– ఢిల్లీ అల్లర్ల కేసులో ఇరికించే కుట్ర
– నాలుగు నెలలుగా నలుగురు విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు
– ఇప్పటికే పలువురు ప్రముఖులపై చార్జిషీటు
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ రాజధానిలో చోటుచేసుకున్న ఢిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతున్నది. ఈ కేసు వెనకున్న ‘కుట్రను ఛేదించాల్సిన’ పోలీసులు, ఇతర విచారణ ఏజెన్సీలు.. చార్జిషీటులో ప్రముఖ హక్కుల, సామాజిక కార్యకర్తలు, మేధావులు, వామపక్ష పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, కళాకారులపై కేసులు బనాయిస్తున్నాయి. ఢిల్లీకి చెందిన నలుగురు స్కాలర్ల (యోగేశ్ స్వామి, విశాల్ కుమార్, సన్నీ సింగ్, రాకేశ్ కుమార్)ను పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి గతనెల దాకా పదే పదే పిలుస్తూ విచారణ చేపడుతున్నారు. అల్లర్లతో తమకేమీ సంబంధం లేదని వారు చెబుతున్నా వినకుండా.. వారిని ఎలాగైనా ఇందులో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో మరో ముగ్గురు మహిళా విద్యార్థులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్, స్వరాజ్ ఇండియా అభియాన్ అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్తో పాటు మరికొందరు సామాజిక కార్యకర్తలపైనా అనుబంధ ఛార్జిషీటు చేసినట్టు వార్తలు వెలువడుతుండగా.. ఢిల్లీ పోలీసులు మాత్రం దానికి నిరాకరిస్తున్నారు. ఏచూరి, యోగేంద్ర యాదవ్ల పేర్లను చార్జిషీటులో చేర్చలేదని వారు చెబుతున్నారు.
ఢిల్లీ యూనివర్సిటీలో కెమిస్ట్రీ స్కాలర్గా ఉన్న సన్నీ సింగ్.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ‘సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా చేసిన నిరసన కార్యక్రమాల్లో మేం పాల్గొన్నాం. ఎందుకంటే ఇవి ఒక వర్గానికే గాక పేద ప్రజానీకానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవి ప్రజలను మతం ఆధారంగా విభజిస్తున్నాయి. ఢిల్లీ అల్లర్లు జరిగిన తర్వాత ఏప్రిల్ నుంచి పోలీసులు మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి పోలీస్స్టేషన్కు పిలిచి 10 గంటల పాటు కింద కూర్చోబెడుతున్నారు. ఈ అల్లర్లతో మాకేం సంబంధం లేదని చెబుతున్నా.. అల్లరి మూకలతో లింకులు, నిధుల గురించి గుచ్చి గుచ్చి అడుగుతున్నార’ని అతడు తెలిపాడు. ఈశాన్య ఢిల్లీకి చెందిన యోగేశ్ స్వామిని విచారించే సందర్భంగా.. నువ్వు హిందూవువే కదా..! అయినా ఎందుకు సీఏఏ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నావని ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన సూత్రదారులైన బీజేపీ నాయకులు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్లను పోలీసులు ఇంతవరకు ప్రశ్నించలేదు. కానీ మమ్మల్ని మాత్రం తరుచూ పిలుస్తూ వేధింపులకు గురిచేస్తున్నార’ని యోగేశ్ వాపోయాడు. వీరితో పాటు ఢిల్లీ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేస్తున్న విశాల్ కుమార్, రాకేశ్లను కూడా పోలీసులు నిత్యం విచారణ పేరిట వేధిస్తున్నారు. సీఏఏ నిరసనల సందర్భంగా రోడ్ల వెంబడి నిరసనకారులు చేసిన పోరాటాలు ప్రతిబింబేంచేలా విశాల్ కుమార్ బొమ్మలేశారు. ఢిల్లీ అల్లర్ల కేసుతో తనకేం సంబంధం లేదని మొత్తుకుంటున్నా వినకుండా పోలీసులు వారిని పదే పదే వేధిస్తున్నారని అతడు తెలిపాడు.
న్యాయమైన విచారణ జరిపించండి
ఢిల్లీ పోలీసు కమిషనర్కు రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ జులియో రెబిరో లేఖ
ఢిల్లీ అల్లర్లపై నిస్పాక్షిక విచారణ జరిపించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ శ్రీవాత్సవకు మాజీ ఐపీఎస్ అధికారి, రొమానియాలో భారత్కు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన జులియో రెబిరో లేఖ రాశారు. ఈ కేసులో పోలీసులు ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన నాయకులను వదిలి.. ‘శాంతియుత నిరసనకారులు’, ‘నిజమైన దేశభక్తుల’ మీద కేసులు నమోదుచేస్తున్నారని ఆయన ఆరోపించారు. లేఖ సారాంశం.. ‘ప్రియమైన శ్రీవాత్సవ..! నేను ఈ లేఖను భారమైన హృదయంతో రాస్తున్నాను. ఈ కేసులో న్యాయమైన విచారణ జరిపించాలని నిజమైన దేశభక్తుడిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మలను కోర్టులకు ఎందుకు అప్పగించలేదు. ఈ కేసుతో సంబంధం లేని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వనందన్, హర్ష మందర్లపై నేరారోపణలు మోపడం సమంజసం కాదు. ఇది నన్ను తీవ్రంగా కలిచివేస్తున్నది.
పోలీసులుగా మన డ్యూటీ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ.. చట్టాలకు లోబడి, కుల, మత బేధాలకు తావివ్వకుండా విచారణ జరిపించడం. దయచేసి మీ ఆదేశాలను పాటిస్తున్న పోలీసులకు చెప్పండి. వారు విధుల్లోకి చేరేముందు చేసిన ప్రమాణాల ఆధారంగానే పనిచేస్తున్నారో లేదో నిర్ధారించుకోమని సూచించండి’ అని లేఖలో పేర్కొన్నారు.
Courtesy: NT