- ఆలయంపై సర్కారు చిన్నచూపు..
- మేడారం మహా జాతరకే ప్రాధాన్యం
- పూనుగొండ్లలో శిథిలావస్థకు గుడి..
- గోడలు, పునాదులకు పగుళ్లు
- పట్టించుకోని అధికార యంత్రాంగం..
- రెండేళ్లకోసారి వంద కోట్ల ఖర్చు
- భక్తులకు కనీస సౌకర్యాలూ కరవే..
- గోవిందరాజు భక్తులకూ తిప్పలు
ఈ ఫొటో చూశారా!? మేడారం సమ్మక్క భర్తగా పూజలు అందుకుంటున్న పగిడిద్దరాజు ఆలయమిది! మూడు దశాబ్దాల కిందట పూనుగొండ్ల గ్రామస్థులు స్వచ్ఛందంగా చందాలు వేసుకుని నిర్మించిన ఈ ఆలయం ఇప్పుడు అవసాన దశకు చేరింది. పగుళ్లు ఏర్పడి గోడలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గుడి పునాదులూ పగుళ్లిచ్చాయి. కోటిమందికిపైనే భక్తులు సందర్శించుకునే మేడారం జాతరకు రెండేళ్లకోసారి ప్రభుత్వం రూ.100 కోట్ల వరకూ ఖర్చు చేస్తూనే ఉంది! అయినా, పగిడిద్ద రాజు ఆలయంపై చిన్నచూపే! శాశ్వత నిర్మాణాలూ కరువు!!
ఎప్పుడు కూలుతుందో తెలీదు
మేడారం జాతర అనుబంధ ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. పగిడిద్దరాజు ఆలయం పగుళ్లతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా అధికారులకు విన్నవిస్తే.. కనీసం పగుళ్లను పూడ్చే కార్యక్రమం కూడా చేపట్టలేదు. మా పూనుగొండ్ల గ్రామం ములుగు నియోజకవర్గంలో ఉంది. మహబూబాబాద్ జిల్లా అధికార యంత్రాంగం స్పందించడం లేదు. కనీసం భక్తుల సౌకర్యార్థం నిధులు కేటాయించాలి.
– పెనుక మురళీధర్, పగిడిద్దరాజు ఆలయ ప్రధాన పూజారి
వరంగల్ అర్బన్, జనవరి: సమ్మక్క- సారలమ్మ జాతరకు ప్రభుత్వం రెండేళ్లకోసారి వంద కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేస్తోంది. కానీ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆలయాలను పట్టించుకోవడం లేదు. అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయాన్ని ఎన్నో ఏళ్ల కిందట గ్రామస్థులు చందాలు వేసుకొని నిర్మించారు. ఆ తర్వాత కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ నయాపైసా కూడా కేటాయించలేదు. గోడలు, పునాదులకు పగుళ్లు ఏర్పడి ఆలయం కూలిపోయేందుకు సిద్ధంగా ఉందంటూ పగిడిద్దరాజు ఆలయ పూజారులు అనేకసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. దీంతో ఈసారి జాతర ఏర్పాట్లు చూసేందుకు వచ్చే అధికారుల ముందు నిరసన వ్యక్తం చేసేందుకు వారు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
ప్రతిష్ఠాత్మక మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈసారి ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనుంది. ఇందుకు ఆగమేఘాల మీద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం రూ.75కోట్లు కేటాయించగా.. పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండేళ్లకోసారి రహదారులు, స్నానఘట్టాలు, మరుగుదొడ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం శాశ్వత నిర్మాణాలపై మాత్రం దృష్టిసారించడం లేదు.
కొండ గుట్టల్లో మహా పాదయాత్ర
మేడారం జాతరకు ఒక్కరోజు ముందు (ఈసారి ఫిబ్రవరి 4న) పూనుగొండ్లలోని పగిడిద్దరాజు ఆలయంలో పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. పగిడిద్దరాజు పడగ(జెండా), పూజా సామగ్రితో 80 మంది పూజారులు దాదాపు 55 కిలోమీటర్ల మేర మేడారానికి మహా పాదయాత్ర చేస్తారు. ఎలాంటి రహదారులు లేని ఈ దారి కొండలు, గుట్టలు, చెట్లు, వాగులతో నిండి ఉంటుంది. ఈనేపథ్యంలోనే, పగిడిద్దరాజు జాతర ప్రవేశానికి రోడ్ల నిర్మాణం వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పూజారులు కోరుతున్నారు.
తిరుగువారం పండగకు కనీసం పది వేల మందికిపైగా భక్తులు వస్తారని ఆలయ పూజారులు చెబుతున్నారు. అయినా, ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. తాగునీటి కోసం కూడా తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. సమీపంలో ఉన్న పెండ్లి వాగుపై చెక్డ్యాం నిర్మించాలని, స్నానఘట్టాలు ఏర్పాటు చేయాలని పూజారులు కోరుతున్నారు. తద్వారా, ఇక్కడ తాగునీటి అవసరాలు తీరడమే కాకుండా మేడారం భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.
శాశ్వత నిర్మాణాలు ఏవీ!?
మేడారం జాతరకు కొన్ని రోజుల ముందు అధికార యంత్రాంగానికి పూనకం వచ్చినట్లు పనులు చేపడతారు. హడావిడి చేస్తారు. ప్రతి రెండేళ్లకు వందల కోట్లు ఖర్చు చేస్తారు. కానీ, శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు, సౌకర్యాల ఏర్పాటు గురించి పట్టించుకోరు. ప్రధానమైన జాతర మేడారం తప్ప ఇతర జాతరలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఏటూర్ నాగారం మండలం కొండాయిలోని గోవిందరాజుల గుడి వద్ద కూడా ఎటువంటి సౌకర్యాలూ లేవు. మేడారం గద్దెలకు గోవిందరాజును తీసుకెళ్లే క్రమంలో బిందెలతో నీళ్లారబోస్తారు. కొంతమంది భక్తులు పొర్లుదండాలు పెడతారు. నేలంతా బురదమయం అవుతుండడంతో భక్తులు, పూజారులకు ఇబ్బందిగా మారుతుంది. సీసీ రోడ్డు వేయాలని అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదంటున్నారు.
మాపై చిన్నచూపే
మా ఇలవేల్పు గోవిందరాజులు ఆలయానికి పరిసర గ్రామ ప్రజలే కాకుండా ఛత్తీ్సగఢ్, మహారాష్ట్ర నుంచీ భక్తులు వస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నిధులు కేటాయించడం లేదు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే లేడు. గోవిందరాజులు జాతరకు మరో ప్రత్యేకత ఉంది. మేడారం జాతర జరిగిన ఏడాది తర్వాత మినీ జాతర జరుగుతుంది. వేలాది మంది భక్తులు వస్తారు. ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– దబ్బకట్ల గోవర్ధన్, గోవిందరాజులు, ఆలయ ప్రధాన పూజారి, కొండాయి
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
పగిడిద్దరాజు ఆలయ భక్తులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదు. పగిడిద్దరాజు ఆలయం పగుళ్లు ఏర్పడి కూలిపోయే దశలో ఉన్నా అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. కేవలం మేడారం జాతరకు మాత్రమే నిధులు కేటాయించి అక్కడే పనులు చేపడుతున్నారు.
– సువర్ణపాక సరోజన, ఎంపీపీ గంగారం
Courtesy Andhrajyothi