డిజైన్ లేకుండా ఎలా కడతారు?
తుది నిర్ణయం తీసుకోకుండా కూల్చేస్తారా?
కేబినెట్ నిర్ణయం మాకు చెప్పండి: హైకోర్టు
‘‘కొత్త సచివాలయంలో ఏ విభాగానికి ఎంత స్థలం కేటాయిస్తామనేది
తుది డిజైన్ తర్వాత తెలుస్తుంది.
తుది డిజైన్కు, నూతన నిర్మాణాలకు
అనుమతి ఇస్తూ ఈ వ్యాజ్యాలను
కొట్టివేయండి’’- రాష్ట్ర ప్రభుత్వం వాదన
హైదరాబాద్ : సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆపాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సచివాలయ భవనాలను కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంకా డిజైన్లు ఖరారు కాలేదని, డిజైన్లపై మంత్రిమండలి తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు నివేదించారు. నూతన నిర్మాణాలకు డిజైన్లు లేకుండానే ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని కేబినెట్ నిర్ణయించడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. తుది నిర్ణయం తీసుకోకుండానే ప్రస్తుత భవనాలను కూల్చివేయాలనే తొందర ఎందుకని ప్రశ్నించింది. నూతన సచివాలయ నిర్మాణానికి సంబంధించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని తమకు తెలియజేయాలని, అప్పటిదాకా ఎటువంటి కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ఖరారుకాని డిజైన్!
సచివాలయానికి సంబంధించిన వ్యాజ్యాలు విచారణలో ఉండడంతో తుది డిజైన్ ఖరారులో జాప్యం జరిగిందని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. దీనికి సంబంధించి కేబినెట్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ మేరకు ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ బుధవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ‘‘ప్రస్తుతం ఉన్న సచివాలయంలో 32 విభాగాలు ఉన్నాయి. 4.45 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో భవనాలు ఉన్నా ఉపయోగకరంగా లేవు. నూతన భవనాలను అంతర్జాతీయ ప్రమాణాలతో సువిశాలంగా…దాదాపు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తాం. ప్రస్తుతం ఉన్న భవనాల సముదాయం ఇరుకుగా ఉంది.
గతంలో 10 జిల్లాలు ఉండగా…ప్రస్తుతం వాటి సంఖ్య 33కు పెరిగింది. కాబట్టి నూతన భవనాల ఆవశ్యకత ఉంది. అధికారులతో సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు అనువైన సమావేశ మందిరాలు లేవు. నూతన భవనాల నిర్మాణానికి దాదాపు రూ.400 కోట్లు వ్యయం కానుంది. ఇందులో 32 శాఖలు కొనసాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నాం. ఏ విభాగానికి ఎంత మేరకు స్థలం కేటాయిస్తామనేది తుది డిజైన్ తర్వాత తెలుస్తుంది. తుది డిజైన్కు, నూతన నిర్మాణాలకు అనుమతి ఇస్తూ ఈ వ్యాజ్యాలను కొట్టివేయండి’’ అని సునీల్శర్మ కౌంటర్లో కోరారు.
Courtesy Andhrajyothi