– దేశంలోనే అతిపెద్ద నిర్బంధకేంద్రం సిద్ధం
– రూ.46కోట్ల వ్యయంతో 7ఎకరాల స్థలంలో..
డిస్పూర్: ప్రధాని మోడీ ఈ నెల 22న ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ నాయకులు, వారి మిత్రులైన కొంతమంది అర్బన్ నక్సల్స్ కలిసి.. ఎన్నార్సీ, సీఏఏ అమల్లోకి వస్తే ముస్లింలందరినీ నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. అసలు దేశంలో నిర్బంధ కేంద్రాలే లేవు’ అని చెప్పిన విషయం తెలిసిందే. కానీ, ఎప్పట్లానే మోడీ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది. అసోంలోని గోల్పరా జిల్లా మాటియాలో దేశంలోనే అతిపెద్ద నిర్బంధ కేంద్రం పూర్తికావొస్తున్నది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ నిర్మాణాన్ని రూ.46కోట్ల వ్యయంతో సుమారు ఏడెకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. 3వేల మంది నిర్బంధఖైదీలనుంచే సామర్థ్యం కలిగిన ఈ నిర్మాణం వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తిచేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. 15 నాలుగంతస్థుల భవంతులు కలిగిన ఈ నిర్మాణం చుట్టూ 22అడుగుల ఎత్తైన ప్రహారిగోడ ఉంది. వారికి బయటి ప్రపంచం తెలియకుండా ఇందులో ఆస్పత్రులు, పాఠశాలలు, ఇతర కార్యాలయాలు ఉండనున్నాయి. వచ్చే మార్చి వరకల్లా నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల బంధీలుగా ఉన్న శరణార్థులను ఇక్కడికి తరలిస్తారని సమాచారం. అయితే, దీనిపై స్పందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది.
ఇది మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఇలాంటివే మరో 10నిర్బంధ కేంద్రాలను నిర్మించాలని కేంద్రం ప్రణాళిక రచించింది. వచ్చే ఏడాదికల్లా ఎన్నార్సీని ఆచరణలోకి తెచ్చి, ఇప్పటికే ఈ జాబితాలో చోటు దక్కని 19లక్షల (రాష్ట్ర జనాభాలో ఆరుశాతం)మంది అసోంవాసులను ఈ కేంద్రాలకు తరలించాలనే వ్యూహంలో కేంద్రం ఉన్నట్టు సమాచారం.
దీనిపై అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు తరుణ్ గొగోరు మాట్లాడుతూ.. తమ పాలనలో హైకోర్టు ఆదేశాలమేరకు నిర్బంధకేంద్రాలు జైళ్లలో ఉండేవని అంగీకరించారు. బీజేపీ అధికారంలోకొచ్చాక అసోంలో భారీ నిర్బంధ కేంద్రం నిర్మాణానికి 2018లోనే కేంద్రం రూ.46కోట్లను విడుదల చేసిందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వమే ఈ నిర్మాణాన్ని చేపట్టి, ప్రధాని స్థాయిలో ఉన్న మోడీయే దీనిపై అబద్ధం చెప్పడం సిగ్గుచేటన్నారు.
(Courtesy: NT)