– అవసరం లేని ఆస్పత్రులకు భారీగా పడకల కేటాయింపు
– ప్రాధాన్యతను గుర్తించడంలో సర్కారు విఫలం
హైదరాబాద్ : కరోనా కట్టడి, చికిత్స విషయంలో ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. మారుతున్న పరిస్థితులను, అవసరాలను గుర్తించి ఆ మేరకు ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడంలో విఫలమవుతున్నది. మొదట్నుంచి టెస్టుల సంఖ్య విషయంలో ప్రపంచమంతా ఒకలా, మనం మరోలా అన్నట్టు పరిమిత సంఖ్యలో చేస్తూ వచ్చింది.
ఆ తర్వాత చికిత్స కోసం రాష్ట్రంలోని మారుమూల ప్రజలను కూడా నగరంలోని గాంధీ ఆస్పత్రిపైనే ఆధారపడేలా వ్యవహరించింది. తీవ్రమైన ఒత్తిడి తర్వాత కొంతమేరకు టెస్టులు పెంచి, జిల్లాల్లోని ఆస్పత్రుల్లో కూడా కరోనా రోగుల కోసం బెడ్లను ఏర్పాటు చేసింది. అయితే నెల క్రితం జీహెచ్ఎంసీని హడలెత్తించిన కోవిడ్-19 ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు కొన్ని పట్టణాల్లో ప్రభావం చూపిస్తున్నది. కరోనా వ్యాప్తి దిశను తెలుసుకునేందుకు ఐసీఎంఆర్, వైద్యారోగ్యశాఖలు వేర్వేరుగా సర్వేలు నిర్వహించారు. ఇవి భవిష్యత్తులో కరోనా విస్తరణను అడ్డుకోవడంతో పాటు చికిత్స సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడేవి. అయితే ఆయా జిల్లాలు, ప్రాంతాల వారీగా పరిస్థితిని సరిగ్గా అంచనా వేయడంలో గానీ, ఆ మేరకు ఏర్పాట్లు చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరోనా చికిత్స కోసం జిల్లాల నుంచి ప్రజలు దూరభారాల్ని ఓర్చుకొని రావాల్సి వస్తుండడంతో గాంధీలో సిబ్బందిపై పని భారం పెరిగింది.
నెలల తరబడి రోగులు తమకు సరైన వైద్యం అందడం లేదని ఫిర్యాదులు చేయడం, ప్రతిపక్షాల విమర్శలు, నిపుణుల సలహాలతో జిల్లా, ప్రాంతీయ, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో ఇతర రోగుల కోసం ఉద్దేశించిన పడకలను కరోనా చికిత్స కోసం కేటాయించారు. దీనితో ఆ రోగులకు సేవలందించాల్సిన పడకల సంఖ్య తగ్గిపోయింది. పోనీ ఆ పడకల్లో కరోనా రోగులకు సేవలందుతున్నాయా అంటే అదీ లేదు. ప్రభుత్వం జారీ చేసిన తాజా గణాంకాల ప్రకారమే 42 ఆస్పత్రుల్లో 7862 బెడ్లుండగా అందులో కేవలం 2712 మంది రోగులుండగా 5150 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా కేటాయించిన బెడ్ల విషయంలోనూ హేతుబద్ధంగా, శాస్త్రీయంగా లేకపోవడంతో కొన్ని జిల్లాల్లో రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి ఏర్పడితే, మరికొన్ని జిల్లాల్లో కరోనా రోగులు లేకపోయిన వందలాది బెడ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి.
వరంగల్ అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్లు సరిపోకపోవడంతో రోగులు అనివార్యంగా ప్రయివేటు ఆస్పత్రులకు ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. ఆయా జిల్లాల్లో క్రమక్రమంగా కేసులు పెరుగుతున్న విషయం అవగతం అవుతున్నా, అంతే వేగంతో బెడ్లను పెంచకపోవడంతో రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. వరంగల్ అర్బన్లో ఎం.జీఎం హాస్పిటల్లో మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో చికిత్స అందుతున్నది. ఈ ఆస్పత్రిలో కేవలం 255 బెడ్లు ఏర్పాటు చేయగా పూర్తిగా నిండిపోయాయి. ఈ జిల్లాల్లో గత కొంతకాలంగా ప్రతి రోజూ వందకు అటు, ఇటుగా కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగూడెం జిల్లా ఆస్పత్రిలో 24 బెడ్లు, గద్వాల జిల్లా ఆస్పత్రిలో 73 బెడ్లకు వందశాతం రోగులున్నారు.
ఇక కొత్త కేసులు రోజూ నమోదవుతుండడంతో వారిని చేర్చుకోలేని పరిస్థితి. మరోవైపు వికారాబాద్ జిల్లాలో 300 బెడ్లు, జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో 160, ఉట్నూరు జిల్లా ఆస్పత్రిలో 80 బెడ్లు ఒక్క రోగి లేకుండా ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల నామమాత్రంగా రోగులున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రోగులు పెరుగుతున్న జిల్లాలను గుర్తించి ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేయాలని మేధావులు, నిపుణులు సూచిస్తున్నారు.
Courtesy: NT