కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సంచలన వ్యాఖ్యలు చేసింది.
జెనీవా : కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన హెచ్ఐవీ(హ్యుమన్ ఇమ్యునో వైరస్) మాదిరిగానే కరోనా వైరస్ కూడా ఎప్పటికీ పోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైక్ ర్యాన్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ సమాజంలో మరో స్థానిక వైరస్గా మారవచ్చని, ఈ వైరస్ ఎప్పటికీ దూరం కాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. కరోనాతో కలిసి బతకాల్సిందేనని స్పష్టం చేశారు. ‘ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంద’ని వ్యాఖ్యానించారు.
హెచ్ఐవీ ప్రపంచం నుంచి ఎప్పుడు మాయమవుతుందో ఎవరికీ తెలియదన్నారు. అలాగా కరోనా వైరస్ కట్టడికి కూడా అత్యంత ప్రభావవంతమైన వ్యాక్సిన్ను కనుగొనగలిగితే దాన్ని నివారించగలుగుతామని మైక్ ర్యాన్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ ఎప్పుడు మాయమవుతుందో తమకు తెలియదన్నారు. కోవిడ్-19కు ప్రభావవంతమైన వ్యాక్సిన్ను తయారుచేసి, దాన్ని ప్రతీ ఒక్కరికీ పంపిణీ చేయగలిగితే ఈ వైరస్ను నివారింవచ్చని డాక్టర్ మైక్ ర్యాన్ పేర్కొన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 బారినపడి మరణించిన వారి సంఖ్య శుక్రవారం నాటికి 3 లక్షలు దాటేసింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45 లక్షలు దాటింది. కోవిడ్ నుంచి 17,23,550 మంది కోలుకున్నారు.