ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 17,817 పడకలు ఖాళీ
ఇవి నిండితేనే ప్రైవేటు బెడ్లు అంటున్న అధికార్లు
ప్రైవేటు దవాఖానాల్లో ఆగని వసూళ్ల పర్వం
ప్రభుత్వ ధరలను అమలు చేయని ఆస్పత్రులు
కొలిక్కిరాని గరిష్ఠ ధరల ప్యాకేజీ ప్రతిపాదనలు
హైదరాబాద్, ఆగస్టు 28 : ప్రైవేటు ఆస్పత్రుల్లో తక్కువ ధరకు కరోనా చికిత్సపై పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పడకలన్నీ నిండితేనే.. ప్రైవేటులో సగం పడకల స్వాధీనం గురించి ఆలోచిస్తామంటూ వైద్యారోగ్య శాఖ స్పష్టం చేయడమే అందుకు గల ముఖ్య కారణం. దీంతో భారీగా బిల్లులు వసూలు చేసే ప్రైవేటు దవాఖానాల్లోని సగం పడకలను స్వాధీనం చేసుకుంటామంటూ గతంలో హడావుడిగా సర్కారు చేసిన ప్రకటన కార్యరూపు దాల్చే దాఖలాలు కనిపించడం లేదు. దీంతో పాటు ప్రభుత్వం ఖరారు చేసిన కొవిడ్ చికిత్స ధరలు అమలుకు నోచుకోవడం లేదు. ఈ విషయమై ప్రైవేటు ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటుచేసిన వాట్సా్పకు పెద్దఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినా సర్కారు వైపు నుంచి స్పందన కనిపించడం లేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. కరోనా రోగుల చికిత్సకు రాష్ట్రవ్యాప్తంగా 42 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 20,396 పడకలను సిద్ధం చేశారు. వీటిలో రెగ్యులర్ బెడ్స్ 12284, ఆక్సిజన్ బెడ్స్ 5861, ఐసీయూ బెడ్స్ 2251 ఉన్నాయి. గురువారం రాత్రి వరకు అన్ని పడకల్లోనూ కలిపితే 2579 మంది రోగులు చికిత్స పొందుతున్నారని, మరో 17817 పడకలు ఖాళీగా ఉన్నాయని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు. ఈ వారం వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 18024 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇలా వెలుగుచూస్తున్న కేసుల్లో 80 శాతం మందిలో ఇన్ఫెక్షన్ లక్షణాలు లేకపోవడంతో ఇళ్ల వద్దే చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన 20 శాతం మందే ఆస్పత్రులకు వస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు నిండితేనే ప్రైవేటు ఆస్పత్రుల్లోని పడకల గురించి ఆలోచిస్తామని ఉన్నతాధికారులు ప్రకటించడంతో సర్కారు ఆస్పత్రుల్లోని 17,817 పడకలు నిండేదెప్పుడు ? రోగులను లూటీ చేసేందుకు తెగబడుతున్న ప్రైవేటు ఆస్పత్రుల సగం పడకలను స్వాధీనం చేసుకునేదెప్పుడు ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల మల్లగుల్లాలు
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ధరలను ఖరారు చేస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐసొలేషన్లో అయితే రోజుకు రూ.4వేలు, ఆక్సిజన్పై ఉంటే రూ.7500, వెంటిలేటర్పై అయితే రూ.9వేల ధరలను నిర్ణయిస్తూ ఈ ఏడాది జూన్ 15న జీవో జారీ చేసింది. కానీ ఆ ధరలేవీ అమలు కావడం లేదంటూ వైద్యారోగ్య శాఖ వాట్సాప్ నంబరుకు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో గరిష్ఠ ధరల అమలు ప్యాకేజీ ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది. ఐసొలేషన్ పడకల్లో 14 రోజుల పాటు ఉంటే రూ.లక్ష, ఆక్సిజన్ బెడ్స్పై ఉంటే రూ.2 లక్షలు, వెంటిలేటర్పై ఉంటే రూ.3-4 లక్షల వరకు మాత్రమే చార్జీ చేయాలని, అంతకు మించి వసూల్ చేయరాదని వైద్య ఆరోగ్యశాఖ తేల్చిచెప్పింది. ఈ ప్రతిపాదనల అమలుపై ప్రైవేటు ఆస్పత్రులు మల్లగుల్లాలు పడుతున్నాయి. దానిపై ఒక నిర్ణయానికి వచ్చి తమ ప్రతిపాదనలను కూడా ప్రభుత్వానికి నివేదిస్తామని అవి తెలిపాయి. కానీ పది రోజులు అవుతున్నా ప్రైవేటు ఆస్పత్రులు ముందుకురాలేదు. అలాగే సర్కారు నిర్ణయించిన ధరలను కూడా అమలు చేయడం లేదన్న ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
లక్షల బిల్లులపై లబోదిబో..
కరోనా రోగి ఒకరు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా 45 రోజులు చికిత్స చేశారు. ఇందుకు ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. రూ.41లక్షల బిల్లు కట్టించుకున్నారు. ఇక మరో కుటుంబంలో ముగ్గురికి కరోనా చికిత్స అందించి ఓ ఆస్పత్రి రూ.60 లక్షలు వసూలు చేసింది. వైద్యారోగ్య శాఖ ప్రకటించిన వాట్సాప్ నంబరుకు ఇలాంటివి మరెన్నో ఫిర్యాదులు అందుతున్నాయి.
Courtesy Andhrajyothi