స్కూటర్పై రెండు రోజుల ప్రయాణం
గ్వాలియర్: లాక్డౌన్ సడలింపుల అనంతరం కూడా ప్రజలకు రవాణా తిప్పలు తప్పడం లేదు. ఫలితంగా పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. ఓ గర్భిణి స్కూటర్పై ఏకంగా 1300 కిలో మీటర్లు ప్రయాణించి పరీక్షా కేంద్రానికి చేరుకోవడం గమనార్హం. రెండు రోజులపాటు ప్రయాణించి భర్త ఆమెను అతి కష్టం మీద గమ్యస్థానానికి చేర్చాడు. ఝార్ఖండ్లోని గడ్డా జిల్లాకు చెందిన ఏడు నెలల గర్భిణి ఉత్తర ప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు(డీఈఐఈడీ) పరీక్ష రాయాల్సి ఉంది. సరైనా రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో 1300 కి.మీ. దూరంలో ఉన్న పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు భర్త ధనుంజయ్ కుమార్తో ద్విచక్రవాహనంపై బయలు దేరింది. రెండు రోజుల ప్రయాణంలో వారు ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాలను దాటి చివరకు యూపీలోని పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఆ రెండు రోజుల ప్రయాణంలో వారు ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నారు. బిహార్లోని వరదలను దాటుకుంటూ వెళ్లారు. అనేక ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూ ముందుకు సాగారు.
ధనుంజయ్ ఓ క్యాంటీన్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అంత దూరం రాకపోకలకు వాహనంలో పెట్రోలు కోసం భార్య నగలను తాకట్టు పెట్టాడు. ప్రయాణంలో ఓ రాత్రి టోల్ ప్లాజా వద్ద ఆశ్రయం పొందారు. తాను 8వ తరగతి వరకే చదువుకున్నాని, భార్యను ఉపాధ్యాయురాలిగా చూడాలని ఉందని ధనుంజయ్ తెలిపాడు. భార్య జ్ఞాపకార్థం పర్వతాన్ని తవ్వి రోడ్డు నిర్మించిన దశరథ్ మాంజీనే తనకు ప్రేరణ అని తెలిపాడు. ‘ప్రయాణ సమయంలో పలుమార్లు నా కాళ్లు మొద్దుబారాయి. నడుము, కడుపులో నొప్పి వచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు’ అని భార్య సోనీ తెలిపింది. భర్తకు ధన్యవాదాలు తెలుపుతూ టీచర్ అవ్వడం తన కలగా పేర్కొంది.