-వేర్వేరు అనారోగ్యాలతో ఒకేరోజు 8 మంది మృతి
– అంతకుముందు నలుగురు కరోనాకు బలి
– అక్కరకు రాని తార్నాక ఆర్టీసీ దవాఖానా
– పట్టించుకోని యాజమాన్యం, ప్రభుత్వం
– ఆందోళనలో ఉద్యోగులు
– కానరాని సంక్షేమ మండళ్లు
హైదరాబాద్: ఆర్టీసీలో మరణమృదంగం మోగుతున్నది. ఓవైపు కరోనా ఆర్టీసీ ఉద్యోగుల ప్రాణాలను హరిస్తుంటే…మరోవైపు వివిధ అనారోగ్యాలకు సరైన వైద్యం అందక మరికొందరు మరణించారు. ఈనెల 18వతేదీ ఒక్కరోజే ఆర్టీసీలో వివిధ అనారోగ్య కారణాలతో ఎనిమిదిమంది ఆర్టీసీ ఉద్యోగులు మరణించారు. అంతకుముందు మరో నలుగురు ఉద్యోగులు కరోనా కాటుకు బలయ్యారు. దీనితో ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్రమైన అభద్రతాభావం పెరుగుతున్నది. ఆపద సమయంలో తమను ఆదుకొనేవారు ఎవరూ లేరని ఆందోళన చెందుతున్నారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా ఆందోళనతో మరింత కుంగిపోతున్నారు. వైద్యానికి ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు. వారికి అలవాటైన తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ఎలాంటి వైద్యం అందట్లేదు. ప్రయివేటు ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ లేవంటూ చేర్చుకోవట్లేదు. సకాలంలో సరైన వైద్యం అందక అర్థంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. ఈ వైద్య నిర్లక్ష్యానికి బాధ్యత వహించేవారూ లేరు.
250 పడకలు ఉన్న తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో వంద పడకలను కోవిడ్-19 ప్రత్యేకవార్డుగా ఏర్పాటు చేసి, అన్నిరకాల వ్యాధులకు చికిత్సలు అందించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇప్పటికే అనేకమార్లు యాజమాన్యానికి, ప్రభుత్వానికి లేఖలు రాసాయి. అయినా పట్టించుకున్న నాధుడు లేడు. అర్థంతరంగా ప్రాణాలు వదులుతున్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. సరైన వైద్యం అందించలేకపోయామనే మానసిక క్షోభను కుటుంబసభ్యులు అనుభవిస్తున్నారు.
అంబులెన్సుల్లో పేషెంట్లను వేసుకొని ప్రయివేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు వాటిలోనే తుదిశ్వాస విడిచి, ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులూ ఉన్నారు. ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయినా ఏమాత్రం పరిస్థితుల్లో మార్పు లేదు. ఇటీవల టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీవీ రావు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణానికి రవాణాశాఖ మంత్రితో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు అందరూ నివాళులు అర్పించారు. కనీసం ఆ సమయంలోనైనా తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్యసేవల గురించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటన చేస్తారని భావించారు. కానీ అలాంటి కనీస ప్రయత్నం కూడా జరగలేదు.
గతేడాది జరిగిన ఆర్టీసీ సమ్మె సందర్భంగా దాదాపు 15 మంది కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారాన్ని ఆశిస్తూ ఆత్మబలిదానాలు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కార్మికులకు మనోధైర్యం కల్పించాల్సిన యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ప్రభుత్వం అది తమ బాధ్యత కాదన్నట్టే వ్యవహరిస్తున్నది. పైపెచ్చు వారి జీతాల్లో కోతలు విధిస్తూ, మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేవని ప్రకటించి, సంక్షేమ మండళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడా సంక్షేమ మండళ్లు ఏమయ్యాయో అంతుచిక్కట్లేదు. కార్మికుల్ని వారి మానాన వారిని కష్టాల్లో వదిలేసి, సంక్షేమ మండళ్లు చోద్యం చూస్తున్నాయి. ఇప్పటికైనా యాజమాన్యం, ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని కాంక్షించాలని ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు.
ఈనెల 18న మరణించిన ఆర్టీసీ ఉద్యోగులు
పేరు హౌదా డిపో
1. ఈఎన్ రాజు కండక్టర్ రాణిగంజ్ -1
2. శ్రీమూర్తి స్టేషన్ మేనేజర్ కోదాడ బస్టేషన్
3. ఎస్డీ హుస్సేన్ డ్రైవర్ వరంగల్-2
4. మల్లేష్ మెకానిక్ మేడ్చల్
5. కె ప్రభు కండక్టర్ జహీరాబాద్
6. చంద్రశేఖర్ డ్రైవర్ జహీరాబాద్
7. వి మోహనరావు డ్రైవర్ హయత్నగర్
8. బి ధర్మారెడ్డి కండక్టర్ చెంగిచెర్ల
Courtesy: NT