- కరోనా మరణాలపై సర్కారు లెక్కలు నమశక్యంగా లేవు
- 50% ప్రైవేటు పడకలపై ఒప్పందాలు ఎందుకు చేసుకోలేదు?
- రాయితీలు పొందిన ఆస్పత్రుల పేర్లను
- ఎందుకు బయటపెట్టడంలేదు?
- ఏ ఆస్పత్రులకు నోటీసులిచ్చారో స్పష్టత లేదు
- ఈనెల 22 లోగా సమాధానం చెప్పండి
- సర్కారుకు హైకోర్టు బెంచ్ ఆదేశాలు
- తదుపరి విచారణ ఈనెల 24కి వాయిదా
‘‘మీరు ఇంతవరకు కోర్టుకు చెప్పినవన్నీ అసత్యాలే.
ప్రతిసారీ.. వచ్చే నివేదికల్లో వాస్తవాలు వెల్లడిస్తామని చెబుతున్నారే తప్ప చెప్పడం లేదు. ఈ కేసులోనే కాదు..
అన్ని కేసుల్లోనూ మీరు ఇదే విధంగా చెబుతున్నారు’’
హైదరాబాద్ : కరోనా మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమకు ఇస్తున్న నివేదికల్లో వాస్తవాలు చెప్పడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకపక్క రోజుకు 9-10 మంది కరోనాతో చనిపోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని, మరోపక్క కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని ప్రస్తావించింది. ఈ రెండింటికీ పొంతన కుదరడం లేదని అభిప్రాయపడింది. కేసులు, మరణాలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసే బులెటిన్లు, జిల్లా కలెక్టర్లు ఇచ్చే బులెటిన్ల మధ్య తేడాలు ఉంటున్నాయని పేర్కొంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన కరోనా హెల్త్ బులెటి న్లను తమముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. కోర్టుకు అందజేసిన తాజా నివేదికలో 38 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని పేర్కొన్నా ఏయే ఆసుపత్రులకు నోటీసులిచ్చారో స్పష్టం చేయలేదని సర్కార్ను ఆక్షేపించింది. పేదలకు 15-25 శాతం వరకు ఉచిత వైద్యం అందిస్తామనే ఒప్పందంతో మూడు ఆసుపత్రులకు రాయితీపై భూములు కేటాయించినట్లు చెప్పినా వాటి పేర్లు ఎందుకు బయట పెట్టలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది.
50 శాతం పడకలు స్వాధీనం చేసుకుంటామని ఆరోగ్య మంత్రి ప్రకటించి నెల గడుస్తున్నా.. ఆ దిశగా అడుగులు పడినట్లులేదని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారో వివరిస్తూ ఈ నెల 22 లోగా నివేదిక ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ను ఆదేశించింది. వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు ఇవ్వాలని, మృతులకు, సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లోని రెడ్ జోన్, కట్టడి ప్రాంతాల్లో అందరికీ కరోనా పరీక్షలు చేయాలని దాఖలైన 19 ప్రజాహిత వ్యాజ్యాలపై శుక్రవారం విచారణ జరిగింది. విశ్రాంత ఆచార్యులు పీఎల్ విశ్వేశ్వరరావు, చెరుకు సుధాకర్, సూర్యాపేటకు చెందిన సంకినేని వరుణ్, నిర్మల్ న్యాయవాది చిన్నోళ్ల నరేశ్రెడ్డి, విశ్రాంత వైద్యులు కేపీ రాజేందర్, న్యాయవాది సమీర్ అహ్మద్ తదితరులు వేసిన ఈ వ్యాజ్యాలను సీజే జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. తదుపరి విచారణ 24వ తేదీకి వాయిదా వేసింది.
రెండింటిని టార్గెట్ చేస్తే ఎలా?
రాయితీలు పొంది పేదలకు ఉచిత చికిత్స అందించని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను ప్రతివాదులుగా చూపాలని.. రెండింటిని మాత్రమే టార్గెట్ చేస్తే ఎలా అని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ప్రశ్నించారు. సీజే జస్టిస్ చౌహాన్ కల్పించుకుంటూ.. మిగిలిన ఆసుపత్రులను ఇంప్లీడు చేయాలని గతంలోనే సూచించామని గుర్తు చేశారు. ఎన్నింటికి రాయితీలపై భూములు కేటాయించారో ఆ వివరాలు ఇవ్వాలని ఏజీ బీఎస్ ప్రసాద్కు స్పష్టం చేశారు. రాయితీలు పొంది పేదలకు ఉచిత వైద్యం నిరాకరించిన ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోని 50 శాతం పడకలను స్వాధీనం చేసుకునే చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టలేదన్న కోర్టు… ‘మీరు అమలు చేసేసరికి కొవిడ్ కథ ముగిసేలా ఉంది. ఎప్పుడు చేస్తారు? డిసెంబర్ చివరికా? వచ్చే జనవరి చివరికా..? ఢిల్లీ తరహాలో సర్క్యులర్ ఎందుకు జారీ చేయలేదు? మా ఆదేశాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చదవలేదా? ఆదేశాలు అమలు చేయకపోతే మరోసారి సీఎస్ సోమేశ్ కుమార్ వ్యక్తిగత హాజరుకు ఆదేశించడం మినహా మరో మార్గం లేదు’ అని సీజే వ్యాఖ్యానించారు. దీనిపై ఏజీ బదులిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు నిండిన వెంటనే ప్రైవేటులో పడకలు తీసుకుంటామని, యాజమాన్యాలు 50 శాతం పడకలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయని’ చెప్పారు. ‘సూత్రప్రాయంగా అంగీకరిస్తే సరిపోదు. సరైన ఒప్పందం ఉండాలి’ అని సీజే స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ మేరకు సర్క్యులర్ జారీ చేయాలన్నారు. ఇంతవరకు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు.
‘ప్రజల ప్రాణాలతో చెలగాటమా? కరోనాపై ప్రభుత్వం, అధికారులు పోరాడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ఎందుకు సహకరించవు? వారేమైనా చట్టానికి అతీతులా? వారిపై ఏదో ఒక చర్య తీసుకోవాలి. ప్రభుత్వం వెనక్కు తగ్గితే ఎలా?’ అని ధర్మాసనం నిలదీసింది. ఒప్పందం పాటించని ఆసుపత్రులకే అండగా ఉంటే ఎలా అని ప్రశ్నించింది. ‘మీరు ఇంతవరకు కోర్టుకు చెప్పనవన్నీ అసత్యాలే. ప్రతిసారీ వచ్చే నివేదికల్లో వాస్తవాలు వెల్లడిస్తామని చెబుతున్నారే తప్ప చెప్పడం లేదు. ఈ కేసులోనే కాదు అన్ని కేసుల్లోనూ మీరు ఇదే విధంగా చెబుతున్నారు’ అని ఏజీని మందలించింది. ఏప్రిల్ నుంచి ఇచ్చిన నివేదికలన్నీ తప్పేనని, కచ్చితమైన నివేదికలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించింది. ‘అధికారులు ఇచ్చిన నివేదికలను తిరస్కరిస్తున్నాం.. అవన్నీ తప్పుడు నివేదికలే’ అని బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏజీ వివరణ ఇస్తూ.. అధికారులకు న్యాయ సలహా ఇస్తానన్నారు. ఈ సమయంలో తిరిగి కల్పించుకున్న ధర్మాసనం… ‘ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలి. తప్పుడు నివేదికలు ఇస్తే ఎలా? కొవిడ్పై వ్యాజ్యాల్లోనే కాదు అన్ని వ్యాజ్యాల్లోనూ ఇదే తీరు’ అని వ్యాఖ్యానించింది. కరోనాపై హైకోర్టు అదేశాలు అమలవడం లేదని లాయర్ ప్రభాకర్ బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు.
కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవీ
జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలి. కొవిడ్ రోగులను గుర్తించాలి. సాధారణ పడకలు, ఆక్సిజన్ పడకలు, ఐసీయూ పడకలు ఏర్పాటు చేయాలి.
మీడియా బులెటిన్లో స్పష్టత ఉండాలి. ప్రైవేటు ఆసుపత్రులు, లేబరేటరీల్లో ఎంతమందికి కరోనా పరీక్షలు చేశారు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమందికి చేశారు? అనే వివరాలు ఉండాలి.
జీహెచ్ఎంసీలో ఓపీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. వాటిని వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే రోగులకు అందుబాటులో అంబులెన్సులు ఉంచాలి. ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే కేంద్రాల సంఖ్య పెంచాలి.
వైద్య, ఆరోగ్య శాఖకు కరోనాకు ముందు, తర్వాత కేటాయించిన నిధుల వివరాలు చెప్పాలి.
ఆసుపత్రుల ముందు ఖాళీ పడకల వివరాలతో డ్యాష్బోర్డులు ఏర్పాటు చేయాలి.
ఇళ్లులేని నిరుపేదలకు, బిక్షగాళ్లకు, రోడ్లపై ఉంటే వారికి, కిరాణా షాపుల వారికి, కూరగాయలు విక్రయించే వారికి ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా పరీక్షలు చేయా లి. దీని కోసం మొబైల్ లేబరేటరీలు వినియోగించాలి.
ప్రైవేటు ఆసుపత్రుల్లోని 50 శాతం పడకలు స్వాధీనం చేసుకుంటారో లేదో చెప్పాలి. చేసుకోకపోతే అందుకు తగిన కారణాలు కోర్టు ముందు ఉంచాలి.
హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఆసుపత్రుల్లో నేషనల్ ఫార్మసీ ప్రైస్ అథార్టీతో విచారణ చేయించి నివేదికను ప్రజారోగ్య శాఖ డైరెక్టర్కు ఇవ్వాలి.
జాతీయ విపత్తుల చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిని కోవిడ్-19 ఆసుపత్రిగా ప్రకటించే అంశంపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలి.
Courtesy Andhrajyothi