– నలుగురు మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా దండకారణ్యంలో మావోయిస్టులు, పోలీస్ బలగాలకు మధ్య బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. జెగర్గోండా పోలీస్ స్టేషన్ పరిధి పులంఫర్ దండకారణ్యంలో మావోయిస్టుల జగర్గోండ ఏరియా కమిటీ రహస్య సమావేశాలు జరుపుతున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ 223, కోబ్రా 201 బలగాలు జాయింట్ ఆపరేషన్లో భాగంగా నీల గోడ్, సుర్పాంగుడ ఏరియా అడవిని జల్లెడ పడుతుండగా మావోయిస్టులు తారసపడ్డారు. వారిని లొంగిపోవాలని హెచ్చరించారు. కానీ, మావోయిస్టులు పోలీసులపై కాల్పులు ప్రారంభించడంతో.. ఎదురు కాల్పులు జరిపారు. సుమారు గంటపాటు జరిగిన ఈ ఎదురుకాల్పుల అనంతరం ఘటనా స్థలిలో నలుగురు మావోయిస్టుల మృతదేహాలుతో పాటు ఒక 303, మూడు దేశవాలి తుపాకులు, పెద్దఎత్తున పేలుడు పదార్థాలు, భారీగా దేశీయ తయారీ మందు సామాగ్రి స్వాధీన పరుచుకున్నట్టు ఎస్పీ సలబ్ సింహ్నా ధృవీకరించారు.