– ఒడిషాలో ఘోర ప్రమాదం
– బస్సుకు విద్యుత్షాక్..
– 9మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
భువనేశ్వర్: ఒడిషాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సెలవుదినంకావటం వివాహ నిశ్చితార్థానికి పిల్లా పాపలతో కలిసి బంధువులంతా బస్సులో బయలు దేరారు. ఇంకొద్ది సేపట్లో గమ్యానికి చేరుకునేలోపు విద్యుత్ తీగలు బస్సుకు తగిలాయి. అంతే అక్కడికక్కడే తొమ్మిది మంది మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండగా వారి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన బరంపురం సమీపంలోని గొలంత్ర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. గంజాం జిల్లా డొంకలపాడు చెందిన దాదాపు 40 మంది గ్రామస్థులు నిశ్చితార్థ కార్యానికి సమీపంలోని చికరడ గ్రామానికి బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో మెండురాజ్పూర్ గ్రామం వద్దకు రాగానే బస్సు ఎత్తు ఎక్కువగా ఉండటంతో..పైన కరెంట్ తీగలు తగిలాయి. వాటిని డ్రైవర్ తప్పించేలోపే విద్యుత్తీగలు తాకాయి. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో కొందరికి కరెంట్ షాక్ తగిలి కుప్పకూలిపోయారు. ఈ ఘోరాన్ని చూసిన తోటి బంధువులంతా ఆర్తనాదాలు చేశారు.
కాపాడాలంటూ బోరున విలపిస్తూ రోదనలు చేశారు. ఈలోపే తొమ్మిది మంది చనిపోయారు. బస్సులోని పలువురు ప్రయాణికులతో పాటు చిన్నారులు కిటికీలు, అత్యవసర ద్వారం నుంచి స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన బరంపురంలోని ఎంకేఎస్జీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో తొమ్మిది మందిని కటక్లోని ఎస్సీబీ ఆస్పత్రికి తరలించినట్టు గంజాం జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నమనీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
Courtesy: NT