సుప్రీత్ సహోద్యోగి సుబ్బారావుకు (పేర్లు మార్చాం), అతని కుటుంబసభ్యులకు కరోనా సోకింది. కానీ.. ఆఫీసులో సుబ్బారావుకుఅటూ ఇటూ కూర్చున్న ఇద్దరు ముగ్గురికి మాత్రమే అధికారులు పరీక్షలు చేయించారు. మిగిలినవారికి చేయలేదు. దీంతో సుప్రీత్కు, మిగతావారికి భయం పట్టుకుంది. తమకు వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి టెస్టు చేయించుకుందామనుకున్నారు. కానీ.. వైరస్ లక్షణాలు లేకపోవడంతో ఏ ల్యాబ్, ఆస్పత్రి సిబ్బందీ వారికి పరీక్షలు చేయట్లేదు!!
లక్ష్మి, ఆమె భర్త ‘వందే భారత్ మిషన్’ కింద 15 రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చారు. వారు భారత్కు వచ్చినప్పుడు వైరస్ సోకిన లక్షణాలేవీ లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్లో ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు. కొద్దిరోజుల తర్వాత.. ఇంట్లోవారికి కూడా పరీక్షలు చేయించాలనుకున్నారు. కానీ ఆ పరీక్షలు చేయటానికి ఏ ల్యాబ్, ఆస్పత్రి ముందుకు రావట్లేదు. లక్షణాలు ఉంటే తప్ప పరీక్షలు చేయవద్దని ఐసీఎంఆర్ ఆదేశాలు ఉన్నాయంటున్నారు.
కరోనాపై పోరులో ముందువరుసలో నిలబడిన పోలీసుల్లో కొందరికి వైరస్ సోకింది! దీంతో హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో పోలీసులకు కొవిడ్-19 పరీక్షలు చేయడానికి ప్రత్యేకంగా ఒక కేంద్రా న్ని ఏర్పాటు చేశారు. ఒక రోజు పరీక్షలు జరిపి, నమూనాలు కూడా సేకరించారు! అంతలోనే.. ఐసీఎంఆర్ నిబంధన ప్రకా రం.. లక్షణాలు లేని వారికి పరీక్షలు చేయకూడదంటూ ఆ కేంద్రాన్ని ఎత్తివేశారు.
మన దగ్గర ఎంత డబ్బున్నా సొంతంగా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోలేని పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. కొవిడ్-19 పరీక్షల విషయంలో ప్రభుత్వాలు, ఐసీఎంఆర్ తీరు ‘‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’’ ..అన్న చందంగా ఉండడమే ఇందుకు కారణం. లాక్డౌన్ ఆంక్షలను సడలించి.. ‘మీ జాగ్రత్త మీరే చూసుకోండి’ అన్నట్టుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు.. అనుమానితులకు కరోనా పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయకుండా, ప్రైవేటు ఆస్పత్రులను చేయనివ్వకుండా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
వైరస్ సోకిందన్న సందేహం ఉన్నా పరీక్షలు చేయించుకోలేం!
లక్షణాలున్నవారికే టెస్టులు.. లేకుంటే ప్రభుత్వాస్పత్రుల్లో చేయరు
ప్రైవేట్ ల్యాబ్ల్లో చేయనివ్వరు.. హైకోర్టు చెప్పినా అదే పరిస్థితి
సందేహం తీరే మార్గం లేక ప్రజల్లో ఆందోళన
..ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. తెలంగాణలో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. వైరస్ సోకినా తమకు లక్షణాలు కనిపించట్లేదేమో, తమవల్ల కుటుంబసభ్యులకు, స్నేహితులకు సహోద్యోగులకు వైరస్ వ్యాపిస్తుందేమోనన్న భయం అందరిలోనూ ఉంటోంది!! పరీక్షలు చేయించుకుని, అందులో నెగెటివ్ వస్తేనే వారికి మనశ్శాంతి. కానీ, ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. దీనికి కారణం ఐసీఎంఆర్ సవరించిన మార్గదర్శకాలే. వాటి ప్రకారం.. ఎవరికి పడితే వారికి కరోనా పరీక్షలు చేయడానికి వీల్లేదు.
కేవలం ఇన్ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఫ్లూ తరహా అనారోగ్య) లక్షణాలున్నవారికి మాత్రమే చేయాలి. గత 14 రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన చరిత్ర ఉన్నా సరే.. ఆ లక్షణాలుంటేనే పరీక్ష. వైరస్ పాజిటివ్గా తేలినవారిని తాకినా, వారితో సన్నిహితంగా మెలిగినా కూడా.. ఆ లక్షణాలుంటేనే పరీక్ష. కరోనా పాజిటివ్ వచ్చినవారికి చికిత్స చేసే వైద్య సిబ్బందికి సైతం.. ఆ లక్షణాలుంటేనే పరీక్ష. లక్షణాలు లేకపోయినా కూడా ఎవరికి పరీక్ష చేయాలంటే.. ఇప్పటికే పాజిటివ్ గా తేలినవారిని తాకిన హైరిస్క్ (అంటే మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాలు ఉన్నవారు, వృద్ధులు తదితరులు) కాంటాక్టులకు మాత్రమే చేయాలి. ఫలితంగా ఫ్లూ తరహా అనారోగ్య లక్షణాలుంటేనే, అది కూడా వైద్యులు సిఫారసు చేస్తేనే పరీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎటువంటి లక్షణాలూ లేకుండా పరీక్షలు చేశారని.. దీనికి వెంటనే సమాధానం చెప్పాలంటూ కొన్ని ప్రైవేట్ ల్యాబ్లకు ఢిల్లీ ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది.
అనుమతులిచ్చినా..
దేశంలో కొవిడ్-19 బారిన పడినవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని గ్రహించిన ఐసీఎంఆర్ కొన్ని షరతులతో ప్రైవేట్ ల్యాబ్లలో పరీక్షలకు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సను అనుమతించింది. వీటిని ఢిల్లీ వంటి రాష్ట్రాలు వెంటనే అమలు చేయటం మొదలుపెట్టాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి ప్రైవేట్ ల్యాబ్లకు, ఆస్పతులలో కరోనా కేసుల చికిత్సకు సుముఖంగా లేదు. అయితే ఐసీఎంఆర్ మార్గదర్శకాల నేపథ్యంలో ఏప్రిల్లో తెలంగాణలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ కేసులకు చికిత్స చేయటం మొదలుపెట్టాయి.
ప్రభుత్వం తొలుత దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, గచ్చిబౌలిలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో 12 మంది పాజిటివ్ రోగులకు చికిత్స జరుగుతోందని తెలిసి.. తీవ్రంగా స్పందించింది. కరోనా కేసులకు చికిత్స అందించవద్దని ఏప్రిల్ 15న ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ తెలియక చేర్చుకున్నా వారిని గాంధీ ఆస్పత్రికి పంపాలని కూడా సూచించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవటం కష్టమని.. ఆ సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని.. కేసుల సంఖ్య పెరిగిపోతుందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఆ సమయంలో ఒక కార్పొరేట్ ఆస్పత్రిపై రాష్ట్ర వైద్య శాఖ అధికారులు విచారణ కూడా జరిపారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో, ల్యాబ్లలో పరీక్షలు, చికిత్సలు ఆగిపోయాయి.
హైకోర్టు చెప్పినా..
మే నెలలో కొవిడ్-19 వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగి.. సామూహిక వ్యాప్తి దిశకు చేరుకుందనే వాదన బలంగా వినిపించటం మొదలయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న పరీక్షల సంఖ్య చాలదని.. స్థోమత ఉన్న వారు ప్రైవేట్ ల్యాబ్లలో పరీక్షలు చేయించుకొనేలా.. ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొనేలా అనుమతించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రైవేట్ ల్యాబ్లను, ఆస్పత్రులను అనుమతిస్తే అనేక సమస్యలు ఎదురవుతాయని ప్రభుత్వం కోర్టులో వాదించింది. అయితే ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఐసీఎంఆర్ అనుమతించిన ల్యాబ్లలో పరీక్షలు చేయించుకోవచ్చని.. ఆస్పత్రులు చికిత్స చేయవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కూడా అలా జరగట్లేదు.
ఢిల్లీలో ప్రైవేట్ ఆస్పత్రులు ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేస్తామని.. ఆ తర్వాత తాము అనుమతులు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంటూ వచ్చింది. దీంతో హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో కూడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స జరగట్లేదు. ‘‘మేం పరీక్షలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే మేం మాత్రం ఏం చేస్తాం? మా దగ్గర కొవిడ్ -19 పరీక్షలు చేయటానికి అనుమతి లేకపోవటంతో.. సర్జరీలు చేయాల్సిన సమయంలో వైరస్ సోకిందీ లేనిదీ నిర్ధారించుకునేందుకు ఊపిరితిత్తుల సీటీ స్కాన్ చేయిస్తున్నాం. దీని వల్ల పేషెంట్కు అదనపు భారం పడుతోంది. కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మేము ఏం చేయలేం’’ అని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ ఒకరు వెల్లడించారు.
తొమ్మిది ల్యాబ్లే..
ప్రస్తుతం కొవిడ్ 19 పరీక్షలు చేయటానికి ఐసీఎంఆర్ అనుమతించిన 9 ప్రభుత్వ ల్యాబ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో రోజూ వెయ్యి దాకా పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లాల నుంచి వచ్చిన నమూనాలను నేరుగా ల్యాబ్లకు పంపుతున్నారు. అయితే, కొవిడ్-19 విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ ల్యాబ్ల సామర్థ్యం సరిపోదని నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. ‘‘ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ప్రైవేట్ ల్యాబ్ల్లో పరీక్షలు జరపకపోతే పరిస్థితి మరింత భయంకరంగా ఉండేది. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ల్యాబ్లను ఎందుకు అనుమతించట్లేదో అర్థం కావట్లేదు. అలా చేస్తే పాజిటివ్ వచ్చినవారితో సంబంధం ఉన్నవారిని ట్రేస్ చేయడం కష్టమనే వాదన సరికాదు. ఎందుకంటే ప్రైవేట్ ల్యాబ్లు కూడా తమ వద్ద ఉన్న వివరాలన్నీ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది’’ అని ఐసీఎంఆర్ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
అందుకే అనుమతించట్లేదా?
ఐసీఎంఆర్ నిబంధన ప్రకారం ప్రైవేట్ ల్యాబ్లు, ఆస్పత్రులు టెస్టింగ్ కిట్లను ప్రైవేట్గా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వీటిని అనుమతించడం వల్ల ప్రభుత్వానికి అదనంగా పడే భారం ఉండదు. పైగా ప్రస్తుతం ప్రభుత్వ ల్యాబ్లపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది కూడా! జూన్, జూలై నెలల్లో కొవిడ్-19 కేసుల సంఖ్య భారీగా పెరిగి పతాకస్థాయికి చేరుతుందని.. ఆ సమయంలో ప్రభుత్వం వద్ద ఉన్న సామర్థ్యం సరిపోదని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్లపై ఆధారపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ పరిస్థితి ఎదురయ్యేలోపే ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతించాలని సూచిస్తున్నారు. అలాగే, టెస్టుల విషయంలో కూడా సడలింపులు ఇవ్వాలని… స్థోమత ఉన్నవారికి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించాలని అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఇది ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్న సమస్య కాదు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరి.. ఐసీఎంఆర్ ఎందుకు పరీక్షలకు అనుమతించట్లేదు? టెస్టింగ్ కిట్ల కొరత వల్లా? మరింకేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదు.
ఇలా వసూలు చేయండి
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ధరలను సిఫారసు చేసిన ఫిక్కీ
న్యూఢిల్లీ :దేశంలోని అన్ని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రుల ప్రతినిధులతో కూడిన ఫిక్కి కోవిడ్ రెస్పాన్స్ టాస్క్ఫోర్స్.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్-19 చికిత్సకు ప్రామాణిక ధరలను సిఫారసు చేసింది.
ప్రభుత్వం సిఫారసు చేసిన పేషెంట్లకు..
కేవలం ఐసోలేషన్ వార్డులో చికిత్సకైతే రూ.13,600 వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్సకు రూ.27,088 వెంటిలేటర్తో సహా ఐసీయూలో చికిత్సకు రూ.36,853
సొంతంగా వైద్యం చేయించుకునేవారికి.
కేవలం ఐసోలేషన్ వార్డులో చికిత్సకైతే రూ.17,000 వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్సకు రూ.34,000
వెంటిలేటర్తో సహా ఐసీయూలో చికిత్సకు రూ.45,000
ఆరోగ్య బీమా వినియోగించుకునేవారికి..
కేవలం ఐసోలేషన్ వార్డులో చికిత్సకైతే రూ.20,000
వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్సకు రూ.55,000
వెంటిలేటర్తో సహా ఐసీయూలో చికిత్సకు రూ.68,000
Courtesy Andhrajyothi