించారని సమాచారం రావడంతో ఆర్మీ, జమ్ముకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులు ఉన్న ఇంటికి చేరుకోగానే వారు కాల్పులు ప్రారంభించారు. శనివారం రాత్రి వర్షం కురవడం కూడా పౌరులను రక్షించే కార్యక్రమానికి ఆటంకం కలిగించింది. చివరికి పౌరులను భద్రతా సిబ్బంది బృందం రక్షించగలిగింది. ఈ ఆపరేషన్లో ఆర్మీ ఆధికారులు కల్నల్ అషుతోష్ శర్మ, మేజర్ అనుజ్ సూద్, నాయక్ రాజేష్ కుమార్, దినేష్, జమ్ముకాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ సగైర్ ఖాజి, ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. రజ్వారా ఫారెస్టు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులే పౌరులను బందీలుగా తీసుకున్నారని భద్రతా సిబ్బంది భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలతోపాటు, రెండు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
‘వారి శౌర్యాన్ని, త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోం. ఎన్కౌంటర్లో మృతిచెందిన సైనికులకు, రక్షణ సిబ్బందికి నివాళులు. మన ప్రజలను రక్షించడానికి అంకితభావంతో పని చేస్తూ మన జాతికి సేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి’ అని ప్రధాని నరేంద్రమోడీ ట్విటర్లో పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మృతులకు నివాళులర్పించారు. పంజాబ్కు చెందిన నాయక్ రాజేష్ కుమార్ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరిందర్సింగ్ సానుభూతి తెలిపారు. రూ.10 లక్షలు పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
Courtesy: NT