– అమరావతి బ్యూరో
విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం తురువోలులో దళితులపై జరిగిన దాడులు, నేటికీ కొనసాగుతున్న సాంఘిక బహిష్కరణ విషయంలో హైకోర్టు తీర్పు హర్షణీయమని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ గ్రామం విషయంలో పోలీసుల నిర్లక్ష్యం, మెతక వైఖరిపై కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యాన పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పొత్తూరి సురేష్కుమార్ ద్వారా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైందని తెలిపారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి తీర్పునిచ్చిందని తెలిపారు. 2015లో దళితులపై దాడులు చేసి బహిష్కరణ ఇంకా కొనసాగుతుంటే వారి ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో దీనిపై వినతిపత్రం ఇస్తే అందరిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీనిచ్చిందని మాల్యాద్రి తెలిపారు. నష్టపరిహారం విషయంలో పాత జిఓ ప్రకారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది. 2015లో నేరం జరిగితే 2016లో ఛార్జిషీటు దాఖలు చేశారని, దాని ఆధారంగా పరిహారం ఇవ్వాలని ఆదేశించినట్లు మాల్యాద్రి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దళితులను ఇబ్బంది పెట్టిన ముద్దాయిలపై చర్యలు తీసుకోవాలని, పోలీసులపై చర్యలు లేకపోవడం బాధాకరమని తెలిపారు.
Courtesy Prajasakti..