-కార్మిక చట్టాలను బలహీన పర్చొద్దు
– ప్రతీ కుటుంబానికి ఆరు నెలలు ఉచిత రేషన్ ఇవ్వాలి: అజీం ప్రేమ్జీ
న్యూఢిల్లీ: కార్మిక చట్టాలను బలహీన పర్చేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల తీసుకున్న నిర్ణయాలు తెలిసి తాను షాక్కు గురయ్యానని ఐటీ సేవల సంస్థ విప్రో వ్యవస్థా పకులు అజీం ప్రేమ్జీ అన్నారు. కరోనా పేరుతో కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కార్మిక చట్టాల్లో మర్పులు చేయోద్దని అన్నారు.
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ఇప్పటికే అనేక మంది కార్మికులు ఆకలి చావులకు దగ్గరగా ఉన్నారనీ, ఈ సమయంలో ప్రభుత్వాలు వారికి అండగా ఉండాలన్నారు. వారి హక్కులను హరించవద్దని డిమాండ్ చేశారు. ఈ విపత్కర సమయంలో పేదలు, కార్మికులకు అండగా నిలిచే కార్యక్రమాలను ప్రభుత్వాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ”కార్మిక హక్కులను కాల రాయడానికి ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. వారిని రక్షించే అనేక కార్మిక చట్టాలను నిలిపివేయడానికి పరిశీలిస్తున్నాయి.
పారిశ్రామిక వివాదాలు, వృత్తి భద్రతా, ఆరోగ్యం, కార్మికుని పని పరిస్థితులు, కనీస వేతనాలు, కార్మిక సంఘాలు, కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన చట్టాలు ఇందులో ఉన్నాయి. వీటిని ఆపొద్దు. చట్టాలను బలహీన పర్చొద్దు”అని ఆయన డిమాండ్ చేశారు. ఔరంగాబా ద్లో 16మంది వలస కార్మికులు చనిపోయిన ఘటనను ప్రస్తావిస్తూ.. దేశంలో సామాజికభద్రత కరువైందనీ, కార్మికులకు రక్షణ కరువవుతున్న దని అన్నారు. కార్మికచట్టాలను బలహీన పరిస్తే పేదల సంఖ్య మరింతగా పెరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను బస్సులు, రైళ్లలో ఉచితంగా ప్రయాణించ డానికి అనుమతించాలని తాను రాసిన వ్యాసంలో వెల్లడించారు.