- ఆంక్షలు సడలె.. జనం కదిలె.. రాష్ట్రంలో మళ్లీ సందడి
- అన్ని గ్రామాల్లో దుకాణాలు తిరిగి ప్రారంభం.. పట్టణాల్లో నేటి నుంచి..
- సరి-బేసి విధానంలో తెరుచుకోనున్న షాపులు.. రోజూ సగం షాపులకే అనుమతి
- కళకళలాడిన హైదరాబాద్ రోడ్లు.. భారీగా బయటకు వచ్చిన ప్రజలు
- భవన నిర్మాణ సామగ్రి దుకాణాలు కిటకిట.. పెద్ద ఎత్తున సిమెంట్, స్టీల్ కొనుగోళ్లు
- మొదలైన ఆర్టీయే, రిజిస్ట్రేషన్ సేవలు.. నేటి నుంచి ‘మీ సేవ’ కార్యకలాపాలూ!
- మద్యం దుకాణాల వద్ద విధులకు పోలీసులు.. చెక్పోస్టుల వద్ద సిబ్బంది కరువు
నిద్దరోయిన రోడ్లు మేలుకున్నయ్! 45 రోజులుగా మూతవడ్డ షట్టర్లు ఓపెన్ సెసేమ్ అన్న లెక్క తెరుచుకున్నయ్!! ‘పాస్’లు చూపితేనే రోడ్ల మీద వాహనాలను ‘పాస్’ చేసిన ఖాకీల లాఠీల కట్టడి సడలింది! ఇంట్లో ఉండలేక.. బయటకు రాలేక.. బందు లెక్క గడుపుతున్న జిందగీలో మళ్లీ కదలిక మొదలైంది!! దంచి కొట్టిన వాన కాస్తంత తెరిపిచ్చినట్టు.. నలభై ఐదు రోజుల నిర్బంధం తర్వాత లభించిన స్వేచ్ఛతో జనాల్లో ఏదో తెలియని ఉత్సాహం! మార్చి 22 నుంచి దాదాపుగా స్తంభించి పోయిన జనజీవనం.. ఆంక్షల సడలింపులతో మళ్లీ సాధారణ స్థితిలోకి రావడం ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో దుకాణాలు తెరుచుకున్నాయి. పట్టణాల్లో సరి-బేసి పద్ధతిలో 50 శాతం దుకాణాలు గురువారం నుంచి అమ్మకాలు ప్రారంభించనున్నాయి. హైదరాబాద్లో నిర్మాణ రంగానికి సంబంధించిన దుకాణాలు విక్రయాలు మొదలుపెట్టాయి. ఆర్టీయే, రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గురువారం ‘మీ సేవ’ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో రాష్ట్రంలోని గ్రామాలు, మండల కేంద్రాల్లో బుధవారం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో.. ఉపాధిహామీ పనులకు పెద్ద ఎత్తున వెళ్లారు. ప్రజలు మాస్కులు ధరించనప్పటికీ.. భౌతిక దూరపు స్పృహ మాత్రం స్పష్టంగా కనిపించింది. ఇక పట్టణాల విషయానికి వస్తే.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో వాణిజ్య కార్యకలాపాలు బుధవారమే ప్రారంభమవుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. క్షేత్ర స్థాయిలో అమలుకు ఒక రోజు సమయం పట్టింది. పట్టణాల్లో 50ు షాపులే తెరవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు దుకాణాలకు సరి, బేసి సంఖ్యల విధానాన్ని నిర్ణయించాలని మునిసిపల్ పాలన డైరెక్టర్ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం.. బేసి సంఖ్య ఉన్న దుకాణాలు సోమ, బుధ, శుక్రవారాల్లో తెరుచుకోవచ్చు. సరి సంఖ్యలో ఉన్న దుకాణాలు మంగళ, గురు, శనివారం తెరవచ్చు. ఈమేరకు దుకాణాలకు నంబర్లు ఇచ్చారు. ఒక దుకాణం తెరిస్తే దాని పక్కన ఉన్న దుకాణాన్ని తెరిచేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరు. కాగా.. నారాయణపేట వంటి జిల్లాల్లో మాత్రం వ్యాపారస్తులు దుకాణాలను బుధవారమే తెరిచారు. పోలీసులు ఆయా దుకాణాల అసోసియేషన్లతో కలిసి 50ు షాపులను తెరిచేందుకు వీలుగా నంబర్లను కేటాయించారు.
గ్రేటర్లో..
హైదరాబాద్లో బుధవారం జనం పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలు, భవన నిర్మాణ సామగ్రికి సంబంధించిన వ్యాపార సంస్థలు తెరవడంతో.. వాటి కొనుగోలు కోసం రోడ్డెక్కారు. వీటితోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, రవాణా శాఖ కార్యాలయాలను కూడా తెరవడంతో ఆయా ఆఫీసుల్లో పనులపైనా చాలా మంది వెళ్లారు. కూలీలకు పని కల్పించేలా భవన నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా అందుకు సంబంధించి సామగ్రి విక్రయానికీ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం సిమెంట్, స్టీలు తదితర సామగ్రి దుకాణాలు తెరచుకున్నాయి. ప్రత్యేకించి రాజేంద్రనగర్ సర్కిల్లో ఈ దుకాణాలను ఎక్కువగా తెరిచారు. ఈ సామగ్రిని కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు వెళ్లడం కనిపించింది. మద్యం దుకాణాలు చాలాకాలం తరువాత తెరచుకోవడంతో మందుబాబులు ఉదయం నుంచే షాపుల వద్ద క్యూ కట్టారు. పోలీసుల్లో ఎక్కువ మందిని మద్యం దుకాణాల వద్ద విధులకు పంపించడంతో నగరంలోని చెక్పోస్టుల వద్ద సిబ్బంది తగ్గిపోయారు. ఇదే అదనుగా కొందరు యువకులు రోడ్లపై షికారు చేశారు. దీంతో లాక్డౌన్ కట్టడి కొంత లోపించిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు ఎక్కువ నమోదు కావడం, ఇంకా రెడ్జోన్లోనే ఉన్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల్ని మున్ముందు మరింత కఠినంగా అమలు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
Courtesy Andhrajyothi